తెలంగాణ మండలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి గుత్తాను చైర్మన్ ఈ పదవి వరించింది. శాసనమండలి చైర్మన్ ఎన్నికకు సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు కావడంతో.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా అధికారులు ప్రకటించారు. మండలి చైర్మన్గా ఏకగ్రీవమైన గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ సీటు వద్దకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు ఎమ్మెల్సీలు దగ్గరుండి గుత్తాను చైర్మన్ సీటులో కూర్చోబెట్టారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014లో మండలికి తొలి చైర్మన్గా స్వామిగౌడ్ ఎంపికయ్యారు. ఆ తర్వాత 2019 మార్చిలో ఆయన పదవీకాలం ముగియడంతో అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం మళ్లీ చైర్మన్ పదవిని అలంకరించారు గుత్తా సుఖేందర్ రెడ్డి.
గతేడాది జూన్ మొదటి వారం వరకు గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్గా సేవలందించారు. గుత్తా ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో.. ప్రోటెం చైర్మన్గా మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు. అయితే భూపాల్ రెడ్డి పదవీకాలం కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎంఐఎం సభ్యుడు సయ్యద్ ఖాద్రీ మండలి ప్రొటెం చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
మరోమారు గుత్తా సుఖేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ మరోసారి మండలి సభ్యునిగా అవకాశం కల్పించారు. గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. దీంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే గతంలో మండలి చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉన్న గుత్తాకు.. మరోసారి మండలి చైర్మన్గా ఎన్నుకోవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గుత్తాకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం ఉందంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కావడం, శాసనసభ స్పీకర్గా పోచారం శ్రీనివాస్ రెడ్డి,
కౌన్సిల్ ఛైర్మన్గా గుత్తా సుఖేందర్రెడ్డి కావడమేనన్నారు. ఎందుకంటే ఈ ముగ్గురూ రైతు బిడ్డలు కావడం విశేషమని కేటీఆర్ మండలిలో వ్యాఖ్యానించారు. రైతు బిడ్డలే అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని కేటీఆర్ తెలిపారు.