Suryaa.co.in

Andhra Pradesh

టీచర్లకు అండగా ఉంటా

– విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి

నియోజకవర్గంలోని టీచర్లు అందరికీ అండగా నిలబడతానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. భవిష్యత్ తరాల కోసం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానని అన్నారు. ప్రచారంలో భాగంగా చిట్టినగర్ గౌతమ్ విద్యా సంస్థలను గురువారం సుజనా సందర్శించారు. సుజనాకు గౌతమ్ విద్యాసంస్థల డైరెక్టర్ లయన్ ఎన్ సూర్యారావు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా టీచర్ల సమస్యలను సుజనా తెలుసుకుని సలహాలు సూచనలు స్వీకరించారు. నియోజకవర్గ టీచర్లందరికి అండగా నిలబడతానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుంటేనే ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారు. భవిష్యత్ తరాల కోసం డిజిటల్ విద్యను ప్రోత్సహించి విద్యా వ్యవస్థలో మార్పునకు కృషి చేస్తానన్నారు.

ఇటీవల పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన గీతాంజలి, తేజ కుమార్ ను సుజనా అభినందించారు. వారి ఉన్నత విద్యకు సహకారిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో విద్యారంగంతో పాటు అన్ని రంగాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. టీచర్ల సంక్షేమం కోసం భవిష్యత్ తరాల ఉన్నతి కోసం ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే సొంత ట్రస్టు ద్వారా వేల మంది విద్యార్థులకు సుజనా ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందించి వారి ఉన్నత భవిష్యత్తు కోసం పాటుపడ్డారని టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా అన్నారు. సుజనాలాంటి నేతను పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

టీచర్ల సమస్యలను పరిష్కరిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం తోడ్పాటునందిస్తామన్న సుజనాకే తమ మద్దతు ఉంటుందని లయన్ ఎన్ సూర్యారావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైలా సోమి నాయుడు, జనసేన నాయకులు బాడిత శంకర్, టీడీపీ డివిజన్ అధ్యక్షులు నాగోతి రామారావు, లయన్ ఉపేంద్ర, బీ ఎస్ కే పట్నాయక్, బెవర జోగేశ్వరరావు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE