– విభజన నాటికి మిగులు బడ్జెట్లో తెలంగాణ
– కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, పసుపు బోర్డు ఇచ్చింది మేమే
– ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఎదురుదాడి
న్యూఢిల్లీ: బడ్టెడ్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ కొట్టిపారేశారు. విభజన నాటికి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ, ఆ తర్వాతనే అప్పుల పాలయిందని గణాంకాలతో ఎదురుదాడి చేశారు.
రాజ్యసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సరైన ప్రాధాన్యత దక్కిందని ఆమె అన్నారు. బడ్జెట్లో బీహార్తో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారనడం సరికాదని ఆమె అన్నారు.
విభజన నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉందని, ఆ తర్వాత అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపదని స్పష్టం చేశారు. ఇందిరా గాంధీ తెలంగాణలోని మెదక్ నుండి పోటీ చేసి గెలిచారని, కానీ అక్కడ రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేసింది ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
సమ్మక్క సారక్క, రామగుండం ప్లాంట్, పసుపు బోర్డు తెలంగాణకు ప్రాధాన్యతాంశాలని ఆమె పేర్కొన్నారు. పసుపు బోర్డును ఇచ్చింది ప్రధాని మోదీయే అని ఆమె అన్నారు. తెలంగాణకు కూడా నిధులు ఇచ్చామని తెలిపారు. తెలంగాణకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇచ్చామని నిర్మలాసీతారామన్ వెల్లడించారు.