(వెంకట్,ఢిల్లీ)
దేశ రాజధాని ఢిల్లీలో వానలు దంచి కొడుతున్నాయి.. ఓవైపు గాలి వాన బీభత్సం సృష్టిస్తుంటే మరోవైపు, తీవ్రమైన దుమ్ము ఢిల్లీని కమ్మేసింది. శుక్రవారం తెల్లవారు జామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో రాజధాని నగరం అతలాకుతలం అయింది.
దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక తీవ్రమైన ఈదురు గాలుల కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో, విమాన ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కనెక్టివిటీ విమానాలు అందుకోవల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లోనే ప్రయాణికులు నిలిచిపోయారు. సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు సేవలు అందిస్తుందని ఢిల్లీ విమానాశ్రయం హామీ ఇచ్చింది. ప్రయాణికులు విమాన సంస్థల వైబ్ సైట్లు చెక్ చేసుకోవాలని సూచించింది.
విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని.. ప్రయాణికులు వైబ్ సైట్ను పరిశీలించుకోవాలని ఎయిరిండియా సూచించింది.. అంతరాయాలను తగ్గించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపింది. కొన్ని విమానాలు ఆలస్యం అవుతున్నాయని.. ఇంకొన్ని దారి మళ్లించినట్లుగా పేర్కొంది. విమాన షెడ్యూల్ను చెక్ చేసుకోవాలని సూచించింది.
ఇక ఢిల్లీ లోని ద్వారక, ఖాన్ పూర్, సౌత్ ఎక్స్టెన్షన్ రింగ్ రోడ్, మింటో రోడ్, లజ్పత్ నగర్ మరియు మోతీ బాగ్ వంటి ప్రాంతాల్లో నీరు నిలిచి పోయింది. ఇక భారీ ఈదురు గాలుల కారణంగా చెట్లు కూలిపోయాయి. కొన్ని కొమ్మలు రహదారులపై పడిపోయాయి. అయితే, అధికారులు నష్టాన్ని అంచనా వేయలేదు. వీలైనంత వరకు ప్రజల్లో ఇళ్ల ల్లోనే ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఉష్ణోగ్రత 19.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఢిల్లీ అంతటా భారీ వర్షాలు, తుఫానులు సంభవిస్తాయని.. గంటకు 70-80 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
శనివారం వరకు ఢిల్లీలో భారీ వర్షాలు, ఉరుములు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మే నెలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఇప్పుడు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది..