Suryaa.co.in

Andhra Pradesh

సమయం లేదు… సమరానికి దిగాల్సిందే

బీసీలంతా ఏకమై పోరాడితేనే బ్రతుకులు బాగుపడతాయి
బీసీలను దగా చేసిన జగన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుదాం
సగర, ముదిరాజ్, సూర్యబలిజ సాధికార సమితుల శిక్షణా కార్యక్రమంలో కొల్లు రవీంద్ర

బీసీలంతా ఏకమై పోరాడితే సాధించలేనిది ఏదీ లేదు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని బీసీలందరినీ అణచివేయడమే లక్ష్యంగా అడుగులు వేశారు. సంక్షేమ పథకాలు రద్దు చేసి దగా చేశారని తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సగర/ఉప్పర, ముదిరాజ్, సూర్యబలిజ సాధికార కమిటీ సభ్యుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా జగన్ రెడ్డి పాలనలో బీసీలు అత్యంత దుర్బరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.

56 కార్పొరేషన్ల పేరుతో హడావుడి చేసి, ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించినట్లు చెబుతున్న జగన్ రెడ్డి ఆయా కార్పొరేషన్ల ద్వారా ఎంత ఖర్చు చేశారన్న ప్రశ్నకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు అని ప్రశ్నించారు. బీసీలకు చెందిన 28 పథకాలు రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పథకాలు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయంలో బీసీల కోసం నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించిన బీసీ భవన్స్, కమ్యూనిటీ హాల్స్, దోబీ ఘాట్స్, సొసైటీ బిల్డింగ్స్‌ను నాలుగేళ్లుగా పూర్తి చేయకుండా పాడుబెట్టారు. విదేశీ విద్య, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, స్టడీ సర్కిల్స్, పెళ్లి కానుకలు, ఆదరణ వంటి పథకాలన్నీ రద్దు చేసి దగా చేశారన్నారు.

బీసీలను ఇంకా ఓటర్లుగానే చూస్తూ, వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తున్న జగన్ రెడ్డిని సాగనంపే వరకు తెలుగుదేశం పార్టీ, బీసీ విభాగం అలుపెరుగక శ్రమిస్తుందన్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదు.. ఇప్పటి నుండే కమిటీలన్నింటినీ పూర్తి చేసుకుని ప్రజల్లోకి వెళ్లి డోర్ టూ డోర్ ప్రచారం చేయాలని, జగన్ రెడ్డి అరాచకాలను గడపగడపకూ వివరించాలన్నారు.

కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ నాలెడ్జి సెంటర్ ఛైర్మన్ గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ జగన్ రెడ్డి.. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు రద్దు చేసి బీసీలు రాజకీయంగా ఎదగకుండా చేశారన్నారు. ప్రస్తుత కాలంలో ఆస్తులు కలిగిన వారికి ఉండే గౌరవం వేరు. ఆ ఉద్దేశ్యంతో చంద్రబాబు భూమి కొనుగోలు పథకం ప్రవేశపెట్టి పేదలకు భూములు పంచితే, జగన్ రెడ్డి బీసీల నుండి 8వేల ఎకరాల భూముల్ని లాక్కున్నారు. చదువుకుంటే ఎంతటి పేదరికంలో పెరిగినా భవిష్యత్ బాగుంటుందనే లక్ష్యంతో చంద్రబాబు విదేశీ విద్య, స్కిల్ డెవలప్ మెంట్, స్టడీసర్కిల్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెడితే జగన్ రెడ్డి వాటిని రద్దు చేసి బీసీల పిల్లలు ఇక్కడే చదువుకోవాలి, ఉన్నత చదువులు ఎందుకు అనే పరిస్ధితి కల్పించారు.

పైగా నవరత్నాల పేరుతో నకిలీ రత్నాలను ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. రూపాయి చేతిలో పెట్టి వంద రూపాయలు లాక్కుంటున్నారన్నారు. ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని, భవిష్యత్తులోనూ ప్రజలు చూడరన్నారు. బీసీలంతా ఏకమై, జగన్ రెడ్డిపై తిరుగబాటు చేసి బీసీల హక్కుల్ని, అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కారణంగానే ఓటర్లుగా ఉన్న బీసీలు ప్రస్తుతం రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారు. ఎన్టీఆర్ 20శాతంతో రిజర్వేషలు మొదలు పెడితే చంద్రబాబు 34శాతం వరకు పెంచారు. జగన్ రెడ్డి బీసీలను ఉద్దరిస్తా, అండగా నిలుస్తానని చెప్పి.. రిజర్వేషన్లు కుదించి దగా చేశారు. పథకాలు రద్దు చేసి, అభివృద్ధి నాశనం చేసి ఇంకా బీసీలను ఉద్దరిస్తానని చెప్పుకోవడం హాస్యాస్పదం. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే, బీసీలకు రాజకీయంగా ఆర్ధికంగా సామాజికంగా మేలు జరుగుతుందన్నారు.

తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గంజాం రాఘవేంద్ర మాట్లాడుతూ.. ఎన్నికల యుద్ధంలో గెలవాలంటే ప్రచార యుద్ధంలో గెలవాలి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరి మీదా ఉంది. ఒంటిపై చొక్కా లేకుండా అయినా ఉన్నారేమో గానీ, చేతిలో ఫోన్, సోషల్ మీడియాలో అకౌంట్ లేనివారు ఎక్కడున్నారు.? అందుకే తెలుగుదేశం పార్టీ బీసీ విభాగంలో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని, తాము చేసే కార్యక్రమాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటుగా, జగన్ రెడ్డి అరాచకాలపైనా సోషల్ మీడియా వేధికగా ప్రచారం చేయాలి.

జగన్ రెడ్డి బీసీలకు చేస్తున్న దగా, మోసాన్ని ప్రజలకు తెలియజేయడంలో 40శాతం జనాభా కలిగిన మనం మన బాధ్యతను గుర్తెరిగి పోరాటం చేయాలని, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేశ్ ఇచ్చిన సెల్ఫీ ఛాలెంజ్‌ను బీసీ విభాగం తరపున కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కమిటీలో సభ్యులుగా చేరిన వారితో శ్రీ కొల్లు రవీంద్ర ప్రమాణ స్వీకారం చేయించారు.

కార్యక్రమంలో సగర సాధికార కమిటీ కన్వీనర్ జంపన శ్రీనివాస్, ముదిరాజ్ సాధికార కమిటీ కన్వీనర్ పి.ఎల్ రావు, సూర్య బలిజ సాధికార కమిటీ కన్వీనర్ రాళ్ల కొట్టు రాము, విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ కోఆర్డినేటర్ సింహాద్రి కనకాచారి సగర ముదిరాజు సూర్య బలిజ సాధికార కమిటీల కోఆర్డినేటర్ కడలి గోపాలరావు సహా తెలుగుదేశం పార్టీ సాధికార కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE