– సొంత కార్యకర్తలను పొట్టనపెట్టుకున్న వ్యక్తి జగన్ రెడ్డి
– రెడ్ బుక్ తన పని తాను చేస్తోంది… నేను ఏదీ మర్చిపోలేదు
– సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసిన ఘనత టీడీపీదే
– నాకు డైరెక్ట్ కాంటాక్ట్ పార్టీ కార్యకర్తలతోనే
– పులివెందుల ఎమ్మెల్యేకు దిమ్మతిరిగే విధంగా దెబ్బకొట్టింది టీడీపీ కార్యకర్తలు, కడప ప్రజలు
– పులివెందులలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే జగన్ గెలిచే ప్రసక్తే ఉండదు
– వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి
– కమలాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం
– కొప్పర్తిలో కనీసం లక్ష మంది పనిచేసే విధంగా అభివృద్ధి చేస్తాం
– నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి లోకేష్
కమలాపురం: సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది అని, తనకు డైరెక్ట్ కాంటాక్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం బుగ్గలేటిపల్లిలో కమలాపురం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువగళంలో కార్యకర్తలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేరుగా చూశా. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే బాబు సూపర్ సిక్స్ రూపొందించి సూపర్ హిట్ చేసిన ఘనత టీడీపీది. ఎత్తిన పసుపు జెండా దించకుండా టీడీపీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. నాకు అంజిరెడ్డి తాత, మంజులక్క, తోట చంద్రయ్య, చెన్నుపాటి గాంధీ గారే నాకు స్ఫూర్తి.
నాకు డైరెక్ట్ కాంటాక్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే…
నాకు వేరే వాళ్లతో పనిలేదు. నాకు డైరెక్ట్ కాంటాక్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే. అందుకే ఎన్ని పనులున్నా కార్యకర్తలతో సమావేశం అవుతున్నాను. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నా. కడప జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచి చరిత్ర సృష్టించారు. దీని వెనుక కార్యకర్తల శ్రమ ఉంది. పులివెందుల ఎమ్మెల్యేకు దిమ్మతిరిగే విధంగా దెబ్బకొట్టింది టీడీపీ కార్యకర్తలు, కడప ప్రజలు. ఆ దెబ్బ అహంకారానికి వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకం. మాధవీ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యే చైతన్య రెడ్డి బాగా కష్టపడ్డారు. పెద్దాయన కూడా కష్టపడ్డారు. కార్యకర్తలు అహర్నిశలు కష్టపడ్డారు. వైసీపీ నేతలు మహిళలను అవమానించారు. మా అమ్మగారిని కూడా అవమానించారు. అయినా తగ్గేదేలే అని చెప్పా.
పులివెందులలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే జగన్ గెలవరు
అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకోవాలి. ప్రజలతో మమేకం కావాలి. ఇప్పటి నుంచే కష్టపడాలి. కార్యకర్తలు, నేతలు అలక వీడాలి. సమస్యలు ఏమైనా ఉంటే మనమే చర్చించుకుని పరిష్కరించుకోవాలి. పులివెందుల ఎమ్మెల్యేకు చాలా రోజుల తర్వాత ప్రజలు గుర్తుకువచ్చారు. చంద్రబాబు బయటకు రావాలంటే గేట్లకు తాళ్లు కట్టారు. సొంత కార్యకర్తలను పొట్టనపెట్టుకున్న వ్యక్తి జగన్ రెడ్డి.
జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ రాని పరిస్థితి. పులివెందులలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే, అందరూ కష్టపడితే జగన్ అనే వ్యక్తి గెలిచే ప్రసక్తే ఉండదు. జగన్ ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఉల్లికి మద్దతు ధర కోసం చంద్రబాబు గారు క్వింటాలుకు రూ.1200 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని మొన్ననే చెప్పారు. జగన్ రెడ్డికి ఇప్పుడు గుర్తుకువచ్చింది. ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని వ్యక్తి జగన్ రెడ్డి. హెరిటేజ్ స్టోర్ లు విక్రయించి ఎనిమిదేళ్లు అవుతుంది. ఈ విషయం కూడా తెలియదు.
కొప్పర్తిలో కనీసం లక్ష మంది పనిచేసే విధంగా అభివృద్ధి చేస్తాం
పెన్షన్ ను రూ.200 నుంచి రూ.2 వేలు, 3 వేలను ఒకే సంతకంతో నాలుగు వేలు చేసింది టీడీపీ. దివ్యాంగులకు పెన్షన్ రూ.6 వేలు చేశాం. ఏడాదికి 72 వేలు చెల్లిస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.15వేలు చెల్లిస్తున్నాం. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి పథకాలను అమలుచేస్తున్నాం. ఇచ్చిన హామీలను నెరవేర్చాం.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. కొప్పర్తిలో నేడు రెండు కంపెనీలు ప్రారంభించాం. కొప్పర్తిలో కనీసం లక్ష మంది పనిచేసే విధంగా అభివృద్ధి చేసి కంపెనీలు తీసుకువస్తాం. రైతులు పిల్లల భవిష్యత్ కోసం భూములు ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్, ఇతర సంస్థలను తీసుకువచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. పక్కనే కడప ఎయిర్ పోర్ట్, ఇతర మౌలిక సౌకర్యాలు ఉన్నాయి. ఇంత అద్భుతమైన ఇండస్ట్రియల్ పార్క్ దేశంలో ఎక్కడా లేదు. అందుకే పెట్టుబడులు తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకుంటా.
వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి
సంక్షేమం, అభివృద్ధితో పాటు రాజకీయం కూడా చేయాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే వ్యవహరించాలి. ప్రతిపక్షం దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి. సొంత బాబాయిని చంపి నెపం చంద్రబాబు గారిపై వేశారు. సొంత చెల్లి సునీత న్యాయం కోసం పోరాడే పరిస్థితి. ఆస్తి కోసం సొంత చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారు. ఇవన్నీ మనం మాట్లాడాలి. మనం ఏనాడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు.
ఫ్యాక్షన్ ను ఏనాడూ టీడీపీ ప్రోత్సహించలేదు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చేసే కుట్రలకు పాల్పడుతున్నారు. పెట్టుబడులను అడ్డుకునేందుకు సింగపూర్ కు కుట్రపూరితంగా మెయిల్స్ పంపారు. ఏ ఆశయంతో ప్రజలను మనల్ని గెలిపించారో దానిని నెరవేర్చాలి.
కడప జిల్లాను టీడీపీ కంచుకోటగా తీర్చిదిద్దాలి
కార్యకర్తలు, నేతలు అహంకారం వీడాలి. కలిసికట్టుగా పనిచేయాలి. కడప జిల్లాను టీడీపీ కంచుకోటగా తీర్చిదిద్దాలి. కమలాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. రెడ్ బుక్ తన పని తాను చేస్తోంది. నేను ఏదీ మర్చిపోలేదు. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్యను చంపింది మర్చిపోతానా? చంద్రబాబు గారిని 53 రోజులు అక్రమంగా జైలులో బంధిస్తే కొడుకుగా నేను మర్చిపోతానా? తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు.
+