Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ పాలనలో రైతు గోస

– కాంగ్రెస్ పాలనలో రైతాంగం అన్ని రకాలుగా మోసపోతున్నారు
– రైతు బంధు ఇయ్యక, రుణమాఫీ చెయ్యక, బోనస్ ఇవ్వక చివరకు పంట కొనుగోలు కూడా చేయక పోవడం అన్నదాతకు శాపంగా పరిణమించింది.
– ప్రభుత్వ తీరు పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 44.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు జరిగిందని అధికారిక అంచనాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 322 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. ఆచరణలో ఇప్పటి వరకు ఒక్క రైతు దగ్గర కూడా పత్తి కొనుగోలు చేసిన పాపాన పోలేదు.

కాంగ్రెస్ ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం, పత్తి మద్దతు ధర క్వింటాల్ కు రూ. 7521 తో పాటు, రూ. 500 బోనస్ కలిపి రూ. 8021 కొనుగోలు చేయాల్సింది. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు 5వేలకే అమ్ముకునే దుస్థితి వచ్చింది.

అకాల వర్షాల వల్ల దిగుబడి తగ్గిపోయి ఎకరానికి నాలుగు క్వింటాళ్ల పత్తి కూడా పండలేదు. గోరు చుట్టు మీద రోకటి పోటులా దిగుబడి తగ్గడంతో పాటు తక్కువ ధరకు అమ్ముకొని పత్తి రైతులు దారుణంగా నష్టపోతున్నారంటే ఇది పూర్తిగా రేవంత్ సర్కారు వైఫల్యం.

మక్కల పరిస్థితి మరీ దారుణం. మక్కల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఉత్తర్వులు కూడా జారీ చేయలేదు. మక్కల మద్దతు ధర రూ. 2,225. కాంగ్రెస్ ఇస్తానన్న బోనస్ కలిపితే రైతుకు క్వింటాల్ కు రూ. 2725 మద్దతు ధర లభించాలి. కానీ ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల దిక్కుతోచని మక్క రైతు రెండు వేల రూపాయలకే అమ్ముకొని లబోదిబోమంటున్నారు.

ఇక వరి కొనుగోలు దగ్గర ఇదే దుర్దశ. మా ప్రభుత్వం ఉన్నప్పుడు గతేడాది ఈరోజుకు 8లక్షల 63వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పుడున్న రేవంత్ సర్కారు ఇప్పటి వరకు కేవలం సుమారు పది, పదిహేను వేల మెట్రిక్ టన్నులు మించి కొనుగోలు చేయలేదు.

అంటే గతంలో మేము కొనుగోలు చేసిన ధాన్యంతో పోలిస్తే కేవలం 2శాతం ధాన్యం మాత్రమే కొన్నారు. వరి కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు రాలేదు, ఏ ఊరు ధాన్యం ఏ మిల్లుకు పోవాలో ఒప్పందం జరగలేదు, ధాన్యం రవాణా ఏర్పాట్లకు కూడా దిక్కులేదు. ప్రభుత్వం కట్టాలని చెప్పిన ఎర్ర రంగు సుతిలి దారం గానీ, పచ్చ రంగు సుతిలి దారం గానీ కొనుగోలు కేంద్రాలకు చేరిన దాఖలాలు లేవు.

వరి పండించిన రైతుల పరిస్థితి ఎట్లుందంటే, అంగట్లో అవ్వ అంటే ఎవనికి పెట్టినవ్ బిడ్డా అన్నట్లుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని మాయ మాటలు చెప్పి గద్దెనక్కిన తర్వాత సన్న రకాలకు మాత్రమే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కారు. ఇప్పుడు అటు సన్నాలకు, ఇటు దొడ్డు రకాలకు బోనస్ మాట అంటుంచి మద్దతు ధర కూడా లభించని దౌర్భాగ్య స్థితిలోకి రైతులను నెట్టేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సన్నబియ్యం పట్టుమని పది కిలోలు కొన్న దాఖలాలు లేవు. వడ్ల మద్దతు ధర రూ.2320 ఉంటే, ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు మద్ధతు ధర కంటే తక్కువకు రూ.1800-1900 లకే, అడ్డికి పావుశేరు చొప్పున అమ్ముకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రంధి లేకుండా బతికిన రైతులను పది నెలల కాలంలో చేసిన కష్టానికి ఫలితం దక్కక అలమటించేలా చేశారు.

కేసీఆర్ పాలనలో దుక్కి దున్నినప్పటి నుంచి పంట కొనుగోలు దాకా కంటికి రెప్పలాగా రైతులను కాపాడుకుంటే, కాంగ్రెస్ పాలన రాజకీయ విష క్రీడలో, తిట్ల పురాణాల్లో మునిగి తేలుతుంటే రైతులు దిక్కులేని పక్షులై దీనంగా చూస్తున్నారు. హైడ్రాలు, మూసీలు, ఫోర్త్ సిటీ డంభాచారాలను కొంచెం పక్కనపెట్టి పంట కొనుగోలు మీద, మద్ధతు ధర మీద, ఇస్తామన్న బోనస్ మీద దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

పంట పెట్టుబడి కోసం ఇవ్వాల్సిన పైసలు ఎగ్గొట్టి ఇప్పటికే రైతుల నెత్తిన శఠగోపం పెట్టారు. ఇప్పుడు కొనుగోలు కూడా సరిగ్గా చేయక రైతుల ఉసురు తీయొద్దని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE