Suryaa.co.in

Andhra Pradesh

ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలి

– ఏపీసీసీ చీఫ్ షర్మిలా డిమాండ్‌

కాకినాడ: పెద్దాపురం మండలం, కండ్రుకోట గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ఏమన్నారంటే.. ఎకరాకు 10 వేలు కాదు.. 25 వేల రూపాయలు పరిహారం తక్షణం ఇవ్వాలి. ఏలేరు ఆధునీకరణపై వైఎస్ఆర్ కున్న చిత్తశుద్ధి బాబు, జగన్ లకు లేదు. ఏలేరు రైతులను నిండా ముంచింది. వేల ఎకరాలు నీట మునిగాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలే.. ఏలేరు మరమ్మతుల మీద ఎవరు దృష్టి పెట్టలేదు. రైతులు దారుణంగా నష్టపోయారు. ఒక్కో రైతు ఇప్పటి వరకు 30 వేల వరకు పెట్టుబడి నష్టపోయారు. పెట్టిన పెట్టుబడి మొత్తం వరదపాలు అయింది. ఈ నష్టానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

వైఎస్ఆర్ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టారు. 135 కోట్లు కూడా విడుదల చేసి పనులు కూడా మొదలు పెట్టారు. వైఎస్ఆర్ చనిపోయాక ఏలేరు ఆధునీకరణ పై ఎవరు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు బాబు జగన్ తప్పిదమే అంటే… జగన్ బాబు తప్పిదం అంటున్నారు. బాబు హయాంలో ఆధునీకరణ పనులు ఎందుకు చేయలేదు? గత 10 ఏళ్లుగా ఏలేరు ఆధునీకరణ పై ఇద్దరికీ పట్టింపు లేదు. జగన్ హయాంలో ప్రాజెక్టులను గాలికి వదిలేశారు. తట్టెడు మట్టి కూడా తీయలేదు. డ్యాం లు కొట్టుకు పోతున్నా జగన్ కి పట్టింపు లేదు. నిర్లక్ష్యం ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాలు నష్టం.

చంద్రబాబు ఎకరాకు 10 వేల పరిహారం ఇస్తామన్నారు. ఇది ఏ మూలకు చాలుతుందో చెప్పాలి. కనీసం ఎకరాకు 25 వేల పరిహారం ప్రకటన చేయాలి. జగన్ హయాంలో ఎకరాకు 4 వేల పరిహారం అని మోసం చేశారు. జగన్ చేసిన మోసం మళ్ళీ బాబు చేయొద్దు. ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో జరిగిన నష్టంపై వెంటనే పరిహారం ఇవ్వండి. ఎన్డీయే ప్రభుత్వానికి రాష్ట్రం అంటే చిన్నచూపు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఎవరైనా రైతుల మీద పర్యటనకు రావాలి. కష్టాలు చూడాలి. రైతుల పక్షాన నిలబడాలి.

LEAVE A RESPONSE