– రోడ్డెక్కి ప్లకార్డులతో తీవ్ర నిరసన
– బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
కోవూరు: నెల్లూరు జిల్లా, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, ఆమె భర్తకు ప్రాణహాని ఉందంటూ, బెదిరించి పెళ్లి చేసుకుందంటూ చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. ఈ వ్యాఖ్యలు సభ్యసమాజాన్ని సిగ్గుపడేలా ఉన్నాయని, మహిళల వ్యక్తిత్వంపై దాడి చేయడమే వైసీపీ విధానమా అని పలువురు మహిళలు ప్రశ్నిస్తున్నారు.
ప్రశాంతిరెడ్డి వల్ల ఆమె భర్త ప్రభాకర్ రెడ్డికి ప్రాణహాని ఉందని, ఆయన నిద్రలోనే చనిపోతాడని లేదా ఎక్కడో ఒకచోట లేపేస్తారని ప్రసన్నకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రెడ్డి ఒక పిచ్చోడని, ఆమె మాయలో పడ్డాడని, బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “పదేళ్ల కిందట నువ్వు ఎక్కడున్నావ్? ఆ ప్రభాకర్రెడ్డికి ఒకటే చెబుతున్నా.. నీ దగ్గర రూ.వేల కోట్ల ఆస్తులున్నాయ్. జాగ్రత్తగా ఉండాలి. నువ్వు. ఇప్పటికే నిన్ను చంపడానికి రెండు సిట్టింగ్లు అయ్యాయని నా దగ్గర సమాచారం ఉంది” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
“వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి ఎవరూ దొరకనట్టు ఆమెను చేసుకున్నారని.. ఆయన కోరితే ఓ కన్నెపిల్లను తెచ్చి తానే పెళ్లి చేసేవాడినంటూ” మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. కోవూరులో ఆందోళనలు ఉధృతమయ్యాయి. వేలాది మంది మహిళలు రోడ్డెక్కి ప్రసన్నకుమార్ రెడ్డిని నియోజకవర్గంలో అడుగు పెట్టనీయమని మండిపడ్డారు. స్థానిక మహిళా ఎమ్మెల్యేపై ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇలా అసభ్యకరంగా మాట్లాడటం దారుణమన్నారు. టీడీపీ మహిళా నేతలు కోవూరు పీఎస్లో ప్రసన్నకుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ప్రశాంతిరెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గానికి రావాలని నినాదాలు చేశారు.
స్పందించిన ప్రశాంతిరెడ్డి, ఇతర నేతలు
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, నల్లపురెడ్డి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదని, దాడుల సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు. ప్రసన్నకుమార్ వల్ల చాలా మంది బాధపడ్డారని, వారిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండొచ్చని అన్నారు. వైసీపీ నేతలకు తనదొకటే ప్రశ్న అని, నల్లపురెడ్డి తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మీ ఇంట్లో మహిళలకు చూపించండని అన్నారు. నల్లపురెడ్డి వ్యాఖ్యలను జగన్ సీరియస్గా తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడటం జిల్లాలో ఎప్పుడూ లేని సంస్కృతికి తెరలేపడమేనని అన్నారు. ప్రశాంతిరెడ్డి నల్లపురెడ్డికి చెల్లెలు వరుస అవుతుందని గుర్తుచేశారు. అలజడి, అశాంతి సృష్టించేందుకే ప్రసన్న ఇలా మాట్లాడారని, రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు, పవన్పైనా ఇలాగే మాట్లాడారని, అందుకే ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు.
మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ, ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయని, ప్రసన్నకుమార్ రెడ్డి మాటలు సభ్యసమాజాన్ని సిగ్గుపడేలా చేస్తున్నాయని పేర్కొన్నారు.
కాగా, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజా జీవితంలో మహిళల పట్ల అవలంబించాల్సిన కనీస గౌరవాన్ని విస్మరించాయని, ఇలాంటి చర్యలను అరికట్టడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.