జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ఆగస్టు 25న ఆమోదం పొందింది. ఆ చట్టాన్ని 2006, ఫిబ్రవరి నుంచి 200 జిల్లాలలో క్షేత్రస్థాయిలో అమలు చేయడం ప్రారంభించారు. 2007లో మరో 170 జిల్లాలలో దానిని అమలు చేయడం ప్రారంభించారు. 2008 ఏప్రిల్ లో నారెగాను పూర్తిగా పట్టణ జనాభా కలిగిన జిల్లాలు తప్పించి దేశంలోని అన్ని జిల్లాలలో అమలు చేయడం ప్రారంభమైంది. మొదట్లో ఆ పథకాన్ని యూపీఏలోని నయా ఉదారవాద లాబీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ, ప్రభుత్వం మనుగడ వామ పక్షాల మద్దతు మీద ఆధారపడి ఉంది కాబట్టి వామపక్షాలు గట్టిగా పట్టు పట్టడంతో ప్రభుత్వానికి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టక తప్పలేదు.
కూలీల కడుపు నింపే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం పై కేంద్రం కక్ష సాధింపునకు దిగింది. 2023-24 బడ్జెట్లో ఈ పథకానికి అత్యంత తక్కువగా రూ. 60 వేల కోట్ల నిధులను విదిల్చింది. గడిచిన ఐదేండ్లలో ఇదే అత్యల్పం. దేశంలోని అర్హులైన వారికి చట్టబద్ధంగా 100 రోజుల పాటు పని కల్పించాలంటే, వచ్చే ఆర్థిక సంవత్సరం కనీసం రూ. 2.72 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయని పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ (పీఏఈజీ), ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా నాయకులు చెబుతున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలే దాదాపుగా రూ.25 వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇది పోను వచ్చే సంవత్సరానికి నికరంగా అందుబాటులో ఉండే నిధులు కేవలం రూ.35 వేల కోట్లు మాత్రమే. ఇవి మొదటి క్వార్టర్కే సరిపోవని అంచనా వేస్తున్నారు. అయితే, అవసరమైన నిధుల్లో 22 శాతం నిధులను మాత్రమే కేంద్రం కేటాయించడం గమనార్హం. మొదటి నుంచీ అమలులో ఈ పథకాన్ని చిన్నచూపు చూస్తూ వచ్చారు. ఒక ఏడాది కాలంలో కేవలం 100 రోజుల పని కల్పించడానికి మాత్రమే గ్యారంటీ ఇచ్చారు. అది కూడా కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే కల్పిస్తామన్నారు.
ఈ పరిమితులు ఉన్నప్పటికీ, ఆ పథకం ప్రజలకు ఒక ఆర్థిక హక్కును కల్పించింది. ఉపాధి కల్పించడాన్ని ప్రభుత్వం నిరాక రించడం కుదరదు. ఒక నిర్ణీత కాలంలోపు గనుక ఉపాధిని కల్పించకపోతే ఆ ఉపాధి కోరుకున్న వ్యక్తికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని రోజు రోజుకీ నీరుగారుస్తున్న వైనం చూస్తుంటే, ఈ పథకం మనుగడే ప్రశ్నార్థకం అనిపిస్తున్నది. భారత ప్రభుత్వం చేపడుతున్న అతిపెద్ద ప్రతిష్టాత్మక పథకంగా MGNREGS పేరు పొందింది.
ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా 613 జిల్లాలలోని 6349 బ్లాక్ లు/మండలాల్లోని 2.38 లక్షల గ్రామ పంచాయితీలలో అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 28.49 కోట్ల మంది కూలీల వద్ద 13.19 కోట్ల జాబ్ కార్డులున్నాయి. ఈ పథకం కింద ఉపాధి పొందుతున్న వారిలో 19.18% మంది ఎస్సీలు, 14.96 % మంది ఎస్టీలు ఉన్నారు. 2013-14 కాలంలో ఈ పథకం క్రింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 46 వ్యక్తి-పనిదినాలు, ప్రతీ వ్యక్తికీ రోజుకు 133 రూపాయల సగటు వేతనం వంతున చెల్లించారు.
భారత ప్రభుత్వం పాత పథకాలను, కొత్త పథకాలను కలిపి గ్రామీణ ప్రజలకు అదనపు ఉద్యోగ భద్రతను కల్పిస్తుంది. దీని ద్వారా గ్రామాలలోని ప్రజలు శారీరకశ్రమతో కూడిన పనుల ద్వారా వారు వారి సంపదలను సుస్థితరం చేసుకోవడం మరియు ఆహార భద్రతను మెరుగు పరచు కుంటున్నారు. నిర్వహణ వైఫల్యాలు, ప్రణాళిక రూపకల్పన, వాటి అమలులో లోపాలు ఈ పథకంలో ప్రధాన లోపాలు. ఈ పథకాలన్నిటిలో ఇచ్చే ప్రతిఫలం – ఆహారధాన్యాల తో కూడిన వేతనం. దీనికి మూడు దశాబ్దాల ముందు చేపట్టిన జవహర్ రోజ్గార్ యోజన, ఉపాధి హామీ పథకం, పనికి ఆహార పథకం, జవహర గ్రామ సమృద్ధి యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన తదితర ప్రయోగాత్మక పథకాల ద్వారా ప్రభుత్వం చివరికి ఈ పథకానికి రూపకల్పన చేసింది చెప్పవచ్చు.
యూపీఏ–2 హయాం నుంచి ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడం మొదలైంది. చాలా సంవత్సరాల పాటు బడ్జెట్లలో ఈ పథకానికి కేటాయింపు రూ. 60,000 కోట్ల దగ్గరే ఉండిపోయింది. అంటే పెరిగే ధరలకు అనుగుణంగానైనా కేటాయింపులను పెంచలేదన్నమాట. పార్లమెంటులో పెంపుదల గురించిన ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఉపాధి కోరిన ప్రతీ వారికీ ఈ పథకంలో పని కల్పించాలి గనుక బడ్జెట్లో ఎంత కేటాయించామనేది ప్రాధాన్యం లేని అంశమని, ఎంత మంది ఉపాధి కోరితే అంతమందికీ పని కల్పించేలా వాస్తవ కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వం సమాధానం చెప్తూ ఉండేది.
దాటవేత ధోరణి అనుసరిస్తూ ఉంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం 100 పనిదినాలు కల్పించి వారికి జీవనోపాధి భద్రత కల్పించడం ఉపాధి హామీ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఉపాధి హామీ పథకాన్నే తొలినాళ్ళలో మోదీ నిర్ద్వందంగా వ్యతిరేకించారు. అయితే అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేసే సాహసం చేయలేదు. కానీ పథకానికి ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయింపులలో క్షీణత ఉంటున్నది. 2019–20లో ఆ పథకం కింద అయిన వాస్తవ ఖర్చు రూ. 71,687 కోట్లు. కానీ 2020–21లో కేటాయించింది రూ. 61,500 కోట్లు మాత్రమే.
నిజానికి ఆ సంవత్సరంలో లాక్డౌన్ కారణంగా పట్టణాలలో ఉపాధి కోల్పోయి గ్రామాల బాట పట్టినవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కొంతమేరకు ఉపాధి హామీ పథకంతో ఉపశమనం పొందారు. ఉపాధిహామీ పథకానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఆత్మనిర్భర్ భారత్, ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ పథకాలు బేకార్ పథకాలైనవి. ప్రభుత్వం ఆ ఏడాది రూ. 1,11,500 కోట్లు కేటాయించక తప్పలేదు.
ఆ మరుసటి ఏడాది, అంటే 2021–22లో మళ్ళీ బడ్జెట్ కేటాయింపు కోత పెట్టి రూ. 73,000 కోట్లకే పరిమితం చేశారు. ఇది ఆ ముందటి ఏడు చేసిన వాస్తవ ఖర్చు కన్నా రూ. 38,500 కోట్లు తక్కువ. అయితే నవంబరు 25న ప్రభుత్వం మరో రూ. 10,000 కోట్లను కేటాయిస్తామని ప్రకటించింది. కానీ ఇది ఏ మూలకూ చాలదు. నవంబరు 25 నాటికే కూలీలకు రూ. 9,888 కోట్లు బకాయి పడింది. ఇప్పుడు అదనంగా కేటాయించినది ఆ బకాయిలకే సరిపోతుంది. మరి ఏడాది పొడవునా పథకాన్ని కొనసాగించడం ఏ విధంగా సాధ్యపడుతుంది.
ప్రభుత్వం ఈ పథకం కింద ఖర్చుపెట్టే నిధుల్లో చాలా వరకు ప్రజల కొనుగోళ్ల ద్వారా జీఎస్టీ రూపంలో చాలావరకు తిరిగి ప్రభుత్వానికే చేరుతున్నదనే సంగతిని గుర్తించాలి. ఈసారి బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 25 శాతం క్షీణత ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో గత సంవత్సరంతో పోలిస్తే 34 శాతం తగ్గింపు చేశారు. ఉపాధి ప్రతి సంవత్సరం పెరుగుతూ పోవాలి కానీ అందుకు విరుద్దంగా ప్రతి సంవత్సరం కేటాయింపులలో తగ్గింపు జరుగుతున్నది. పథకాన్ని నీరుకార్చడం, బడ్జెట్ కేటాయింపులలో ఉపాధి హామీ పథకం కేవలం 1.3 శాతం, రాబోయే రోజులల్లో క్రమేణా రద్దు చేయడం జరుగుతుంది.
గ్రామీణ ప్రాంత పేదలకు , అసంఘటిత రంగంలో ఉన్న రైతు కూలీలకు కడుపు నింపేదిగా ఉన్న పథకాన్ని పద్ధతి ప్రకారం దూరం చేసి పేద ప్రజలపై తమ దాష్టికాన్ని చాటుతున్నది. మోడీ ప్రభుత్వంలో ఏ ఒక్క డెవెలప్మెంట్ పారామీటర్ చూసుకున్న విధ్వంసం తప్ప ఏమీ కనిపించదు.
