Suryaa.co.in

Andhra Pradesh

శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో రివర్స్ టెండర్లు ఏంటి?

– ప్రజల మనోభావాలు అంటే లెక్కలేకుండా గత ప్రభుత్వం వ్యవహరించింది
– తప్పులు, పాపాలు చేసి మళ్లీ సిగ్గులేకుండా బుకాయిస్తున్నారు.
– ప్రతి మతానికి కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి..వాటిని కాపాడాలి
– దేవాలయాల పవిత్రతకు, భక్తుల సెంటిమెంట్ కు అంత్యంత ప్రాధాన్యం ఇస్తాం
– పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సీఎం చంద్రబాబు చిట్ చాట్

అమరావతి : దేవాలయాల పవిత్ర, భక్తుల సెంటిమెంట్ ను కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి మతానికి కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయని….ప్రభుత్వం వాటి కాపాడాల్సిన అవసరం ఉంటుందని సిఎం అన్నారు.

మంగళగిరి కేంద్ర కార్యాలయంలో సందర్శకుల నుంచి వినతులు తీసుకునేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి అనంతరం అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో కొద్ది సేపు ముచ్చటించారు. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై తన అభిప్రాయాలు, తీసుకునే చర్యలు వివరించారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ “గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయి. రామతీర్థంలో రాములవారి విగ్రహ తల తొలిగిస్తే దిక్కులేదు….కనీసం చర్యలు తీసుకోలేదు. ఇలా ఒక్కటని కాదు…నాటి ప్రభుత్వం చెయ్యని తప్పులేదు. నాడు ప్రజల సెంటిమెంట్ తో ఆడుకున్నారు….ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వలేదు. పోలవరం, అమరావతి నాశనం చేసి….ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేసి తప్పుడు ప్రచారం చేశారు.

బాబాయి హత్య విషయంలో ఎలా బుకాయించారో….నేడు ప్రకాశం బ్యారేజ్ కు బోట్ల విషయంలోనూ అలాగే మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు నేరాలు చేసి….ఎదురుదాడి, బుకాయింపు, ఫేక్ ప్రచారం అనే సిద్ధాంతంతో పనిచేస్తున్నారు తప్ప…బాధ్యత అనేది లేదు. అందుకే వీళ్లను కొలంబియా నేరస్తుడు, మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ తో పోల్చాను” అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

“తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో ఎన్.డి.డి.బి రిపోర్ట్ ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా…బుకాయించేవాళ్లను ఏమనాలి? రూ.320 కిలో ఆవు నెయ్యి ఎలా వస్తుంది? శ్రీవారికి నైవేధ్యంగా పెట్టే లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లు ఏంటి? పరమ పవిత్ర పుణ్యక్షేత్రం దగ్గర తీసుకునే నిర్ణయాల్లో ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి కదా! తప్పు చేసింది కాక…..ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని సిగ్గు లేకుండా ఎలా చెపుతారు?

ప్రభుత్వం మారిన వెంటనే తిరుమల ప్రక్షాళన చేయాలని కొత్త ఈవోకు చెప్పాను. ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. లడ్డూ నాణ్యత పెంచారు. పలు కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టారు. లడ్డూ నాణ్యత కోసం నందిని నుంచి మళ్ళీ నెయ్యి కోనుగోలు చేశారు. ఆయన ప్రక్షాళన చేశారు. కానీ ఇవన్నీ రోజూ బయటకు వచ్చి చెప్పలేదు. పని చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఆ ఏడుకొండల వాడే నాతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమో! ఆ దేవుడు నా నోటినుంచి నిజాలు చెప్పించాడేమో. మనం నిమిత్తమాత్రులం. దేవుడే అన్నీ చేయిస్తాడు. ఇదే అంతే అనుకుంటున్నా” అని ముఖ్యమంత్రి వివరించారు.

“టీటీడీ విషయంలో తదుపరి ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి అనేది చర్చిస్తున్నాం. జీయర్లు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ పండితులతో చర్చించి సంప్రోక్షణ ఎలా ఉండాలో నిర్ణయిస్తాం. ఇప్పటికే ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నాం. సుబ్బారెడ్డికి వాళ్లు ఎలా సర్టిఫికెట్ ఇస్తారు? తిరుమలలో ఏం సంప్రదాయాలను వీళ్లు పాటించారు.? తిరుమల సెట్ ఇంట్లో వేసుకున్నవాడిని ఏమనాలి? కేరళ గురువాయూర్ టెంపుల్ లో దర్శనానికి చొక్కా విప్పి వెళ్లాలి. అది సాంప్రదాయం. అందరూ పాటించాలి. ప్రతి మతానికి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి.వాటిని ప్రతి ఒక్కరు గౌరవించాలి.

శ్రీవారి లడ్డు కంటే బాగా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాలేదు. వందల ఏళ్లుగా శ్రీవారి లడ్డూ అక్కడ తయారవుతోంది. ఆయోధ్యలో కూడా తిరుమల లాంటి లడ్డు తయారు చేయాలని చూశారు. ఇక్కడ నుంచి కార్మికులను తీసుకువెళ్లారు. కానీ సాధ్యం కాలేదు. ఈ విషయం నాకు అక్కడి వారే చెప్పారు. అంత మహత్యం ఉన్న ప్రసాదం అది.

గతంలో వైఎస్ ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్నాడు.అప్పుడు వ్యతిరేకించాం.పోరాడాం. అమరావతితో రూ.250 కోట్లతో శ్రీవారి టెంపుల్ కడదాం అనుకుంటే దాన్ని కుదించారు. వీళ్లు మళ్లీ ఇప్పుడు పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రసాదాల నాణ్యాతా పరీక్షలు, అవసరమైన సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడతాం” అని ముఖ్యమంత్రి తెలిపారు. విజయవాడ సహా పలు ప్రాంతాల్లో వరద బాధితులకు వేగంగా సాయం అందేలా చూస్తున్నామని, మానవీయ కోణంలో సాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE