– నెలరోజుల ముందే వచ్చి కష్టపడి పనిచేశారు
– మీ మేలు పార్టీ మరువదు
– మీ అందరి కృషితోనే బాబు సీఎం అయ్యారు
– దుబాయ్ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు టి డి. జనార్థన్
దుబాయ్: యుఏఇ ఎన్.ఆర్.ఐ. టీడీపీ ఆధ్వర్యంలో దుబాయ్ వేదికగా డిసెంబర్ 20 నుంచి 22 వరకు 3 రోజుల పాటు క్రిస్మస్ వేడుకలు, ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్థన్, తణుకు నియోజక వర్గ శాసన సభ్యులు అరుమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.
దుబాయ్ లోని బిర్యానీమోర్ వేదికగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఇందులో ఎన్టీఆర్ టీడీపీ సభ్యులు, ఐక్య శెట్టి బలిజ సంఘం సభ్యులు, ఐక్య క్రిస్మస్ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన టి.డి. జనార్థన్ మాట్లాడుతూ… విదేశాలలో ఉంటూ కూడా స్వదేశం పట్ల అభిమానం చూపిస్తున్న ఎన్నారైల మాతృభూమి భక్తి గొప్పదన్నారు. క్రిందటేడాది జరిగిన ఎన్నికలలో నారాచంద్రబాబు నాయుడిగారి విజయం కోసం యుఏఇ నుంచి, ఎందరో ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ కొచ్చి నెల రోజులకు పైగా పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అందరి సమష్ఠి కృషితోనే ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటయిందని, ప్రజల ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, ఎన్డీఏ భాగస్వామి పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్, పురందేశ్వరిలు పని చేస్తున్నారన్నారు.
క్రిస్మస్ కేక్ ను కట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీస్తు బోధనలు సదా ఆచరణీయమని, క్రీస్తు ప్రవచించిన శాంతి, కరుణ, సామరస్యంతోనే మానవాభివృద్ధి సాధ్యం అవుతుందని టి.డి. జనార్థన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాసన సభ్యులు అరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు.
ఇక ఎన్నారై టీడీపీ నేతలు నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమాన్ని జరిపారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ వెలువరించిన ‘తారకరామం’ పుస్తకాన్ని టి.డి. జనార్థన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య నటుడు, రాజకీయ నాయకుడైన నందమూరి తారకరామారావు శతజయంతి సంవత్సరాన్ని క్రిందటేడాది ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఘనంగా జరుపుకున్నారని, ఎన్టీఆర్ సినీ ప్రస్థానం మొదలై 75 సంవత్సరాలైన సందర్భంగా ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్ని అన్ని చోట్ల జరుపుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఇవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అంగీకరించిన విషయాన్ని టి.డి. జనార్థన్ తెలియజేశారు.
ఈ వేడుకలలో పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన టిడిపి యుఎన్ఐ అధ్యక్షుడు మోత్కురు విశ్వేశ్వరరావు, డాక్టర్ రవి , కోడి రాజాకిరణ్, పాడిపిరెడ్డి దాసు, డాక్టర్ ముక్క తులసి కుమార్, ఖాదర్ బాషా, సామ్యూల్ రత్నం, కుడుపూడి సత్య, కేత శెట్టి, జుత్తుగ శ్రీను, కోడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.