తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థకు చిహ్నంగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం వీఆర్ఏలుగా పనిచేస్తున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగానే రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 20,555 మంది వీఆర్ఏలను సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి సోమవారం వీఆర్ఏల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు.
రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ అంశాలపై ఆదివారం రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నీరటి, మసూరు, లషర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలుచుకుంటున్న, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ఈ సమావేశంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ఇవాళ విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని వీఆర్ఏల జేఏసీ నేతలకు అందజేశారు. దాంతో రాష్ట్రంలోని వీఆర్ఏలు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.