Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వాస్తవాలు తొక్కిపెడుతూ, ఈ ప్రభుత్వం ఆయన ప్రాణాలతో చెలగాటమాడుతోంది

• టీడీపీ అధినేతకు ఏం జరిగినా వైసీపీ సర్కార్, జగన్ రెడ్డే బాధ్యులు
• డీ హైడ్రేషన్, చర్మసంబంధిత సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబుని తక్షణమే ఆయన వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో కేంద్రప్రభుత్వ వైద్యసంస్థ ఎయిమ్స్ కో, మంచి ప్రైవేట్ ఆసుపత్రికో తరలించాలి
• చంద్రబాబుని పరిశీలించిన ప్రభుత్వ వైద్యులు వాస్తవాలు చెప్పకుండా ఈ ప్రభుత్వం వారి గొంతు నొక్కేసింది
• స్టెరాయిడ్స్ అధికంగా ఉన్న మందుల్ని ప్రభుత్వ వైద్యులు చంద్రబాబుకి రాసిచ్చారు. ఆ మందులు వాడితే ఆయన ప్రాణాలకే ప్రమాదం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, బొండా ఉమామ హేశ్వరరావు, కిమిడి కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పంచుమర్తి అనురాధ, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నెట్టెం రఘురామ్, బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యరావు, కోవెలమూడి రవీంద్ర, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చేయని తప్పుకి, ఈ ప్రభుత్వ రాజకీయ కుట్రలవల్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు 34 రోజులుగా జైల్లోనే ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాము మొదట్నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రభుత్వం జైల్లో ఆయనకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో నేడు ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్యనేతలతో, చంద్రబాబునాయుడు జైల్లో పడుతున్న ఇబ్బందులు…ఆయన ఆరోగ్యపరిస్థితిపై చర్చించారు. ప్రధాన ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుని టీడీపీనేతలంతా ముక్తకంఠంతో ఖండించారు. సమావేశానంతరం అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడిన వివరాలు ..

డీ హైడ్రేషన్ వల్ల చర్మసంబంధిత సమస్యలు తలెత్తి, చంద్రబాబునాయుడు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు
“ చంద్రబాబునాయుడి ఆరోగ్యపరిస్థితిపై చర్చించడానికి అందుబాటులో ఉన్న ప్రధాన నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు కేవలం టీడీపీ అధినేత మాత్రమే కాదు.. దేశానికి లభించిన ఆస్తి. 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవమున్న గొప్ప రాజకీయ నాయకుడు. క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేసిన వ్యక్తి, 73 ఏళ్ల వయసులో కూడా ఆయన యువకుడిలానే పనిచేస్తూ, అందరినీ ఆశ్చ ర్యానికి గురిచేస్తుంటారు.

ఆయన పాటించే ఆహారపు అలవాట్లు, వ్యాయాయం, క్రమశిక్షణలే ఆయన ఆరోగ్యసూత్రాలు. నిత్యం ప్రజల గురించి ఆలోచించడం, రాష్ట్రంపై తపన తప్ప ఆయనకు మరేవి పట్టవు. చంద్రబాబునాయుడు జైల్లో డీ హైడ్రేషన్ తో బాధపడుతున్నారు. ఆయనకు ఈప్రభుత్వం, ఈ సైకో ముఖ్యమంత్రి కనీసం స్నానా నికి వేడినీళ్లు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయలేదు. డీ హైడ్రేషన్, చర్మసంబంధిత సమస్యల వల్ల చంద్రబాబు చాలా ఇబ్బంది పడుతున్నారు.

దాంతో ఆయన దాదాపు నెల రోజుల్లోనే 5 కిలోల బరువుతగ్గారు. సాధారణంగా ఎవరైనా నెలలో ఒక కేజీ తగ్గుతారు. కానీ ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించినందునే ఒకేసారి 5 కిలోల బరువు తగ్గారు. ఇది నిజంగా ప్రమాదకరం. ఒకేసారి అంత బరువుతగ్గితే దాని ప్రభావం ఇతర అవయవాలపై పడే అవకాశముందని వైద్యులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాతో పాటు ప్రజలు, చంద్రబాబు అభిమానులు తీవ్రమైన ఆందోళనకు గురవడం సహజం.

చంద్రబాబుని పరిశీలించిన ప్రభుత్వ వైద్యులు వాస్తవాలు చెప్పకుండా ఈ ప్రభుత్వం వారి గొంతు నొక్కేసింది. స్టెరాయిడ్స్ అధికంగా ఉన్న మందుల్ని ఆయనకు రాసిచ్చారు. అవి వాడితే చంద్రబాబు ప్రాణానికే ప్రమాదం
ఇంత జరుగుతున్నా ఈ ప్రభుత్వంగానీ, జైలు అధికారులుగానీ ఏనాడూ ఆయన వ్యక్తిగత వైద్యుల్ని జైలుకు అనుమతించలేదు. ఆయన పరిస్థితిని గమనించి, గతంలోనే చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో వైద్యసేవలు అందించినట్టయితే, నేడు ఆయన ఆరోగ్యం ఇంతలా క్షీణించేది కాదు. చంద్రబాబునాయుడి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆయన 5 కిలోల బరువుతగ్గ డం ప్రమాదకరమని ఆయన్ని పరీక్షించిన వైద్యులు చెబితే, ఈ ప్రభుత్వం వాస్తవాలు బయటకు రాకుండా వైద్యులు గొంతెత్తకుండా చేసింది.

చంద్రబాబునాయుడి ఆరోగ్య పరిస్థితిపై అవసరమైతే తాము లిఖిత పూర్వకంగా రాసి ఇస్తామని, ఆయనకు మెరుగై న వైద్యసేవలు అవసరమని ఆయన్ని పరిశీలించిన వైద్యులు చెప్పినా, జైలు అధికారులు ఖాతరు చేయలేదు. ప్రభుత్వ ఆదేశాలప్రకారం వైద్యుల్ని భయపెట్టి, చంద్రబాబుకి ఏమీ కాలేదని ఇంకా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం భయపెట్టి వైద్యులతో అవాస్తవాలు చెప్పిస్తోంది.

చంద్రబాబుని జైల్లో పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు ఆయనకు రాసిచ్చిన మందుల్లో ఎక్కువ స్టెరాయిడ్స్ ఉన్నాయి. ఆయనకు వచ్చిన సమస్యకు.. వైద్యులు రాసిచ్చిన మందులకు సంబంధంలేదు. కేవలం వైద్యులతో తప్పుడు సమాచారం వెల్లడించి, ప్రజల్ని మభ్యపెట్టి , ఏదోరకంగా చంద్రబాబుని మరింత ఇబ్బందిపెట్టాలనే దుర్మార్గపు ఆలోచనలో ప్రభుత్వముంది.

తక్షణమే ప్రభుత్వం చంద్రబాబుకి మెరుగైన వైద్యసేవలు అందించాలి. ఆయన వ్యక్తిగత వైద్యులతో పరీక్షలు చేయించి, వారి పర్యవేక్షణలోనే ఆయన్ని వెంటనే కేంద్రప్రభుత్వ వైద్యసంస్థ ఎయిమ్స్ కో, లేక మంచి ప్రైవేట్ ఆసుపత్రికో తరలించాలి.

కాబట్టి తెలుగుదేశం పక్షాన, ప్రజల తరుపున ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబునాయుడిని తక్షణమే ఆయన వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో ఉండే ఏర్పాట్లు చేసి, వైద్యబృందంతో సహా మాజీ ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వ వైద్యసంస్థ అయిన ఎయిమ్స్ లో నాణ్యమైన వైద్యసేవలు అందే ఏర్పాట్లు చేయాలి. ఎయిమ్స్ లోఉంచడం వీలుకాకుంటే, కనీసం మంచి ప్రైవేట్ ఆసుపత్రికైనా తరలించాలి. ఇదంతా తక్షణమే జరిగేలా ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల్ని సంప్రదించకుండా, ఆయన శరీరాన్ని దెబ్బతీసే మందులు అందించి ఆయన ప్రాణాలకు హాని తలపెట్టాలన్నదే ప్రభుత్వ పన్నాగం. చంద్రబాబు ఆరోగ్య పరి స్థితి దృష్ట్యా, ఆయనకు వెంటనే ఉత్తమమైన వైద్యసేవలు అందించేలా చూడాలని న్యాయస్థానాల్ని కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాం.
చంద్రబాబు నాయుడికి ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రే బాధ్యులవుతారు. తక్షణమే టీడీపీ అధినేతకు నాణ్యమైన, మెరుగైన వైద్యసేవలు అందించాలి.” అని అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE