ఇవాళ విశ్వనాథ సత్యనారాయణ జన్మదినం
ఇవాళ అంతర్జాతీయంగా ఏ కావ్య రచనా సంవిధానం, ఏ భావనా సరళి ఉన్నతంగా పరిగణించబడి ఎక్కువగా చదవబడుతున్నాయో అ స్థాయిలో శ్రీమాన్ విశ్వనాథ సత్యనారాయణ కవిత్వం చెప్పారు.
విశ్వంలో మన విశ్వనాథవారికి సాటిరాగల సాహితీ మూర్తిమత్వం మఱోటి ఉందా? లేదు. విశ్వనాథ సత్యనారాయణ సాహితీ మూర్తిమత్వం విశ్వసాహిత్యంలోనే అరుదైనది. తెలుగువ్యక్తి కాకపోయుంటే ఎప్పుడో వారు ఒక విశ్వకవిగా ఎంతో విస్తృతికెక్కేవారు.
తెలుగులం మనం మనకు వెలుగును చూడడం తెలియరాలేదు. విశ్వనాథ ఒక విశ్వమహాకవి. అభిప్రాయాలకు, వికారాలకు, కుల, మత ఉన్మాదాలకు, కమ్యూనిజమ్ భ్రష్టత్వానికి, మానసిక రోగాలకు అతీతంగా అవగాహన పరంగా, అంశాల పరంగా, కృతుల పరంగా, శిల్ప చాతుర్యం పరంగా విశ్వనాథ సత్యనారాయణకు సరిపోలగల సాహితీ స్రష్ట మఱో భాషలో లేడు. ఈ సత్యం సరైన బుద్ధి, చదువు, తెలివిడి ఉన్న ఎవరికైనా తెలిసేదే.
“కవి మహర్షి తపోsగ్ని చే క్రాగి క్రాగి
సర్వ తేజః ఫలంబు రసంబు తుదకు
చూచినట్లుగ చూచితి క్షోణిజాత
చారితార్థ్యంబు జన్మకు సంఘటింప”
(రామాయణ కల్పవృక్షము, సుందరకాండలో హనుమంతుడు లంకలో సీతను వెతికి వెతికి చివరకు చూశాక ఇలా అనుకుంటాడు)
కవి, మహర్షి తపస్సనే అగ్నిలో కాగి కాగి చివరి ఫలితంగా రస సిద్ధి లాంటి తేజస్సును చూసినట్లుగా సీతను చూశాను, జన్మ చరితార్థం అయింది అని అనుకున్నాడు హనుమంతుడు. ఇలా ఒక్క విశ్వనాథవారు మాత్రమే రాయగలరు. మహోన్నతమైన రచనా సంవిధానం ఇది.
అద్భుతమైన విశ్వనాథ రచనా సంవిధానం అనన్యం. వారు ప్రదర్శించిన శిల్ప వైవిధ్యం ప్రపంచంలో మఱే కవీ ప్రదర్శించలేదు. వారి భావనా పటిమ, గరిమ ప్రపంచంలో మఱో కవిలో కనిపించవు.
తెలుగులో ఆవరించి ఉన్న వికార మేధకు విశ్వనాథ కావ్యకాంతి సరిగ్గా కనబడలేదు. వారు ఏ బెంగాలీ, హిందీ, ఇంగ్లిష్, ఫార్సీ, ఉర్దూ కవో అయుంటే వారి గొప్పదనం ఈపాటికి విశ్వమంతా వ్యాపించి ఉండేది.
విరిగిపోయిన పాలు అన్న స్థితిని దాటి, ఉచ్చలలో తడిసి ముద్దయి మలం అన్న స్థితికి చేరుకుంటోంది ఈనాటి తెలుగు కవిత. దాన్నే ఆస్వాదిస్తున్న, దాన్నే గొప్ప కవిత అనుకుంటున్న, అలాగే రాయాలి అనుకుంటున్న, అలాగే రాస్తున్న ఒక అతి వికార స్థితి ఏర్పడింది తెలుగులో.
కవి అనడానికే అనర్హమైనవాళ్లు గొప్ప కవులు ఐపోయారు తెలుగులో. శివారెడ్డి, గోపి, అఫ్సర్ వంటివాళ్లు కూడా ప్రముఖ కవులు అయిపోయిన స్థితి ఉందంటేనే తెలుగు కవిత ఏ దుస్థితిలో ఉందో తెలుసుకోవచ్చు.
కవిత అని రాస్తున్నవాళ్లు విశ్వనాథ సత్యనారాయణ కవిత్వాన్ని అవగాహన చేసుకోవాలి. కవిత్వం వస్తువువల్ల రాదు. కవిత్వం రచనా సంవిధానంవల్ల ఆవిష్కారమవుతుంది. ప్రపంచంలో ఏ రచనా సంవిధానం ఎక్కువగా చదవబడుతూ కొనియాడబడుతోందో విశ్వనాథ ఆ స్థాయిలో తెలుగులో ఎప్పుడో రాశారు.
విశ్వనాథ వారి కవిత దిగిమతి చేసుకున్నది కాదు; ఎగుమతి కావాల్సినది వారి కవిత. విశ్వనాథ కవిత ప్రభావితమైనది కాదు; విశ్వనాథ కవిత ప్రభాకరమైనది. (శ్రీశ్రీ కవిత దిగుమతి చేసుకున్నది; ప్రభావితమైనది)
విశ్వనాథ వేయిపడగలు నవల 35 పునర్ముద్రణలు దాటింది. ఇది మహాప్రస్థానం 150 పునర్ముద్రణలవడానికి సమం. వేయిపడగలు విడివిడి కవితల సంకలనం కాదు తేలికగా చదువుకోవడానికి. అయినా వేయిపడగలు నవల అన్ని పునర్ముద్రణలు ఎలా పొందింది? ఆలోచించాల్సిన విషయం. మహాప్రస్థానం చదవడం తేలిక. అది విడివిడి కవితల సంకలనం.
ఒక భావజాలంతో కొనబడుతూ, కొనిపించబడుతూ వస్తున్నది మహాప్రస్థానం. కానీ వేయిపడగలు అలా కాదు. కృత్రిమపు ప్రచారానికి వ్యతిరేకంగా, ప్రతికూల కుట్రలకు అతీతంగా చాల పునర్ముద్రణల్ని పొందుతూ ఇంకా దూసుకుపోతోంది వేయిపడగలు నవల. (పుస్తకం వెల కూడా ఎక్కువే) మన తెలుగు మతిచెడిన కృత్రిమ మేధావులకు ఈ నిజం తెలియరాలేదు.
అదనీ, ఇదనీ పేలే తాగుబోతులైన, నీతి, నిజాయితీ లేని, చవకబాఱు విమర్శకులు తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే మహాప్రస్థానం ఎంత జనాదరణ పొందిందో వేయిపడగలు నవల కూడా అంత, అంతకు మించిన జనాదరణతో ఉంది. ఈ వేయిపడగల విజయం కృతకంగా వచ్చింది కాదు. మేధావుల ఆలోచనలకు అతీతంగా, సహజంగా జనం సమ్మతితో వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ ప్రతిభకు జనం ఇచ్చిన విలువ ఇది.
పుస్తక రూపంలో ప్రపంచంలోని వేర్వేఱు భాషల కవితలు పదిహేనువేలకు పైగా నా దగ్గఱున్నాయి. ఆ కవితల కవులలో విశ్వనాథ విశిష్టమైన వారు.
కవిత్వంలో, రచనలో శిల్పం ఎంతో ప్రధానం. విశ్వనాథవారు శిల్ప ఔన్నత్యానికి నిలువెత్తు తార్కాణం. అంతర్జాతీయ ప్రమాణాల పరమోత్కృష్ట కవి విశ్వనాథ సత్యనారాయణ.
తెలుగు లో వచ్చిన దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, కమ్యూనిజమ్, ప్రాంతీయతా వాదం, కుల వాదం, మత వాదం వంటి వికార భ్రష్టత్వానికి, భ్రష్ట వికారానికి బలికాకుండా, పాడైపోకుండా, పగిలిపోకుండా ఒక ‘మామూలు’ వ్యక్తిగా, ఒక సామాన్యుణ్ణిగా (అంటే మేధ లేని అని), ఒక పామరుణ్ణిగా విశ్వనాథ సత్యనారాయణను తెలివిడిగా పొందినందుకు ఒక తెలుగు వ్యక్తిగా నేను ఆనందంగా ఉంటాను.
‘కవి నామ ధూర్తులు’ అని శేషేంద్రశర్మ అన్నారు… ఇవాళ్టి రోజున అనామక కవినామ సర్పాలు తెలుగులో విచ్చలవిడిగా తిరుగాడుతున్నాయి. ఆ సర్పాలు తమ అకవిత్వం కోరలతో, తమ వికృత స్వభావాలతో, తెలుగు కవిత్వాన్ని నిరవధికంగా కాట్లు వేస్తూనే ఉన్నాయి… అందుకే తెలుగు ప్రజ ఇవాళ తెలుగు కవిత్వం అన్న విషానికి దూరంగా వెళ్లిపోయి ఆరోగ్యం కోసం, అనందం కోసం విశ్వనాథ సత్యనారాయణ కవిత్వాన్ని మెదడుకు, మనసుకు అద్దుకుంటోంది; ఏనాటికీ తెలుగు ప్రజ విశ్వనాథ సత్యనారాయణ కవిత్వాన్ని అలముకుంటూనే ఉంటుంది.
ఒక విశ్వస్థాయి విశ్వనాథ కవిత:
నీ రథము
ఓ ప్రభూ! నీ రథమ్ము దీక్షాప్రణీత
విధురవేగమ్ము పరువులు వెట్టుచుండె
నా శరీరమ్ము దానిక్రిందఁబడి నలిగి
నలిగిపోయినయది రక్తనదము లింకి
దివ్య తేజో విరాజత్త్వదీయ రథము
ఈ గతుకు డేమి యనియైన నాగలేదు
నా నిరోధించిన హఠాన్నినాదమునకు
వెనుదిరిగియైన మఱి చూచుకొనగలేదు
నాదు రక్తంబు నీ రథచోదకుండు
కడిగివేయిను రేపు చక్రముల నుండి
అచటి బహు జన రక్త చిహ్నముల యందు
నాది యిదని గుర్తేమి కన్పడును సామి?
ఈ స్థాయి కవితను రవీంద్రనాథ్ టాగోర్, సుబ్రమణియ బారతి, ఖలీల్ జిబ్రాన్, రూమీ, హాఫిజ్ వంటి కవులు ఆలోచన చెయ్యగలరు అని అనిపిస్తోంది. రకరకాలుగా విషపూరితం అయిపోయిన ఈనాటి తెలుగు కవిత్వానికి ఒక సరైన ఔషధం లేదా వైద్యం విశ్వనాథ కవిత్వం.
తెలుగు కవిత్వానికి ఒక సరైన ఔషధంగా, ఒక మేలైన వైద్యంగా విశ్వనాథ కవిత్వం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది! విశ్వనాథ కవిత్వం విశ్వస్థాయి ఉత్కృష్టమైన తెలుగు కవిత్వంగా విలసిల్లుతూనే ఉంటుంది!!

– రోచిష్మాన్
9444012279