175 స్థానాల్లోనూ వైకాపా విజయం

ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: నవంబర్ 16: పార్టీలో అంతా కలసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయం ఖాయమని, మరో 16 నెలల్లో రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పార్టీ నాయకులకు,కార్యకర్తలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారని, ప్రతి కార్యకర్తతోనూ విడివిడిగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారని తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని, అలాగే సచివాలయాల వ్యవస్ధతో ప్రతి పల్లెకూ పాలన చేరువ చేశామని, ఎన్నికల హామీల్లో 98 శాతానికి పైగా అమలు చేశామని కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడించారని చెప్పారు. పలు అంశాలపై ఆయన బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఢిల్లీలో జరిగిన శ్రద్దా వాకర్ దారుణ హత్య మూలంగా నేరస్థుల్లో భయం లేకపోవడాన్ని బట్టబయలు చేసిందని చెప్పారు. మహిళలపై క్రూరమైన నేరాల కేసుల్లో సాక్ష్యాదారాలు స్పష్టంగా ఉన్నప్పుడు,14 రోజులలో విచారణ పూర్తి చేసి శిక్ష పడేవిధంగా ఆంద్రప్రదేశ్ లో వున్న దిశ చట్టం వంటి చట్టాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని కోరారు.

ప్రజా చైతన్యం, ప్రజా ప్రయోజనం పాత్రికేయ వృత్తి ధర్మం, కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఎల్లో మీడియా ఒక కులం, ఒక వర్గం ప్రయోజనం కోసం మాత్రమే పనిచేస్తోందని చెప్పారు. బుధవారం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా విలువలకు కట్టుబడి పనిచేసే నికార్సయిన పాత్రికేయులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply