24 రోజులు…5 జిల్లాలు… 12 నియోజకవర్గాలు… 328 కి.మీలు

– సగటున 2 రోజులకో అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర
– యాదాద్రి నుండి భద్రకాళి వరకు 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర
– చారిత్రక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా బండిసంజయ్ పాదయాత్ర
– జనం గోస వినడం…భరోసా ఇవ్వడం…రాబోయేది బీజేపీ సర్కారేననే సంకేతాలు పంపడమే యాత్ర లక్ష్యం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టబోయే 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. వచ్చేనెల 2 నుండి 26 వరకు 3వ విడత పాదయాత్ర కొనసాగనుంది. శ్రీ లక్ష్మీ న్రుసింహాస్వామి కొలువు దీరిన యాదాద్రి నుండి ప్రారంభమయ్యే పాదయాత్ర హన్మకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు కొనసాగనుంది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు టి.వీరేందర్ గౌడ్, పాల్వాయి రజనీలతో కలిసి పాదయాత్ర ప్రముఖ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర వివరాలు వెల్లడించారు.

3వ పాదయాత్ర మొత్తం 24 రోజులపాటు కొనసాగనుంది. యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల మీదుగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో కొనసాగనుంది. 3వ విడత పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ మొత్తం 328 కిలోమీటర్లు నడుస్తారు.
ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే…. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, జనగాం, వర్దన్నపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది.

ఈసారి 3వ విడత పాదయాత్ర అనేక చారిత్రాక ప్రదేశాల గూండా కొనసాగనుంది. చేనేత ప్రసిద్దిగాంచిన పోచంపల్లి, రజకార్ల అరాచకాలకు మూకుమ్మడిగా బలైన గుండ్రాంపల్లి, చాకలి ఐలమ్మ పోరు సాగించిన విసునూరు, సర్వాయి పాపన్న పాలనా రాజధాని కిలాషపూర్, తెలంగాణ సాయుధ పోరాట చైతన్య వేదిక కొత్తపేట తోపాటు ఐనవోలు మల్లన్న ఆలయా ప్రదేశాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.

ఈసారి అనేక గిరిజన తండాలు, బడుగు బలహీనవర్గాల ప్రభావం ఉన్న ప్రాంతాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. గత రెండు పాదయాత్రలు విజయవంతంగా కొనసాగిన నేపథ్యంలో మూడో విడత పాదయాత్రను సైతం దిగ్విజయవంతం చేసే దిశగా పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. జనం పడుతున్న బాధలను స్వయంగా తెలుసుకోవడంతోపాటు వారికి భరోసా నింపడం… కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లడంతోపాటు రాబోయేది బీజేపీ ప్రభుత్వమేననే విశ్వాసాన్ని ఈ 3వ విడత పాదయాత్ర ద్వారా బండి సంజయ్ ఆధ్వర్యంలోని పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రజల్లోకి నింపనుంది.

Leave a Reply