కాలచక్రం మరో మలుపు తిరిగింది.. లోకమంతా వేడుకల్లో మునిగితేలుతుంటే, భక్తకోటి మాత్రం ఆ సప్తగిరీశుడి పాదాల చెంత పరవశించిపోయింది. 2026 నూతన సంవత్సరం వేళ, తిరుమల గిరులు కేవలం కాంతులతోనే కాదు, భక్తుల గుండెల్లోని భక్తి భావంతోనూ వెలిగిపోయాయి.
ఆ స్వరంలో ఏదో తెలియని ఆర్తి..
నల్లని ఆకాశం కింద, విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతున్న ఆనందనిలయం ముందు.. వేలాది గొంతులు ఒక్కసారిగా “గోవిందా.. గోవిందా..” అంటూ నినదించినప్పుడు, ఆ కొండలన్నీ ఒక్కసారిగా పరవశించాయి. కొత్త ఏడాదిలో అడుగుపెడుతూ, మొదటి నిమిషంలోనే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి నామాన్ని స్మరించడం భక్తులకు దివ్యమైన అనుభూతిని మిగిల్చింది.
తమ బాధలను మరచి, శ్రమను, చలిని లెక్కచేయక, కేవలం ఆ స్వామి చూపు కోసం వేచి చూసిన భక్తులు.. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ లడ్డూ ప్రసాదాలు పంచుకున్నారు. కేవలం తీపి కాదు, ఆ ఏడుకొండల వాడిపై ఉన్న అచంచలమైన నమ్మకం మరియు తోటి భక్తులపై ఉన్న సోదరభావం.
వైకుంఠ ద్వార దర్శనాల రద్దీ ఉన్నప్పటికీ, రేపటి నుంచి టోకెన్లు లేని సామాన్య భక్తులను కూడా అనుమతించాలనే నిర్ణయం భక్తులలో ఆనందాన్ని నింపింది. స్వామి దర్శనం కోసం వేచి ఉండే ప్రతి నిమిషం ఒక తపస్సులా, ప్రతి అడుగు ఒక ప్రార్థనలా మారి ఆ గిరుల మధ్య గోవింద నామస్మరణ మారుమోగిపోతోంది.
కష్ట సుఖాలు రెంటినీ ఆనందంతో అనుభవించేలా, లోకమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ వేంకటేశ్వరుడిని ప్రార్థిస్తూ.. 2026 అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుందాం.
– ఓం నమో వేంకటేశాయ!