– అధికారులకు సీఎం ఆదేశం
అమరావతి: వేసవిలో విద్యుత్ కొరత లేకుండా చూడాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. విద్యుత్ కొరత వల్ల కోతలనే మాట వినిపించకూడదని అధికారులకు సూచించారు.. కరెంట్ కోతలు లేకుండా అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలన్నారు. విద్యుత్ శాఖపై సీఎం జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు కనెక్షన్లపై సమీక్షించిన సీఎం.. అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
బొగ్గు నిల్వలపైనా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో జాప్యం ఉండకూడదని.. దరఖాస్తు చేసిన నెలలోనే కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. మార్చి నాటికి మరో 20వేల విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తవుతోందని తెలిపారు.