– తెలంగాణ భవిష్యత్ కు సంబంధించిన సమ్మిట్ ఎకనమిక్ సమ్మిట్
– రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగకరం
– డిసెంబర్ 8న 1.30 గంటలకు ప్రారంభం
– 9న సాయంత్రం 6 గంటలకు ముగింపు
– సమ్మిట్ ను ప్రారంభించనున్న గవర్నర్
– 8న 2.30 కి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు
– మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్: ఈ నెల 8, 9 తారీఖుల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ – 2025 సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఇది పూర్తిగా ఎకనమిక్ సమ్మిట్ అని ఆయన స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నీతి అయోగ్, ఐఎస్బీ -హైదరాబాద్ సలహాలు సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించడం జరిగిందన్నారు.
ఈనెల 8 న మధ్యాహ్నం 1:30 కు తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ 2025 సమ్మిట్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించడం అత్యంత సంతోషకరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత రెడ్డి నాయకత్వంలోని మొత్తం కేబినెట్ అంతా కలిసి ఆలోచనలు చేసి విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంతర్జాయ స్థాయిలో పేరొందిన ఎకనమిస్టులు ప్రసంగిస్తారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
కార్యక్రమంలో మొదటి రోజు 8న అభిజిత్ బెనర్జీ, ట్రంప్ డైరెక్టర్ ఆప్ ట్రంప్-మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వేడర్, శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సిఎం డీ కె శివ కుమార్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, కిరణ్ మజుందార్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేను కూడా ప్రసంగిస్తానని భట్టి విక్రమార్క తెలిపారు. సమ్మిట్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2.30 నిమిషాలకు కీలక ప్రసంగం చేస్తారని ఆయన చెప్పారు. గ్లోబెల్ సమ్మిట్ లో అనంతరం పలు డిపార్ట్మెంట్ లకు సంబందించిన సెషన్స్ ఉంటాయని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 వరకు సెషన్ లు ప్రారంభం అవుతాయి.
సెషన్ అంశం కి సంబంధించిన శాఖ మంత్రి… ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు పాల్గొంటారు. ఈ సెషన్స్ లో ఎక్స్ పర్ట్స్ పాల్గొంటారు. 9వ తేదీ కూడా ఇలాగే సెషన్స్ ఉంటాయి. ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు మొదలవుతాయి. సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ముగింపు కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటారో తరువాత తెలియజేస్తామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లొబెల్ సమ్మిట్ లో 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి వివరించారు.
ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. స్వయంగా అధికారులే వెళ్లి వారిని ఆహ్వానించడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను, సహచర మంత్రులు అందరం స్వయంగా వెళ్లి ముఖ్యులను ఆహ్వానించడం జరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాచారం ఉండాలి అని.. అందరిని పిలవడం జరిగిందన్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబెల్ సమ్మిట్ – 2025 అనేది ప్రత్యేక సమ్మిట్. ఇన్వెస్టర్లు రాష్ట్రానికి రావాలన్న సదుద్దేశంతో చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్ కి సంబంధించినదిగా ఆయన అభివర్ణించారు. ఈ ఎకనమిక్ సమ్మిట్ రాష్ట్ర ప్రయోజనాలకు ఎతంగానో ఉపయోగ పడుతుందని అన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు సమ్మిట్ సక్సెస్ కి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎయిర్ లైన్స్ సమస్యకు వెసులుబాటు కలుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ముఖ్యమైన వారికి ఇబ్బంది తలెత్తితే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.