Suryaa.co.in

Andhra Pradesh

వేర్ ఈజ్.. వేణు స్వామి?

– జగన్ గెలుస్తాడని చెప్పిన జ్యోతిష పండితుడు వేణుస్వామి
– ఫలితాల తర్వాత పత్తా లేని వేణుస్వామి
– కేసీఆర్ గెలుస్తాడని చెప్పింది ఈ ముఖమేనంటూ సెటైర్లు
– ఇక తాను సినిమా, రాజకీయ జోస్యం చెప్పనంటూ దయతలచిన స్వామి
( మార్తి సుబ్రహ్మణ్యం)

వేణుస్వామి గుర్తున్నాడా? అదేనండీ.. యూట్యూబుల్లో చిన్న గడ్డం వేసుకుని, పెద్ద కళ్లజోడుతో కనిపిస్తాడు చూడండి. ఆయనే. ‘‘ఈ ఎన్నికల్లో జగన్ ఖాయంగా గెలుస్తాడు. ఆయనకు భాగ్యస్థానంలో గురువున్నాడు. రాజయోగస్థానంలో రాజ్యాధికారం ఇచ్చే స్ధానంలో రాహువు ఉన్నాడు చంద్రబాబుకు అష్టమ శని ఉంది. ఆయనకు రాజయోగం లేదు’ అని వాక్రుచ్చిన వేణుస్వామి జోస్యం బోల్తాపడింది.

పాపం చివరకు జగన్‌కు రెండంకెల స్థానమే మిగిలింది. అన్నట్లు ఈ వేణుస్వామి ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో కూడా, కేసీఆర్ గెలవడం పక్కా అని తేల్చేశారు. బట్. నో యూజ్. ఇక్కడా.. అక్కడా షేమ్ టు షేమ్ టు రిజల్ట్స్ అన్నమాట. ఈయన గారి జోస్యం విని చాలామంది బెట్టింగులు కట్టి బికారులయ్యారట.

అయితే చివరాఖరిలో.. బుద్ధి వచ్చిన వేణుస్వామి, ఇకపై తాను సినిమా-రాజకీయ జ్యోతిషం చెప్పనని ప్రజలపై దయతలిచారు. సంతోషం. ‘‘ఇలాంటి దిక్కుమాలిన తెలివితేటలు ముందే ఉంటే.. ఏదో జ్యోతిషం చెప్పి నాలుగురాళ్లు సంపాదించుకోవచ్చుకదా. ఆ ఏడుపేదో ముందే ఏడవచ్చు కదా’’ అని నెటిజన్లు వాతలు పెడుతున్నారు.

ఇలాంటి దిక్కుమాలిన, మతిలేని, గతితప్పిన పబ్లిసిటీ జ్యోతిష పండితులకు ఉచిత ప్రచారం ఇచ్చే మీడియాను.. చెప్పుతో కొట్టాలన్నది, ఇప్పుడు సోషల్‌మీడియాలో నెటిజన్ల నినాదం. ‘‘మీడియా హైప్ వల్లే అసెంబ్లీ ఎదురు చిలక జోస్యం చెప్పాల్సిన ఈ ముఖాలన్నీ, టీవీ చానెళ్లలో కాళ్లమీద కాలేసుకుని జోస్యం చెబుతున్నాయ’’ని నెటిజర్లు ఫైరవుతున్నారు. హలో మీడియా ఫ్రెండ్స్.. వింటున్నారా? మిమ్మల్నే!

LEAVE A RESPONSE