Suryaa.co.in

Telangana

200 మంది యువకులు కాంగ్రెస్ కి రాజీనామా

మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే, పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ కి చెందిన 200 మంది యువకులు ఆ పార్టీకి రాజీనామా చేసి, టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సనర్భంగా తొర్రూరు పాల కేంద్రం నుండి పార్టీ ఆఫీస్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి ఎర్రబెల్లి బైక్ పై కూర్చుని అందరినీ ఉత్సాహపరిచారు. రాహుల్ రాయ్ (బంటి) అధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులకు గులాబీ కండువాలు కప్పి, వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, దేశంలోనే టిఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రజాదరణ, పార్టీ సభ్యత్వం కలిగిన పార్టీ అన్నారు. ఈ పార్టీలో చేరడం పట్ల మనమంతా గర్వపడాలని చెప్పారు. కెసిఆర్ అనుభవంతో కూడిన దిశా నిర్దేశం, యంగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ లీడర్షిప్ ఉన్న పార్టీ అని చెప్పారు.
భవిష్యత్తు లేని, ప్రజల అభిమానం లేని ప్రతిపక్ష పార్టీలతో అయ్యేది ఏమి లేదన్నారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ పార్టీలకు రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి యువత ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తగిన గుర్తింపు దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, యువకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE