Suryaa.co.in

Andhra Pradesh Uncategorized

సంక్షేమానికి తొలి ప్రాధాన్యం

వెలగపూడి : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంపై సీఎం పలు సూచనలు చేశారు. సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడిన బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాల్సివుందన్నారు.

తమ ప్రభుత్వంలో బడుగుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పీ4లో భాగంగా సమాజంలో అట్టడుగున ఉన్న పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. డ్వాక్రా, మహిళా సంఘాల ద్వారా పేదలను గుర్తించి వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకువచ్చేందుకు వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ ప్రెన్యూర్ అనే నినాదాన్ని ముందుకు తీసుకువచ్చామన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండేలా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం వెల్లడించారు.

అరకు కాఫీకి బ్రాండింగ్.. చేనేత కార్మికులకు జీఎస్టీ రద్దు

గిరిజన సంక్షేమంలో భాగంగా అరకు కాఫీని ప్రోత్సహించాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రానున్న ఐదేళ్లలో అదనంగా లక్ష ఎకరాల్లో అరకు కాఫీ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించామన్నారు. కాఫీలో అంతరపంటగా వేసే నల్ల మిరియాలు, స్ట్రాబెర్రీ, అవకాడో, యాపిల్, జీడి వంటి పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలని సూచించారు. గిరిజన ఉత్పత్తుల పరిరక్షణకు అవసరమైతే డ్రోన్ టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. సేంద్రియ సేద్యానికి అరకుకు మంచి అవకాశాలు ఉన్నాయని సీఎం చెప్పారు.

LEAVE A RESPONSE