– 1931లో చివరిసారి బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేసింది
– రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్
హైదరాబాద్: దేశ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, జనాభా లెక్కలతోపాటు కులగణనను శాస్త్రీయంగా చేపట్టే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం సామాజిక న్యాయం, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కీలకంగా మారనుందని రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కి, కేబినెట్ మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, గతంలో అధికారంలో ఉన్న 60 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కులగణన చేపట్టకపోవడం దారుణమైన మోసమని విమర్శించారు. 1931లో చివరిసారి బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేసింది.
అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్కు కులగణనపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ సిఫారసు చేసిన బీసీ కమిషన్ (కాకా కలేల్కర్ కమిషన్)ను, కాంగ్రెస్ పార్లమెంట్లో చర్చకు తీసుకురాకుండా తిరస్కరించిన చరిత్ర మరిచిపోవద్దని కాంగ్రెస్ పార్టీకి చురలకలంటించారు.
నెహ్రూ నుండి రాజీవ్ గాంధీ, ఇదింరా గాంధీ వరకూ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపించారు. నెహ్రూ బీసీ రిజర్వేషన్లపై విముఖతతోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారని గుర్తుచేశారు. కులగణన విషయంలో తెలంగాణ ‘మోడల్’ అని చెబుతూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లాంటి నేతలు మాట్లాడటం మొసలి కన్నీరేనన్నారు.
94 సంవత్సరాల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కులగణన నిర్ణయం ఓ చారిత్రాత్మక అధ్యాయాన్ని ఆరంభించిందని.. ఇది బీసీలకు, మైనారిటీ వర్గాలకే కాకుండా, దేశం మొత్తానికి సామాజిక-ఆర్థిక సమతుల్యతను తీసుకొచ్చే మార్గమని కొనియాడారు. అందుకే నరేంద్ర మోదీ ని ప్రజలు ‘అభినవ అంబేద్కర్’, ‘అభినవ జ్యోతిబా ఫూలే’గా పిలుస్తున్నారంటూ డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడించారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు , పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ , రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ , సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అద్యక్షుడు భరత్ గౌడ్ , ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ తదితరులు పాల్గొన్నారు.