– నైతిక బాధ్యతగా కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి
– తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ డిమాండ్
హైదరాబాద్: నీట్ ఎగ్జామ్ పేపర్ లీకయ్యిందని ఈ యేడు నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని కేంద్ర ప్రభుత్వం 23లక్షల ల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ మండిపడ్డారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ లలో ఈ లీకులు అనేక అనుమానాలకు తావిస్తున్నది. 2024, 2025 నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే ఈ సంవత్సరం కూడా ఈ దుస్థితి దాపురించింది. మొత్తం 720 మార్కులకు గాను ఏకంగా 600 మార్కుల ప్రశ్నలు గెస్ పేపర్ పేరిట, పరీక్షకు ముందు రోజే లీక్ కావడం వ్యవస్థీకృత లీకేజిని తెలియజేస్తున్నది.
ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యతగా కేంద్ర వైద్య, ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలి. బాధ్యులైన వాళ్లందరినీ పట్టుకుని కఠినంగా శిక్షించాలి. సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి.