Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రానికి అత్యున్నత విద్యాసంస్థలను తీసుకొస్తాం

– సాంకేతిక పురోగతికి ఏపీని కేంద్రంగా మార్చుతాం
– యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం.. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ముఖ్యం
– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
– ఎస్ఆర్ఎంయూలో పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలెప్మెంట్ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సీఎం

అమరావతి: రానున్న రోజుల్లో రాష్ట్రానికి అత్యున్నత యూనివర్సిటీలను, విద్యాసంస్థలను తీసుకొస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొందని, అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే ఈ ప్రాంత రూపురేఖలు, పరిస్థితులు మారిపోయేవని అన్నారు. రాజధానిలో త్వరలోనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులను ప్రారంభిస్తామని అన్నారు.

ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్ వర్క్‌షాప్‌లో మంగళవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అంతకముందు యూనివర్సిటీలో రూ.700 కోట్ల భవనాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు, మేథావులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు.

30 శాతం ఐటీ ఉద్యోగులు తెలుగువారే

‘1995లో ఐటీ గురించి ఆలోచించి హైదరాబాద్‌కు కంపెనీలు తీసుకొచ్చాను. ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ ఆదాయం ఆర్జించేది భారతీయులే. విదేశాల్లో ఉన్న ఐటీ ఉద్యోగుల్లో 30 శాతం మంది మన తెలుగువారే ఉన్నారు. నేను నిత్య విద్యార్థిని. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటా. గతంలో జనాభా పెరుగుదల మన దేశానికి పెద్ద సమస్యగా ఉంది. జనాభా పెరుగుదల వల్ల అనేక సమస్యలు వస్తాయని అనుకున్నాం అప్పటి పరిస్థితులను బట్టి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్యం ఒక సవాళుగా మారుతోంది.

చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాలలో జనాభా తగ్గుదల వల్ల ఆ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. అందుకే జనాభా పెరుగుదలపై దృష్టి పెట్టాలని కోరుతున్నా. గతంలో ఇద్దరు పిల్లలను కంటే ప్రసూతి సెలవులు ఇచ్చే వారం… ఇప్పుడు ఎంతమందిని కన్నా ప్రసూతి సెలవులను ఇస్తున్నాం. జనాభాను పెంచాలనే ప్రతిపాదనతో ముందుకెళ్తున్నాం. భారతదేశం కుటుంబ వ్యవస్థలో బంధం ఉంటుంది. కానీ పరాయి దేశాల్లో నీ పిల్లలు, నా పిల్లలు అన్న విధానం ఉంటుంది.’ అని అన్నారు.

అమరావతికి లక్ష కోట్ల పెట్టుబడులు

‘ప్రధానిమోదీ వికసిత్ భారత్‌తో ముందుకెళ్తుంటే, మేం విజన్ 2047తో ముందుకెళ్తాం. స్వర్ణాంధ్ర విజన్-2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యం పెట్టుకున్నాం. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని రూ.58 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ లక్ష్యానికి చేరుకోవాలంటే 15 శాతం వృద్ధి రేటు సాధించాల్సి ఉంది. విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచిన పది సూత్రాల లక్ష్య సాధనకు ప్రభుత్వం ముందుకెళ్తోంది.

పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వంతో చేతులు కలపాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉపాధి, ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీంతో రాబోయే రోజుల్లో లక్షకోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి.  భారతదేశ దీర్ఘకాలిక వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రానున్న కాలంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పాలన, విద్య, పరిశ్రమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అనుసంధానించేందుకు నిబద్ధతో పనిచేస్తాం.

ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, డీప్ టెక్నాలజీ, ఐఓటీ, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక పురోగతికి కేంద్రంగా మార్చుతాం. అమరావతి రీలాంచ్ కార్యక్రమాలకు ప్రధానిని ఆహ్వానిస్తాం. అమరావతిని 100 శాతం సౌరశక్తితో నడిచే నగరంగా మార్చుతాం.’ అని సీఎం అన్నారు.

హార్డ్‌వర్క్ కాదు… స్మార్ట్‌వర్క్ ముఖ్యం

‘మహిళలు, యువతకు సాధికారత కల్పించడానికి అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. ఉద్యోగాల కల్పన చాలా ముఖ్యం. ప్రస్తుతం హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ముఖ్యం. చదువుకున్న మహిళలు ఇంటి నుంచే పనిచేసి ఉపాధి పొందే మార్గాలు అన్వేషిస్తున్నాం. మహిళలు మగవారికంటే బాగా పనిచేయగలుగుతారు. విద్యలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తీసుకొచ్చాం.

50 వేలమంది విద్యార్థులకు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం కల్పిస్తామని ముందుకొస్తే ఎస్ఆర్ఎం హామీ ఇస్తే అదనంగా 200 ఎకరాల భూమి, నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. క్వాంటం కంప్యూటింగ్, డీప్ టెక్నాలజీ, వైద్య, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఎస్ఆర్ఎం 10వేల కుటుంబాలను దత్తత తీసుకుని విద్య, ఉపాధి అవకాశాలకు మద్ధతు ఇవ్వాలి.

సంపద సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలి. పేదరిక నిర్మూలన లక్ష్యంతో పీ4ను ఉగాది నాడు అధికారికంగా ప్రారంభిస్తాం. ఆంధ్రప్రదేశ్‌కు అత్యున్నత యూనివర్సిటీలను, విద్యా సంస్థలను తీసుకువస్తాం. మహిళల సంక్షేమం కోసం పని ప్రదేశాలలో పిల్లల సంరక్షణ కేంద్రాలు, శానిటరీ న్యాప్‌కిన్ వెండింగ్ మెషీన్‌లను ఏర్పాటు చేస్తాం.’ అని సీఎం అన్నారు

LEAVE A RESPONSE