– టీడీపీ కార్యాలయంలో తిరువూరు కార్యకర్తల నినాదాలు
– భారీగా తరలివచ్చిన రమేష్రెడ్డి వర్గీయులు
మంగళగిరి: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి వ్యతిరేకంగా తిరువూరు టీడీపీ కార్యకర్తలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. మాకు కొలికపూడి వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తిరువూరు కార్యకర్తలను సముదాయించారు.
తిరువూరు నుంచి వచ్చిన ముఖ్య నేతలతో పల్లా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. పార్టీ గీత దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యకర్తల అభిప్రాయాలను చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
తిరువూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత అలవాల రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. కొలికపూడి ఏకంగా టీడీపీ నాయకత్వానికే అల్టిమేటం ఇచ్చారు. ఈ విషయాన్ని టీడీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది.