– హైదరాబాద్ టు ముంబై
– రూ. 12,000 కోట్ల విలువైన ఎండీ డ్రగ్, ముడి రసాయనాలస్వాధీనం
– చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా తయారీ
– ఓ రసాయన ఫ్యాక్టరీ ముసుగులో మాదక ద్రవ్యాలు తయారు
– అతి పెద్ద డ్రగ్స్ రాకెట్ను ఛేదించిన ముంబై పోలీసులు
హైదరాబాద్: డ్రగ్స్ అమ్మాలంటేనే నేరస్తులు వణికిపోయే పరిస్థితి రావాలని ప్రభుత్వం ఎంత గట్టిగా చెబుతున్నా.. డ్రగ్స్కు ఎక్కడా ప్రతిబంధకాలు కనిపించడం లేదు. హైదరాబాద్లో ఇటీవలి కాలంలో ఎప్పుడూ పట్టుపడనంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుపడిన వైనం సంచలనం సృష్టించింది.
శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతి పెద్ద డ్రగ్స్ రాకెట్ను ముంబై పోలీసులు ఛేదించారు.. ఓ రసాయన ఫ్యాక్టరీ ముసుగులో మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠా గుట్టును రట్టు చేసి, సుమారు రూ. 12,000 కోట్ల విలువైన ఎండీ (మెఫెడ్రోన్) డ్రగ్ను, ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రకు చెందిన మీరా-భయందర్, వసాయి-విరార్ పోలీసులు కొన్నాళ్లుగా ఓ డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టారు.. ఈ క్రమంలో తమ గూఢచారులను రంగం లోకి దించి వారాల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ముఠా మూలాలు హైదరాబాద్ లోని చర్లపల్లిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ఫ్యాక్టరీపై మెరుపు దాడి చేశారు.
వాఘ్దేవి ల్యాబ్స్’ అనే నకిలీ లైసెన్స్తో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో అత్యాధునిక పరికరాలతో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో ఫ్యాక్టరీ యజమాని, రసాయన నిపుణుడైన శ్రీనివాస్తో పాటు అతని సహచరుడు తానాజీ పాఠే, ఓ విదేశీయుడు సహా మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి ప్రాథమికంగా 100 గ్రాముల ఎండీ డ్రగ్, రూ. 25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలో జరిపిన సోడాలలో డ్రగ్స్ తయారీకి వినియోగించే సుమారు 32,000 లీటర్ల రసాయనాలతో పాటు, భారీ ఉత్పత్తి యూనిట్లను కూడా సీజ్ చేశారు.ఈ ఫ్యాక్టరీ నుంచి తయారైన మాదక ద్రవ్యాలను మహారాష్ట్రతో పాటు అనేక ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇంత పెద్ద నెట్వర్క్ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.