నారా లోకేష్ యువగళం యాత్రను విజయవంతం చేస్తాం

– గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు

గుడివాడ, జనవరి 20: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనం కోసం యువగళం పాదయాత్రను చేపడుతున్నారని, ఈ యాత్రను విజయవంతం చేస్తామని కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చెప్పారు. శుక్రవారం గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రావి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో ఈ నెల 27వ తేదీ నుండి 400 రోజుల పాటు యువగళం పాదయాత్ర కొనసాగనుందని తెలిపారు.

ఇప్పటికే వైసీపీ నేతలు జిమ్మిక్కులు చేయడం మొదలుపెట్టారన్నారు. యువగళం పాదయాత్ర పేరు చెబితేనే భయపడుతున్నారని అన్నారు. నారా లోకేష్ పాదయాత్ర జరిగి తీరుతుందని, ఖచ్చితంగా విజయవంతం చేస్తామన్నారు. రాష్ట్రంలో యువతకు న్యాయం చేసేందుకు నారా లోకేష్ పోరాడుతున్నారని తెలిపారు. యువగళం పాదయాత్రకు యువత మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారన్నారు. అక్రమ కేసులు బనాయించినా ఎక్కడా వెనక్కి తగ్గలేదన్నారు.

ప్రజలు ఇచ్చిన ఒక్క అవకాశాన్ని జగన్మోహనరెడ్డి వినియోగించుకోలేదని అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ప్రజలపై ఎన్నో భారాలను మోపుతూ వస్తున్నారన్నారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రానుందని తెలిపారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి వంటి అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించగలిగామని చెప్పారు.

యువగళం పాదయాత్ర ద్వారా అన్నివర్గాల ప్రజల సమస్యలను నారా లోకేష్ తెలుసుకుంటారని అన్నారు. ఆ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం జరిగే విధంగా పోరాడటం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రావి చెప్పారు.

Leave a Reply