– రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా రాజధాని
– రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ది మా సిద్దాంతం
– రాజధాని ప్రారంభోత్సవం కూడా మోదీ చేతుల మీదుగానే చేస్తాం
– మోదీ నాయకత్వంలో బలమైన భారత్ ఆవిష్కృతం… ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది
– పహల్గాం దాడి ఘటనతో మోదీలో ఆవేదన చూశాను
– దేశం కోసం ప్రధాని తీసుకునే అన్ని నిర్ణయాలకు మద్దతుగా ఉంటాం
– అమరావతి పున: ప్రారంభ సభలో సిఎం చంద్రబాబు నాయుడు
– హమ్ ఆప్ కే సాత్ హై అంటూ… జాతీయ జెండాల ప్రదర్శన మధ్య వందేమాతరం నినాదాలతో మోదీకి మద్దతు పలికిన సీఎం చంద్రబాబు
– భారత్ మాతాకీ జై అంటూ చంద్రబాబుతో గొంతు కలిపిన ప్రధాని మోదీ
అమరావతి పనుల పున:ప్రారంభానికి ఇక్కడికి వచ్చిన మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ కి రాష్ట్ర ప్రజల తరుపున స్వాగతం తెలుపుతున్నాను. ముందుగా మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. గతంలో ఎప్పుడు మోదీ ని కలిసినా చాలా ఆహ్లాదకరంగా భేటీ జరిగేది. కానీ మొన్నటి మా ఢిల్లీ భేటీ చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం పహల్గాం దాడి ఘటన. తొలిసారి ఆయనలో అంత బాధ చూశాను.
ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అనే ఆవేదన మోదీ లో చూశాను. అందుకే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల తరుపున చెపుతున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోదీ , కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేం మద్దతుగా ఉంటాం. మోదీ జీ హమ్ ఆప్ కే సాత్ హై! ఆంధ్రప్రదేశ్ కే పాంచ్ కరోర్ లోగ్ ఆప్ కే సాత్ హై. పూరా దేశ్ ఆప్ కే సాత్ హై! ఈ సభలో ఉన్న అందరూ ఒక సారి గట్టిగా వందేమాతరం అని చెప్పండి. వందేమాతరం. వందేమాతరం…వందేమాతరం
రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి
2014లో రాజధాని లేని పరిస్థితుల్లో మనం పాలన ప్రారంభించాం. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, భౌద్దుల ఆధ్యాత్మిక కేంద్రం గా, కృష్ణమ్మ తీరాన విలసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేశాం. అమరావతి కేవలం ఒక నగరం కాదు… 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్. ప్రజల ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతి రూపం. ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా 29 వేల మంది అన్నదాతలు, 34 వేల ఎకరాలు రాజధానికిచ్చారు. అద్భుత రాజధాని నిర్మాణం తలపెడితే….తరువాత వచ్చిన ప్రభుత్వం విధ్వంసం చేసింది.
నాటి ప్రభుత్వ దమనకాండ పై రైతులు, రైతు కూలీలు, మహిళలు తిరుగులేని పోరాటం చేశారు. ఈ సమయంలో జరిగిన న్యాయ పోరాటంలో న్యాయస్థానాలు అమరావతిని బతికించాయి. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజాతీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరిపోసుకుంది. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి, కేంద్ర సహకారంతో, మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాలను పట్టాలెక్కించాం.
నేడు మోదీ చేతుల మీదుగా అమరావతి పనులను రీ స్టార్ట్ చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి పౌరుడు సగర్వంగా ‘నా రాజధాని అమరావతి’ అని చెప్పుకునేలా నిర్మిస్తాం. 2015లో ప్రధాని చేతుల మీదుగా శంకుస్ధాపన చేసిన రాజధానిని విధ్వంసం చేశారు. మళ్లీ నేడు మీ చేతుల మీదుగా పనులు ప్రారంభించాం. రేపు మీరే మళ్లీ ప్రారంభోత్సవం చేయాలని కోరుతున్నాం.
ఒకే రోజు రూ.49,000 కోట్ల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. వీటికి అదనంగా రూ.5,028 కోట్లతో చేపట్టే 9 కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.3,680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 8 జాతీయ రహదారులను ప్రధాని ఈ రోజు ప్రారంభించారు. మరో రూ.254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అమరావతి, కేంద్ర ప్రాజెక్టులు కలిపి మొత్తం రూ.57,962 కోట్ల విలువైన 94 ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
వరల్డ్ క్లాస్ క్యాపిటల్
బ్లూ అండ్ గ్రీన్ సిటీగా అమరావతి ఉంటుంది. 30 శాతం ప్రాంతం పచ్చదనం, జలవనరులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం. నవ నగరాలను రాజధానిలో భాగంగా ఉంటాయి. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ గారు పలు సూచనలు చేశారు. వాటిని అమలుచేస్తాం. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, well planned city గా, భవిష్యత్ నగరంగా అమరావతి ఉంటుంది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్టుతో అన్ని ప్రపంచ దేశాలకు కనెక్టివిటీ పెంచుతాం.
ప్రపంచ స్థాయి సంస్థల ఏర్పాటుతో అమరావతి హెల్త్, ఎడ్యుకేషన్ హబ్ గా ఉండబోతోంది. మోదీ సూచించిన జపాన్ మియావాకీ తరహా పచ్చదనం పెంచే విధానాన్ని అమలు చేస్తాం. Utilities అన్నీ వయాడక్ట్ పద్దతిలో అందిస్తాం. గ్రీన్ ఎనర్జీతో పర్యావరణ అనుకూలంగా రాజధాని. ఇన్ లాండ్ వాటర్ వేస్, సైక్లింగ్ ట్రాక్స్, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టం, వాకింగ్ పాత్ తీసుకువస్తాం. XLRI బిజినెస్ స్కూల్, గ్లోబల్ లీడర్షిప్ సెంటర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం.
అభివృద్ధి వికేంద్రీకరణ మన సిద్దాంతం
రాజధాని మాత్రమే కాదు… 26 జిల్లాల్లో ప్రతీ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం. అభివృద్ది వికేంద్రీకరణ చేపడతాం. 2014-19 మధ్య కేంద్ర ప్రభుత్వ సంస్థలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. కేంద్ర సహకారంతో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో నదుల అనుంసధానం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం.
నాలెడ్జ్, ఫైనాన్సియల్ క్యాపిటల్ విశాఖ
కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ భోగాపురం ఎయిర్పోర్టు పనులు మొదలు అయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ను నిలబెట్టేందుకు కేంద్రం రూ. 11,440 కోట్లు ప్యాకేజ్ ప్రకటించింది. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖకు వస్తున్నాయి. రూ.1.43 లక్షల కోట్లతో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీని అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నాం.
రాయలసీమ దశ మారుతోంది
వెనుకబడిన రాయలసీమపై మరింత ఫోకస్ పెట్టాం. కేంద్ర మద్దతు కోరుతున్నాం. సీమలో డిఫెన్స్ సంస్థలు, కర్నూలులో హై కోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రధాని సాయం కోరుతున్నాం. లేపాక్షి-ఓర్వకల్ కారిడార్ లో ఏరోస్పేస్, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకువస్తాం.
రామాయపట్నంలో బిపిసిఎల్ రిఫైనరీ వస్తుంది. తిరుపతిని అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా విస్తరిస్తాం. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాం. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్లకు ఇప్పటికే కేంద్రం నిధులు కేటాయించింది. రాష్ట్ర ప్రజల కోసం ప్రణాళికతో పనిచేస్తున్నాం. మీ సహకారం, సాయంతో స్వర్ణాంధ్ర సాధిస్తాం.
విశాఖలో NTPC ప్రాజెక్టుకు మీరు శంకుస్థాపన చేశారు. నేడు అమరావతి పనులను ప్రారంభించారు. రేపు రాయలసీమ లో వచ్చే ప్రాజెక్టులను కూడా మీ చేతుల మీదుగా మొదలుపెట్టాలని మేం కోరుతున్నాం. రాష్ట్రం పట్ల మీరు చూపే ఆదరణకు మరో మారు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
జై అమరావతి…. జై ఆంధ్రప్రదేశ్..జై హింద్!