Suryaa.co.in

Andhra Pradesh

న్యాయం కోసం కన్నీళ్లతో పోటెత్తిన అర్జీదారులు

  • కిక్కిరిసిన టీడీపీ కేంద్ర కార్యాలయం

  • కన్నీళ్లతో విన్నవించుకున్న అర్జీదారులు…కష్టాలు చెప్పుకున్న దివ్యాంగులు

  • భూ సమస్యలు పరిష్కరించాలంటూ వైసీపీ బాధితులు

  • ఉద్యోగాలు కల్పించాలంటూ నిరుద్యోగులు… నామినేటెడ్ పదవులకోసం నేతల విన్నపం

మంగళగిరి: గత పాలనలో నిండుకున్న కడగళ్ల కన్నీళ్లతో గుండెల నిండా బాధతో నేడు వినతులతో పోటెత్తారు అర్జీదారులు. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీలు ఇచ్చేందుకు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వందల సంఖ్యలో తరలివచ్చారు. వచ్చిన అర్జీదారులతో టీడీపీ కేంద్ర కార్యాలయం కిక్కిరిసింది. ఏడు పదుల వయస్సులో వచ్చిన పండుటాకులు నేతలకు తమ గోడు చెప్పుకోగా.. కదళ్లేని దీనస్థితిలో ఉన్న తమ బిడ్డల దుస్థితిని చూపిస్తూ ఆదుకోవాలని తల్లిదండ్రులు విలపించారు.

కాళ్లు లేని దివ్యాంగులు, మాటలురాక చెవులు వినపడక తమ మౌన వేదనను పేపరులో వ్యక్తం చేస్తూ ఇంకోదరు.. తమ భూమిని కబ్జా చేశారంటూ వైసీపీ నేతల బాధితులు… తమకు అర్హత ఉన్నా పింఛన్ రాలేదని లబ్ధిదారులు, అప్పులు తెచ్చి చేసిన పనులకు బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు, గ్రామాల్లో రోడ్లు లేవని, లైట్లు లేవని పల్లె వాసులు విన్నవించుకోగా.. తమకు ఇళ్లులేవని పేదలు.. ఉద్యోగాలు లేవని నిరుద్యోగులు.. తమకు కనీస జీతాలు ఇవ్వాలంటూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. దీన స్థితిలో ఉన్నామంటూ ఆర్థిక సాయాన్ని అర్థిస్తూ పలువురు.. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు కల్పించాలని నేతలు ఇలా నేడు శనివారం వందల అర్జీలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ లు స్వీకరించారు.

ప్రతి అర్జీదారుని సమస్యను ఎంతో ఓప్పిగ్గా వింటూ తక్షణమే అధికారులు, నేతలకు ఫోన్లు చేస్తూ.. ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేశారు. వందల్లో వచ్చిన అర్జీలను సంబంధిత డిపార్ట్ మెంట్ లకు వెళ్లే విధంగా చూసి.. పరిష్కారానికి చొరవ చూపారు. ప్రతి ఫిర్యాదును పరిష్కరించేలా సకాలంలోనే ఆ సమాచారం అర్జీదారునుకి చేరేలా చర్యలు తీసుకున్నారు.

• వైసీపీ రౌడీమూకల అరాచకాల వల్ల తన సొంత ఊరును వీడి భార్య బిడ్డలతో పాయరావుపేటలో తలదాచుకుంటున్నట్లు రాము నాయుడు వాపోయాడు గోలుకొండ తాహశీల్దార్ కె. వెంకటేశ్వరరావు, కృష్ణదేవిపేట ఎస్సై బీమరాజులు వైసీపీ నేతలతో కుమ్మక్కై తమ కుటుంబంపై దౌర్జన్యం చేశారని.. అక్రమ కేసులు పెడతామని బెదిరించారని.. తమ భూమిని లాక్కుని అక్రమ కట్టడాలు కట్టారని.. వైసీపీ పాలనలో ఎన్ని వినతులు సమర్పించినా ఫలితంలేదని.. అక్రమ కట్టడాలను తక్షణమే నిలిపి తమకు న్యాయం చేయాలని నేటి గ్రీవెన్స్ లో వాపోయాడు.

• గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రీ సర్వేలో తన భూ రికార్డులను తారుమారు చేసి తనకు అన్యాయం చేశారని… గూంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కుర్నూతల గ్రామానికి చెందిన లింగాబత్తిని ఉమాలక్షి వాపోయారు. తన తల్లి నుండి వచ్చిన భూమి కొట్టేయడానికి కుట్ర పన్నారని తనకు న్యాయం చేయాలని కోరారు.

• కడప జిల్లా బి.కొండూరు మండలం తుమ్మలపల్లె చేనేత సహకార సంఘంలో జరిగిన అవినీతి, అక్రమంగా లావాదేవీలకు సహకరించిన జిల్లా చేనేత అండ్‌ జౌళిశాఖ అధికారుల కేసును రీఓపెన్ చేసి చర్యలు తీసుకొవాలని రామసముద్రం గ్రామానికి చెందిన పోలిశెట్టి శ్రీనివాసులు నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.

• నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ(ఎన్‌యూడీఏ) ద్వారా గత ప్రభుత్వంలో సిమ్మెంట్ రోడ్డు నిర్మించినా తనకు నేటికి రూ. 75,00,000 బిల్లు రాలేదని…తనకు బిల్లులు మంజూరు చేయాలని డి. హిమాచలం రాజు నేతల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

• కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం తిప్పనూరు గ్రామానికి చెందిన ఎస్. నాగరాజు విజ్ఞప్తి చేస్తూ.. తమకు పెద్దలనుండి వచ్చిన భూమికి వైసీపీ నాయకులు పట్టా పుస్తకాలు, టైటిల్ డిడ్ పుస్తకాలు రాకుండా అడ్డుకుంటున్నారని… తమకు పట్టా పుస్తకాలు ఇచ్చి సాయం చేయాలని కోరారు.

• వైసీపీ నేతలు తమ పొలం సరిహద్దు రాళ్లను ధ్వంసం చేసి భూమిని కబ్జా చేశారని అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన కళసా బసవరాజు వాపోయాడు. తమ భూమిని కబ్జా చేసి తమను ఇబ్బందులు పెడుతున్నారని… దయ చేసి వైసీపీ నేతల భూ కబ్జాలో ఉన్న తమ భూమిని విడిపించాలని బసవరాజు వేడుకున్నాడు.

• గతంలో వైసీపీకి ఓటు వేయలేదని తనకు అర్హత ఉన్నా పింఛన్ ఇవ్వలేదని… వృద్ధాప్యంలో తాను ఏ పనిచేసుకోలేకపోతున్నానని… తనకు పింఛన్ కల్పించి భరోసా ఇవ్వాలని నెల్లూరు జల్లా సైదాపురం మండలం గులిమి చెర్ల గ్రామానికి చెందిన పట్టాభిరామిరెడ్డి వాపోయాడు.

• కుమ్మరి కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల వారికి కుండలు తాయరీ, వాటిని విక్రయించుకొనేందుకు మండల మరియు మున్సిపాలిటీలలో శాశ్వత స్థాలాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంఘం నేతలు నేడు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.

• అమరావతి రాజధాని నిర్మాణానికి షెడ్యూల్డ్ కులాల వారి నుండి భూ సమీకరణ ద్వారా తీసుకొన్న అసైన్డ్ భూములకు జనరల్ ప్యాకేజీ ఇప్పించి న్యాయం చేయాలని అమరావతి రాజధాని ప్రాంత ఎసైన్డ్ ఎస్సీ, ఎస్టీ రైతులు అర్జీని ఇచ్చారు.

• పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామానికి చెందిన మల్లిపూడి ప్రసన్నకుమార్ తండ్రి విజ్ఞప్తి చేస్తూ… తన కుమారుడు 100% దివ్యాంగుడని సదర్ సర్టిఫికేట్ ఉందని… ప్రభుత్వం పూర్తి పింఛన్ కల్పించాలని కోరారు.

• తాము జాతీయ వ్యవసాయ పంటల బీమా కార్యకర్తలమని.. 2007 నుండి 2020 వరకు విధుల్లో కొనసాగామని.. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1300 మంది కార్యకర్తలను తొలగించి తమకు అన్యాయం చేసిందని.. దయ చేసి తిరిగి తమను అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో ఏదో ఒక శాఖలో ఉద్యోగాలు కల్పించాలని వారు కోరారు.

• వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ విధుల నుండి తొలగించబడిన 150 మంది నాన్ టీచింగ్ జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్స్ వంటి తొలగించిన ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వారు విన్నవించారు.

• తమ భూమిని తాము చదును చేసుకుంటుంటే వైసీపీ నేతలు మాపై రాళ్లతో దాడి చేసి ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి చొరతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలానికి చెందిన బాలునాయక్ వాపోయాడు. తమపై అక్రమ కేసులు తొలగించి తమపై దాడిచేసిన వైసీపీ అనుచరులను, సహకరించిన నేతలను శిక్షించాలని కోరారు.

• సువర్ణముఖి నదిపై ప్రతి పది కిలోమీటర్లకు ఒక ఆన కట్ట కడితే ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో సుమారు 500 గ్రామాల రైతులకు తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండదని ఆనకట్టల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని అరుసూరు వెంకటేశ్వర్లు కోరారు.

• ప్రకాశం జిల్లా దోర్నాల మండలం దోర్నాల గ్రామానికి చెందిన ఉన్నం రమణయ్య విజ్ఞప్తి చేస్తూ.. ఐదు లక్షలు చెల్లించి వంద రూపాయల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపరుపై స్థిరాస్థి విక్రయ స్వాధీన అగ్రిమెంట్ రాసుకొన్న తరువాత దుర్భుద్దితో తాను కొన్న స్థలానికి కొంత కాలం తరువాత మంచిరేటు రావడంతో తనకు తెలియకుండా మరోకరికి ఆ స్థలాన్ని అమ్మి రిజిష్ట్రార్ ఆఫిసులో వేరోకరికి నాగేళ్ల నారాయణ రిజిస్టర్ చేయించాడని.. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని కోరాడు.

LEAVE A RESPONSE