– కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో మంత్రి లోకేష్ భేటీలో ఆసక్తికర చర్చ
న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి సీ ఆర్ పాటిల్ ను రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పోటీచేసిన తొలి ఎన్నిక నుంచి గత నాలుగు విడతలుగా అంతకంతకు మెజారిటీ పెంచుకుంటూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయడంపై మంత్రి లోకేష్ అభినందించారు. ఇంతలా ప్రజల అభిమానాన్ని చూరగొనడం వెనుక విజయ రహస్యం ఏమిటని వాకబు చేశారు. ఆంధ్రప్రదేశ్లో గత 15నెలలుగా కూటమి పాలనలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను లోకేష్.. కేంద్ర మంత్రికి వివరించారు.
గుజరాత్ లోని నవసారి లోక్ సభ నియోజకవర్గం ఎంపీగా 2009 నుంచి వరుసగా నాలుగుసార్లు సీ ఆర్ పాటిల్ ఎన్నికయ్యారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో నవసారి నుంచి పోటీ చేసిన సీ ఆర్ పాటిల్ 1,32,643 ఓట్లతో నెగ్గారు. 2014లో 5,58,116 ఓట్ల మెజారిటీతో దేశంలో 3వ స్థానం, 2019లో 6,88,668 ఓట్ల మెజారిటీతో దేశంలో అగ్రస్థానం, 2024 ఎన్నికల్లో 7,73,551 ఓట్ల భారీ మెజారిటీతో దేశంలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజలతో మమేకం అవుతూ.. వారితోనే ఉండటమే తన విజయ రహస్యమని చెప్పారు. పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాల అమలుతోపాటు నవసారీని దేశంలోనే మొదటి “స్మోక్లెస్ జిల్లా”గా తీర్చిదిద్దారు. సూరత్ నగర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. వస్త్ర–వజ్ర పరిశ్రమలకు విధానాలు, మౌలిక వసతులు, సూరత్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేశారు.
నవసారీ పరిధిలోని చిఖ్లీ గ్రామ పంచాయతీని సన్స్ద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద అభివృద్ధి చేయగా, అది దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. రెండో దశ కోవిడ్ సమయంలో, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల ద్వారా కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించి సేవలందించారు.
రాధాకృష్ణన్ కి లోకేష్ శుభాకాంక్షలు
భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి. రాధాకృష్ణన్ కి రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని లోకేస్ అమరావతికి బయలుదేరారు.