అమరావతి: వెంకటాయపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన శ్రీనివాస కల్యాణం సందర్భంగా టిటిడి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలతో శోభాయమానంగా విరాజిల్లుతోంది. ఆలయం చుట్టూ ఏర్పాటుచేసిన దేవతామూర్తుల విద్యుత్ దీపాల కటౌట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
శ్రీవారి ఆలయ ప్రాంగణం చుట్టూ మొత్తం 17 విద్యుత్ దీపాల కటౌట్లు ఏర్పాటుచేశారు. వీటిలో దశావతారమూర్తి, ఆభరణాల వేంకటేశ్వరుడు, మహావిష్ణువు, లక్ష్మీ వేంకటేశ్వరస్వామి, స్వామివారి పాదాలు, శంఖుచక్ర నామాలు, పద్మావతి వేంకటేశ్వరుడు, లక్ష్మీదేవి, గోపాలకృష్ణుడు, ఆదిశేషుడు, పద్మావతి ఆనందనిలయం ఉన్నాయి.
ప్రవేశద్వారాల వద్ద స్వాగత ఆర్చీలు, రోడ్డుకు ఇరువైపులా 60 ఎల్ఈడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. నమూనా ఆలయ గోపురం, ఆనందనిలయం, ప్రాకార మండపాన్ని 5 వేల ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడి లైట్లతో అద్భుతంగా అలంకరించారు. ఇందుకోసం 25 జనరేటర్స్ ఏర్పాటు చేశారు. ఎస్వీబీసీ ప్రసారాలు, ఆలయంలో జరిగే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను భక్తులు తిలకించేందుకు వీలుగా 18 పెద్ద ఎల్ఇడి తెరలను ఏర్పాటు చేశారు.