వార్ రూమ్ ను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: ప్రజా భవన్ లో ఏర్పాటుచేసిన తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్ ను మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సందర్శించారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పన తోపాటు ఈనెల 8, 9న భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సమ్మిట్ విజయవంతానికి ఏర్పాటు చేసిన కమిటీలు, వాటి పనితీరు, ప్రగతి తదితర అంశాలను డిప్యూటీ సీఎం కూలంకుషంగా చర్చించారు.
గ్లోబల్ సమ్మిట్ విజయవంతానికి ఏర్పాటుచేసిన ఇన్విటేషన్, హాస్పిటాలిటీ, వేదిక, లాజిస్టిక్స్, ట్రాన్స్ పోర్ట్, ప్రోగ్రాం, కల్చరల్ ఈవెంట్స్, కమ్యూనికేషన్, డిజిటల్ మీడియా కమ్యూనికేషన్ కమిటీల అధ్యక్షులు, టీం సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయి డిప్యూటీ సీఎం సమీక్షించారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రతి విభాగంలో పనిచేస్తున్న బృంద సభ్యుల తో డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా వారి వద్దకు వెళ్లి మాట్లాడి పనులు జరుగుతున్న తీరును, వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పనుల్లో వేగం పెంచడంతోపాటు నాణ్యత, స్పష్టత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత కొద్దిరోజులుగా వార్ రూమ్ లో విజన్ డాక్యుమెంట్ రూపకల్పన పై సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్ రూమ్ ను సందర్శించారు. రేపటి నుంచి మంత్రులు సైతం వార్ రూమ్ ను సందర్శించి జరుగుతున్న పనులను పర్యవేక్షించనున్నారు. డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశంలో సీనియర్ అధికారులు సవ్యసాచి ఘోష్, సంజయ్ కుమార్, సందీప్ కుమార్ సుల్తానియా, అజిత్ రెడ్డి, ప్రభుత్వ మీడియా సలహాదారు శ్రీరామ్ కర్రీ తదితరులు పాల్గొన్నారు.