– విజయవాడ శాతవాహన కాలేజీ భూముల ఆక్రమణ వ్యవహారంలో ఎమ్మెల్సీ ఆలపాటిపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు ఆగ్రహం
– తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
* తారాస్థాయికి చేరిన అధికార పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ఆక్రమణలు..
* విలువైన విద్యాసంస్థల భూముల ఆక్రమణకు బరితెగింపు..
* శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావుకు బెదిరింపులు..
* మాట వినకపోతే కుటుంబాన్ని అంతం చేస్తానని హెచ్చరిక..
•ఇంత జరుగుతున్నా నోరు మెదపని ముఖ్యమంత్రి చంద్రబాబు..
* కూటమి పార్టీ నేతల భూకబ్జాలపై మాజీ ఎమ్మెల్యే మల్లాది ఫైర్..
•కాలేజీ భూమిని ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలి..
•శాతవాహన విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి..
:మల్లాది విష్టు డిమాండ్
న్యాయం జరిగే వరకు విద్యార్ధులకు అండగా వైయస్సార్సీపీ..
స్పష్టం చేసిన మల్లాది విష్టు.
తాడేపల్లి: విజయవాడలో శాతవాహన కళాశాల భూములను ఆక్రమించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర బెదిరింపులు తారాస్థాయికి చేరాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు మండిపడ్డారు. తన మాట వినకపోతే ఏకంగా కుటుంబాన్నే చంపేస్తానంటూ… కాలేజ్ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ ను ఆలపాటి బెదిరించడాన్ని విష్ణు తీవ్రంగా ఆక్షేపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతలు తమ కబ్జాల కోసం విద్యాసంస్థల్లో సైతం చొరబడ్డంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలు సాగిస్తున్న దౌర్జన్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును ఆలపాటి రాజేంద్ర బెదిరించిన విషయంపై బాధితుడు పోలీసులను కూడా ఆశ్రయించారు. అధికార పార్టీకు చెందిన ఎమ్మెల్సీ, నేతలు కబ్జా పర్వంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్ల చరిత్ర కలిగిన శాతవాహన కాలేజీకి, తెనాలిలో ఉంటున్న ఆలపాటి రాజాకి సంబంధం ఏమిటి ? విజయవాడలో విద్యార్ధుల భవిష్యత్తు పేరుతో మీరు ఎందుకు ఈ కళాశాల వ్యవహారాలలో చొరబడ్డారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పటికే మరో వర్గం ఈ కాలేజీ భూములు మా ప్రాపర్టీ అని చెబుతుంది. ఇంత వివాదం జరుగుతున్న అధికారపార్టీ మౌనం ఏ రకమైన సంకేతాలిస్తుంది. అత్యంత ఖరీదైన ప్రాంతంలో 5 ఎకరాల కాలేజీ స్థలాన్ని కబ్జా చేయడానికి వర్గాలుగా విడిపోయి .. శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తుంటే అధికార యంత్రాంగం సైతం పట్టనట్టు వ్యవహరించడం శోచనీయం. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఈ వివాదంపై గతంలో పలుమార్లు పోలీసులను ఆశ్రయించారు. అధికార పార్టీ నేతలే ఈ రకమైన దౌర్జన్యాలకు పాల్పడుతుంటే సామాన్య ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి.
కాలేజీ భూములను ప్రభుత్వ స్వాధీనం చేయాలి:
శాతవాహన కాలేజీ భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకుని కబ్జా దారుల నుంచి కాపాడాలని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, విద్యార్థి విభాగం పలుమార్లు ఆందోళన కూడా చేపట్టంది. ఈ భూమిని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవాలని కూడా డిమాండ్ చేశాం. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు శాతవాహన కాలేజీ భూముల రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నాం.కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి పార్టీ వ్యక్తులే హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? జిల్లా కలెక్టర్ ఎందుకు ఈ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం లేదు? పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి ఇలా కాలేజీ భూములను ఆక్రమించే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్టు? విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు నష్టం జరుగుతున్నా మౌనంగా చూస్తున్న ప్రభుత్వాన్ని ఇదేనా సుపరిపాలన అని ప్రశ్నిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే చర్య. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని శాతవాహన కాలేజీ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మీ పార్టీ నేతలు చేస్తున్న అనైతిక కార్యకలాపాలను విజయవాడ ప్రజలు గమనిస్తున్నారు, సరైన టైంలో మీకు బుద్ధి చెప్పడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు హెచ్చరించారు.