– నా కుటుంబానికి పెట్టిన నిప్పంటించారు
– ఆ నిప్పు వాళ్లనే దహించి వేయబోతోంది
– కొడుకుకు టైమివ్వలేకపోయా
– జరుగుతున్న పరిణామాలకు తప్పు నాదే
– తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు
– తప్ప చేసినట్లు తేలితే శిక్ష అనుభవించాల్సిందే
– కోర్టు నిర్ణయమే నాకు శిరోధార్యం
– కరీంనగర్ ‘‘హిందూ ఏక్తా యాత్ర’’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
– బండి సంజయ్ హిందూ ధర్మ పరిరక్షుకుడు
– సంజయ్ కు అండగా నిలవాలంటూ హిందువులకు హంపి పీఠాధిపతి పిలుపు
– ఏక్తా యాత్రకు జన ప్రభంజనం
– కరీంనగర్ కాషాయ మయం
– జన సంద్రమైన కరీంనగర్ వీధులు
– కాషాయ శ్రేణుల జోష్…హిందుత్వ వాదుల నినాదాలతో ముందుకు సాగుతున్న ఏక్తా యాత్ర
– వినూత్న రీతిలో కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్న హిందూ ఏక్తా యాత్ర
కరీంనగర్: ‘‘ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు. నిజానిజాలు కోర్టులు తేలుస్తాయి. తప్పు చేసినట్లు తేలితే శిక్ష అనుభవించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే. కోర్టు నిర్ణయమే నాకు శిరోధార్యం. చట్టానికి కట్టుబడి ఉన్నా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
‘‘సమాజమే నా కుటుంబమని భావించి జీవితమంతా సమాజం కోసమే పనిచేసిన. ఏ ఇంట్లో కష్టమొచ్చినా పెద్ద కొడుకునై అండగా ఉన్నా. కానీ కొడుకుకు టైమివ్వలేకపోయా. జరుగుతున్న పరిణామాలకు తప్పు నాదే. క్షమించండి’’ అని తెలంగాణ సమాజానికి విజ్ఝప్తి చేశారు. జీవితాంతం నా బాటలోనే నడిచిన నా భార్య కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా చేతనైనంత సాయం చేసిందని, ఈరోజు కన్న పేగునే క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాను భయపడేది లేదని స్పష్టం చేసిన బండి సంజయ్ ‘‘నన్ను కెలికారు. నా కుటుంబానికి నిప్పంటించారు. ఆ నిప్పుతోనే అవినీతి, కుట్రలు చేసే వాళ్ల సామ్రాజ్యాన్ని దహించి వేస్తా. అవినీతి గడీలను బద్దలు కొడతా’’అని అన్నారు.
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం కరీంనగర్ లోని వైశ్యాభవన్ నుండి ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ ప్రారంభమైంది. హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ఏక్తా యాత్రకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేలాది మంది ఈ యాత్రకు తరలివచ్చారు. వేలాది మంది కాషాయ శ్రేణులతో కరీంనగర్ జన సంద్రమైంది. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి బండి సంజయ్ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
ఈ లైట్ల ఫోకస్ ఎక్కువైంది. నేను మాట్లాడుతుంటే లైట్ల కాంతికి కళ్లల్లో నీళ్లు వస్తే ఏడుస్తున్నానని అనుకునేరు. నేను భయపడ. బండి సంజయ్ కంట తడి పెట్టే రకంకాదు. టవర్ సర్కిల్ పై కాషాయ జెండాను ఎగరేశాం. కరీంనగర్ ప్రజలకు హ్యాట్సాఫ్. హిందువుల ఐక్యతను చాటేందుకే 16 ఏళ్లుగా హిందూ ఏక్తా యాత్ర చేస్తున్నా. జై శ్రీరాం అనే నినాదమే హిందూ ధర్మాన్ని కాపాడుతుంది. హిందూ సమాజానికి ఆపదొస్తే జై శ్రీరాం నినాదంతో తెగించి కొట్లాడతాం.
కరీంనగర్ గడ్డ రక్తం నాలో ప్రవహిస్తుంది. కరీంనగర్ లో గల్లీగల్లీలో ప్రజా సమస్యలపై కొట్లాడిన. చిన్న కార్యకర్తగా మొదలైంది నా ప్రస్తానం. నా జీవితం కష్టాలు, బాధలే. బాధలను చూసి భయపడి పారిపోయేటోడ్ని కాను.
మీరే నా కుటుంబం. సమాజమే నా ఇల్లు అనుకున్న. హార్ట్ లో స్టంట్ ఉన్నా హార్ట్ ఫుల్ గా 1600 కి.మీలు నడిచిన. తెలంగాణ ప్రజల కష్టాలను పంచుకున్న. నాటి పాలకులు నాపై రాళ్ల దాడి చేసినా, 109 కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడలే. ఏ హిందువుకు ఆపదొచ్చినా అండగా ఉన్నా. మీ ఇంట్లో పెద్ద కొడుకునైన. నా టైమంతా సమాజానికే ఇచ్చిన. నా కొడుకుకు టైమియ్యలేకపోయిన. నా కొడుకును క్రిమినల్ గా చూపే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు. అయినా నా కొడుకును నేను సమర్ధించడం లేదు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తా. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.
నా భార్య సైతం నన్ను ఫాలో అవుతోంది. నేనున్నా లేకున్నా కార్యకర్తలకు చేతనైనంత సాయం చేస్తోంది. ఈరోజు నా కుటుంబానికి నిప్పంటించారు. ఆ నిప్పుతో అవినీతి వ్యవస్థను దగ్దం చేస్తా. అవినీతి, కుట్రలు చేసే గడీల బద్దలు కొడతా. నన్ను, నా కుటుంబాన్ని, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినోడిని విడిచి పెట్టే ప్రసక్తే లేదు.
బండి సంజయ్ భయపడే ప్రసక్తే లేదు. కాషాయ జెండా పట్టి కష్టాలు పడుతూనే ఉన్నా. అయినా బాధపడను..ధర్మం కోసం పోరాడుతూనే ఉన్నా. నా కొడుకుకు టైమివ్వకుండా నేను తప్పు చేసిన. తప్పు నాదే…. నన్ను క్షమించండి. తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు… నిరూపించుకోవాలని చెప్పిన. నా చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసమే పనిచేస్తా. ఇయాళ నా కొడుకుపై జరుగుతున్న దాడిని చూసి కన్నపేగు తల్లడిల్లుతోంది.
నా కొడుకు సంఘటన మమ్ముల్ని ఇబ్బంది పెడుతుంటే… 29 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఆ కుటుంబాలు పడుతున్న క్షోభ గుర్తుకొస్తోంది. శ్రీరామ చంద్రుడికే కష్టాలు తప్పలేదు. శ్రీరామచంద్రుడే నాకు ఆదర్శం. కష్టాలు భరిస్తా. ఆనాడు రాక్షసులు ఆంజనేయస్వామికి నిప్పంటిస్తే ఏమైంది? లంకా దహనమైంది. నేను హనుమంతుడి భక్తుడిని. నా కుటుంబానికి నిప్పంటించారు. ఆ నిప్పుతో అవినీతికి పాల్పడుతూ కుట్రలు చేసే వాళ్ల సామ్రాజ్యాన్ని దహనం చేస్తా. అవినీతి గడీలను కూల్చివేస్తా. వదిలిపెట్టే ప్రసక్త్తే లేదు.