– కనీసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని కూడా సూచించలేదు
– జులై 1న ఈ సంభాషణ
– నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు
నెల్లూరు: తనను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లుగా ఉన్న వీడియో గురించి జిల్లా ఎస్పీకి మూడు రోజుల ముందే సమాచారం ఉన్నప్పటికీ, తనకు కనీసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని కూడా సూచించలేదని నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. తన కోసం నడిచే ప్రజల కోసం కొండలనైనా ఢీకొంటానని, ఎవరికీ భయపడబోనని చెప్పారు.
వీడియో బయటకు రావడంపై కోటంరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కుట్ర వీడియోపై మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, సంచలన ఆరోపణలు చేశారు.
నిన్న సాయంత్రం ఓ న్యూస్ ఛానల్లో ప్రసారమైన వీడియో చూసి తాను మొదట షాక్కు గురయ్యానని.. ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో కొందరు రౌడీషీటర్లు తన హత్య గురించి చర్చించుకోవడం విస్మయానికి గురిచేసిందన్నారు.
ఈ ఏడాది జులై 1న ఈ సంభాషణ జరిగినట్లు తెలిసింది. ఒకడు రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు అనడం, మరొకడు చంపేద్దాం అనడం ఆ వీడియోలో ఉంది అని కోటంరెడ్డి వివరించారు.
ఈ వ్యవహారంపై వైసీపీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాజకీయాల కోసం సొంత కుటుంబ సభ్యులను చంపుకొనే చరిత్ర తమది కాదని, ఆస్తుల కోసం ఆత్మీయులను ద్వేషించే సంస్కృతి తమకు లేదని మండిపడ్డారు.
నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే రౌడీ మూకలను తరిమి కొట్టాను. 16 నెలల క్రితమే సీఎం జగన్ను ధిక్కరించాను. అప్పుడే నన్ను, నా కుటుంబాన్ని బెదిరించినా భయపడలేదు. ఇప్పుడు ఈ కుట్రలకు భయపడతానా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు.