– మహానాడే ముహూర్తమా!?
– విజనరీ డిజైనరీ
కుమారుడు నారా లోకేష్ కి అన్ని బాధ్యతలు అప్పగించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేస్తున్నారా..పార్టీలో..
ప్రభుత్వంలో ఇటీవల జరుగుతున్న ఎన్నో పరిణామాలు..
లోకేష్ ప్రమోషన్నే సూచిస్తున్నాయి..
అన్నీ అనుకున్నట్టు జరిగితే..
స్థానిక ఎన్నికలకు ముందు..లేదా ఎన్నికలు ముగిసిన వెంటనే కుమారుణ్ణి పెద్ద సీటులో కూర్చోబెట్టి తాను “నెక్స్ట్ లెవెల్”కి వెళ్ళే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు తెలుస్తోంది..!
నిజానికి ఈ ఆలోచన ఇప్పటిది కాదు..చంద్రబాబు తదుపరి లోకేష్ బాబే అన్న సంగతి ఎప్పటి నుంచో అనుకుంటున్నదే..తన రాజకీయ వారసుడుగా.. పదవీ వారసుడుగా కొడుకు లోకేష్ ను చంద్రబాబు ఎప్పటి నుంచో ట్రెయిన్ చేస్తూ వస్తున్నారు..
గతంతో పోలిస్తే.. లోకేష్ ఇటీవలి కాలంలో బాగా రాటు దేరిన సంగతి స్పష్టంగా కనిపిస్తోంది.2024 ఎన్నికలకు కొంత కాలం ముందు లోకేష్
తన మాట తీరు..బాడీ లాంగ్వేజీ తదితర విషయాల్లో ఎవ్వరికీ తెలియని ఒక ట్రైనింగ్ తీసుకున్నారట..
అందుకే..మొన్న ఎన్నికల సమయంలో గాని.. ప్రస్తుత ప్రభుత్వంలో గాని ఆయన వ్యవహారశైలిలో అనూహ్యమైన మార్పు వచ్చింది..వ్యవహారంలో దూకుడు పెరిగింది.. మాటలో స్పష్టత వచ్చింది..చిన్నప్పటి నుంచి తండ్రి చంద్రబాబును చూస్తూ పెరిగారు గనుక ఇప్పుడు పూర్తిగా తండ్రికి తగ్గ కొడుకులా కనిపిస్తున్నారు.
ఇదంతా చంద్రబాబు ముందుచూపు..ఆయన మేనేజ్మెంట్..!
ఇదిలాఉండగా మొన్న 2024 ఎన్నికల్లో ఘనవిజయం క్రెడిట్ పూర్తిగా లోకేష్ ఖాతాలో పడేట్టు చంద్రబాబు కథ నడిపారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా లోకేష్ పాత్ర ప్రముఖంగా ఉండేలా ఆయన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు.
పార్టీ పరంగా..ప్రభుత్వ పరంగా.. కూటమిలోని మిగిలిన రెండు పార్టీలతో సమన్వయం పరంగా కొడుకు పాత్ర చాలా కీలకంగా ఉండేలా
చంద్రబాబు మొదటి నుంచి పావులు కదుపుతూ వస్తున్నారు..ఈ విషయంలో ఆయన అవసరం మేరకు తన పాత్రను సైతం కుదించుకుంటున్నారు.
ఇక కేంద్రంతో దోస్తీ..మరీ ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ తో సత్సంబంధాలు..ఈ రెంటి విషయంలో కూడా తనను మించి లోకేష్ జోక్యం ఎక్కువగా ఉండేలా ముఖ్యమంత్రి ఆచితూచి అడుగులు వేస్తున్నారు..
ఇప్పుడిక పెద్ద నిర్ణయానికి లైన్ క్లియర్ అవుతున్నట్టే. క్యాబినెట్లో లోకేష్ శాఖ అత్యంత కీలకం.. అటు అమరావతిలో గాని.. ఇటు విశాఖలో గాని జరుగుతున్న అభివృద్ధి పూర్తిగా లోకేష్ బాబు అకౌంట్లోకే జమ అవుతోంది.మొన్న పార్లమెంట్లో అమరావతి రాజధానిగా ఆమోదం పొందే సమయంలో లోకేష్ అక్కడే ఉండి మొత్తం అంతా తన చేతుల మీదుగానే జరిగినట్టు పిక్చర్ ఇవ్వడంలో కృతకృత్యులు కాగలిగారు.
ఇదంతా బాబు..మాస్టర్ స్కెచ్..!
తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ,రాష్ట్ర కమిటీల్లో లోకేష్ మార్కు ఉండేలా చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు.పరాకాష్టగా లోకేష్ ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం ద్వారా కీలక చర్య దిశగా చంద్రబాబు పెద్ద అడుగు వేశారు.
ఆల్రెడీ.. లోకేష్ బాబు డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఒకరకంగా చెప్పాలంటే పార్టీ కమిటీల నియామకాన్ని వచ్చే మే 28 న జరిగే మహానాడులో తీసుకోవాల్సి ఉంది..అంతవరకు ఆగకుండా ఈలోగానే కమిటీలు ఏర్పాటు చేసి లోకేశ్ బాబుని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పీఠంపై కూర్చోబెడుతున్నారు చంద్రబాబు..అంటే అసలైన సింహాసనం అధిరోహించడానికి లోకేష్ అడుగు దూరంలోకి వచ్చేసినట్టే..
మరి..ఆ విషయం ప్రకటించడానికి మహానాడు వేదికగా ఎన్నుకుంటారో ఏమో చూడాలి..ఏదేమైనా మహానాడు మొత్తం ఈసారి లోకేష్ కనుసన్నల్లో..ఆయనే కేంద్రబిందువుగా జరుగుతుందన్నది సుస్పష్టం..
కాగాపోగా.. అయితే మహానాడులో.. కాకుంటే స్థానిక ఎన్నికలకు ముందు..లేకుంటే వెనువెంటనే లోకేష్ సింహాసనం ఎక్కేది తథ్యం..!.
కౌంట్ డౌన్ మొదలైనట్టే..!
– ఈ ఎస్కే.
జర్నలిస్ట్