– మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయు
– ఇన్ఫోసిస్ చొరవ అభినందనీయం… మంత్రి నారా లోకేష్
అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని మరింత ప్రయోజనకరంగా చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించడానికి ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది.
ఎటువంటి ఆర్థిక వనరులతో సంబంధం లేకుండానే స్కిల్ సెన్సస్ లో భాగంగా జనరేటివ్ ఎఐని ఉపయోగించి అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధ్రువీకరణ కోసం డిజిటల్ ప్లాట్ఫారమ్ను అందించేందుకు ఇన్ఫోసిస్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) నడుమ రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సస్ డాటా ప్రివాలిడేషన్ కు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. దీనిద్వారా రాష్ట్రంలో యువత ప్రస్తుత నైపుణ్యాలను అంచనా వేసి, మార్కెట్ డిమాండ్ కు తగ్గట్టుగా వారికి స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇవ్వడానికి మార్గం సులభతరం అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యసాధనలో భాగస్వామి కావడానికి ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులు సంతోష్, తిరుమల, స్కిల్ డెవలప్ మెంట్ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్ మెంట్ ఉన్నతాధికారులు గణేష్ కుమార్, దినేష్ కుమార్, రఘు పాల్గొన్నారు.
డిజిటల్ లెర్నింగ్ లో భాగంగా ఇన్ఫోసిస్ సంస్థ లెర్నింగ్ పాత్వేస్కు విద్యార్థులను కనెక్ట్ చేసే యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్లను సృష్టించి, నిరంతర అభ్యాసాన్ని సులభతరం చేస్తుంది. పరిశ్రమ అవసరాలను తీర్చడానికి ఏపీఎస్ఎస్డీసీకి సహకరిస్తుంది. ఔత్సాహికులకు ఉచితంగా నేర్చుకునే అవకాశాలను కల్పించడం, సాంకేతికత అభివృద్ధి, డిజిటల్ ప్లాట్ఫారమ్ నిర్వహణ ఇన్ఫోసిస్ చేపడుతుంది.
అభ్యర్థుల నైపుణ్యాలను సమర్థవంతంగా అంచనావేయడానికి జనరేటివ్ ఇన్ఫోసిస్ డిజిటల్ ప్లాట్ ఫారంను అభివృద్ధి చేసి అందిస్తుంది. ఈ ప్లాట్ఫారమ్ వివిధ పరిశ్రమలలో అవసరమైన నైపుణ్యాల సమగ్ర మూల్యాంకన చేస్తుంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ప్రస్తుత నైపుణ్య స్థాయిలను అంచనా వేసి ముందస్తు ధ్రువీకరణకు చర్యలు చేపడతారు. ప్రాథమిక అంచనాను బట్టి అభ్యర్థుల ప్రస్తుత నైపుణ్యాలు, తదుపరి అభివృద్ధి కోసం సిఫార్సులు చేస్తారు.
ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్ ప్లాట్ఫారమ్లో క్యూరేటెడ్ లెర్నింగ్ పాత్వేస్తో ఔత్సాహికులను కనెక్ట్ చేస్తుంది, ఉచిత ఆన్లైన్ కోర్సులు, వర్క్షాప్లు నిర్వహించి అంచనా వేసిన నైపుణ్యాలు, కెరీర్ ఆకాంక్షలకు అనుగుణంగా నిరంతర నైపుణ్యాభివృద్ధి కోసం సాంకేతిక సహకారాన్ని ఇన్ఫోసిస్ అందిస్తుంది.
ఇన్ఫోసిస్ పారదర్శక, డేటా ఆధారిత ఫలితాలను నిర్ధారిస్తూ నైపుణ్య అంచనాల పురోగతి, ఫలితాలను ట్రాక్ చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్ట్రంలో 15-59 సంవత్సరాల నడుమ వయసు కలిగిన 3.59 కోట్లమందికి సంబంధించి నైపుణ్యాలను ఇన్ఫోసిస్ ప్రి-వాలిడేషన్ చేసి అందిస్తుంది. దీనిద్వారా ప్రస్తుతం ఎపి ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సస్ ఫ్రేమ్వర్క్, నైపుణ్యం అప్లికేషన్లో డిజిటల్ ప్లాట్ఫారమ్ ఏకీకరణను సులభతరం అవుతుంది. విద్యా సంస్థలలో మూల్యాంకన సాధనాల అమలుకు అవసరమైన మద్దతును లభిస్తుంది.