Suryaa.co.in

Telangana

ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడేదెప్పుడు?

– కాంగ్రెస్ సర్కారు వైద్యవిద్య ప్రవేశాలు చేసేదెప్పుడు ?
– డెడ్ లైన్ సమీపిస్తున్నా ఈ డైలమాకు తెరదించేదెప్పుడు ?
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: గత పదేళ్లు ప్రశాంతంగా, పకడ్బందీగా సాగిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఎందుకు ఇంత అస్థవ్యస్థంగా మార్చేసింది. ఎందుకింత గందరగోళాన్ని సృష్టిస్తోంది.

తెలంగాణ బిడ్డలకు స్థానికత విషయంలో అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 33 జీఓతోనే ఈ సమస్య అంతా.. అనవసర జీఓ తెచ్చి అడ్మిషన్ల ప్రక్రియను ఆగం చేసిన ముఖ్యమంత్రి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి.

స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు ఆదేశిస్తే.. మళ్లీ సుప్రీం తలుపు తట్టారు. అత్యున్నత న్యాయస్థానం కూడా తీర్పుచెప్పి నాలుగు రోజులు గడుస్తున్నా.. వైద్య విద్య ప్రవేశాల్లో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం కాకపోతే మరేంటి?

ఇతర రాష్ట్రాల్లో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరినా.. తెలంగాణలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనకు ఏం సమాధానం చెబుతారు?

అక్టోబర్ 31 లోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయకపోతే.. విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్న సోయి కూడా ఈ కాంగ్రెస్ సర్కారుకు లేకపోవడం దుర్మార్గం. క్షమించరాని నేరం.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లుతెరిచి.. వైద్యవిద్య అడ్మిషన్ల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టి.. డెడ్ లైన్ లోగా పూర్తిచేయాలి. తమ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలని కలలుగన్న తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లితే సహించం. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరి వల్ల ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా చూస్తూ ఊరుకోం.

LEAVE A RESPONSE