Suryaa.co.in

Andhra Pradesh

ఇకపై లాభసాటిగా వ్యవసాయం

-తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడి లక్ష్యంగా “పొలం పిలుస్తోంది”
– వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన
– సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచన
– పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
– డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో పురుగుల మందు పిచికారీ చేసే ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న మంత్రి దుర్గేష్

నిడదవోలు: అన్నదాతను ఆదుకోవడమే లక్ష్యంగా సాగులో పెట్టుబడులు తగ్గించి, పంటల దిగుబడిని, రైతన్న ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

మంగళవారం పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దుర్గేష్ అనంతరం క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పంటను పరిశీలించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమ లక్ష్యాలు, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వస్తున్న సాంకేతిక పద్ధతులు, సాగులో మెలకువలు, పంట ఉత్పత్తులు, ఎరువులు, పంట తెగుళ్లపై అవగాహన కల్పించడం, రైతులను చైతన్న పరిచే కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులను అడిగి మంత్రి వివరాలు తెలుసుకున్నారు.

అంతకుముందు కాకరపర్రులోని ఒక వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో పురుగుల మందు పిచికారీ చేసే ప్రదర్శన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. సాగు వ్యయాన్ని తగ్గించడం, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, మెరుగైన సాగు పద్ధతులు అవలంభించడం, రైతుల ఆదాయ స్థాయిని పెంచడం లక్ష్యంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. వారంలో ప్రతి మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు పొలం పిలుస్తోంది కార్యక్రమం జరుగుతుందన్నారు.

రైతన్నలకు వ్యవసాయానికి అయ్యే ఖర్చును తగ్గించి, దిగుబడి పెంచే విధంగా ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించామన్నారు. రైతాంగం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో సాగులో ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించామన్నారు.

మన వ్యవసాయానికి శాస్త్రీయంగా కొత్త విధానాలు ఏం వస్తున్నాయో తద్వారా పెట్టుబడులు తగ్గించుకోవడం ఎలా, దిగుబడులు పెంచుకోవడం ఎలా అన్న అంశంపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. రసాయనాలు వినియోగిస్తే సాగు ఖర్చు అధికమవుతుందని పేర్కొన్నారు.

వ్యవసాయ సాగు పద్ధతులపై రైతన్నలకు విజ్ఞానం కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో అందించిన సలహాలు, సూచనలు పాటిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు. గత ఐదేళ్లలో వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పొలం పిలుస్తోంది అనే మాటలేదని, వ్యవసాయానికి గిట్టుబాటులేకుండా చేశారని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, జిల్లా ప్రాజెక్టు అధికారి బి తాతారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ సత్యకుమారి, మార్కెటింగ్ శాఖ అధికారి ఎన్.సునీల్, ఏడిఎ కొవ్వూరు, పి చంద్రశేఖర్, హార్టికల్చర్ ఆఫీసర్ కొవ్వూరు సిహెచ్ శ్రీనివాస్, ఉద్యానవన పరిశోధనల సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే రవీంద్ర కుమార్, ఏరువాక కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ నరసింహారావు, తహసిల్దార్ అచ్యుత కుమార్ ,ఎంపీడీవో రమేష్, ఏవో ఎ.మేరీ కిరణ్ , ఏఈఓ ఈ మాసరమ్మ, సర్పంచి లక్ష్మీ, స్థానిక నాయకులు చిట్టూరి శేషారావు,ఎస్ నాగేశ్వరరావు, పెనుమత్స మధు, పెప్పర్ రంగా, అత్తికాల శ్రీనివాస్, జయరావు ప్రసాదు, సుబ్రహ్మణ్య వర్మ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE