– మాతృ భాషను కాపాడుకోవాలి
– శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
– ” తెలంగాణ భాష — సమగ్ర పరిశీలన ” గ్రంథాన్ని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో కలిసి ఆవిష్కరించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్: మాతృభాష, సంస్కృతికి విద్యార్థి దశ నుంచే బీజం పడాలని, కానీ ప్రస్తుత సమకాలీన పరిస్థితులు అందుకు భిన్నంగా మారుతున్నాయని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
గురువారం అబిడ్స్ బొగ్గులకుంట లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో తెలంగాణ భాష సాంస్కృతిక మండలి వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య గంటా జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ” తెలంగాణ భాష — సమగ్ర పరిశీలన ” గ్రంథాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి తో కలిసి ఆ గ్రంథాన్ని గుత్తా సురేందర్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ” చిన్న నాటి నుంచే పిల్లలకు మాతృభాష దూరమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మాతృభాష తెలుగులో మాట్లాడాలని పిల్లలను గద్దించి చెప్పే పరిస్థితులు నేడు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పాఠశాలల ప్రాంగణాల్లో, ఉపాధ్యాయులతోనే మాతృభాష పరిరక్షణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. భాషా, సంస్కృతి లేనప్పుడు గురు శిష్యులు, తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా బంధాలు కృత్రిమంగా మారుతున్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
మాతృభాష తెలుగులో పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మాతృభాష పరిరక్షణ ప్రభుత్వ పాఠశాలల్లోనే అమలు అవుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 18 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 36 లక్షలు ఉన్నాయని, దీన్ని బట్టి మాతృభాష పరిరక్షణ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి మాట్లాడుతూ” తెలుగు భాష తెలంగాణ ప్రాంతంలోనే పుట్టిందని, ఆంధ్రప్రదేశ్ లో కాదని అన్నారు. శాతవాహనుల కాలం నుంచి చివరి నిజాం వరకు తెలుగు భాష ఉందని, అయితే తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ ప్రభావం ఉండడం వల్ల యాస మారిందని చిన్నారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా హైదరాబాద్ మినీ ఇండియా వంటిదని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాషను అపహాస్యం చేశారని అన్నారు.
ప్రముఖ కవి అమ్మంగి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.