ఆహార పదార్థాలపై జీఎస్టీ వెనక్కి తీసుకోవాల్సిందే:కేజ్రీవాల్ డిమాండ్​

దేశవ్యాప్తంగా ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. ఇలాంటి సమయంలో జీఎస్టీ విధించి వారిపై మరింత భారం మోపడం సరికాదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ప్యాక్ చేసిన, లేబుల్ వేసిన పలు ఆహార పదార్థాలపై ఐదు శాతం జీఎస్టీ విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సోమవారం నుంచే అమల్లోకి రావడంతో..
25 కేజీలలోపు ప్యాక్ చేసి, లేబుల్ వేసిన ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలపై ఐదు శాతం జీఎస్టీ విధింపు సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. ఢిల్లీలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. అన్ని రకాల ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇప్పటికే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్రం వెంటనే ఈ జీఎస్టీ విధింపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

“అత్యుత్తమ వైద్యం, విద్య, తాగునీరు, విద్యుత్, రవాణా తదితర సదుపాయాలను ఉచితంగా కల్పించడం ద్వారా దేశంలో పేదలకు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం కలిగించిన ఏకైక రాష్ట్రం ఢిల్లీ.. ” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Leave a Reply