భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారిగా మన విదేశాంగ విధానం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది!
గత 15 రోజులలో మొత్తం 11 దేశాల అధిపతులు లేదా విదేశాంగ మంత్రులు కావచ్చు న్యూ దిల్లీని సందర్శించారు.
దాదాపుగా ప్రపంచ మీడియా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వార్తల మీద దృష్టి పెట్టి అంతకంటే తీవ్రమయిన అంశాన్ని విస్మరించాయి. మరీ ముఖ్యంగా భారతదేశానికి సంకట పరిస్థితి ని తెచ్చే సంఘటన ఒకటి జరిగింది.
రష్యా మార్చి నెల15న నార్త్ వెస్ట్రన్ పసిఫిక్ మహా సముద్రంలో కురిల్ దీవులలో 3000 మంది ట్రూపులతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించింది యుద్ధ సన్నత లో భాగంగా! దాదాపు 50 డ్రోన్ల తో ఆకాశంలో విన్యాసాలు చేసింది.
కురిల్ దీవుల వివాదం!
పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న జపాన్ కి చెందిన పలు దీవులలో కురిల్ దీవులు కూడా ఉన్నాయి. 1945 లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అప్పట్లో హిట్లర్ జెర్మనీ తో ఉన్న జపాన్ మీద సోవియట్ యూనియన్ సైన్యం దాడి చేసి జపాన్ కి చెందిన కురిల్ దీవులని స్వాధీనం చేసుకుంది. జెర్మనీ లొంగిపోయాక రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది. జెర్మనీ, ఇటలీ లు యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకాలు చేసి లొంగిపోతున్నట్లు ఒప్పుకున్నాయి. కానీ జపాన్ మాత్రం సంతకం చేయలేదు. హిరోషిమా, నాగసాకి ల మీద అమెరికా వేసిన అణు బాంబుల వల్ల తీవ్రంగా నష్టపోవడం వలన అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ సోవియట్ యూనియన్ తో జపాన్ యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకం చేయలేదు ఇంతవరకు. అంటే సోవియట్ లేదా రష్యా జపాన్ లు ఇప్పటికీ యుద్ధం చేస్తున్నట్లుగానే పరిగణిస్తున్నారు టెక్నికల్ గా. అప్పటి నుండి రష్యా-జపాన్ లు యుద్ధం చేస్తున్నట్లుగా ఉన్నట్లే. అందుకే రష్యా కురిల్ దీవులని తన ఆధీనంలోనే ఉంచుకుంది ఇప్పటి వరకు.
రష్యా ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలటరీ ఆపరేషన్ చేయకముందు వరకు అడపా దడపా రెండు దేశాల మధ్య కురిల్ దీవుల మీద చర్చలు జరుగుతూ వచ్చాయి కానీ ఒక నిర్ణయానికి రాలేకపోయాయి.
రష్యా ఉక్రెయిన్ లో మిలటరీ ఆపరేషన్ ప్రారంభించగానే అమెరికా, EU, ఆస్ట్రేలియాతో పాటు జపాన్ కూడా రష్యా మీద ఆంక్షలు విధించింది. జపాన్ తమ మీద ఆంక్షలు విధించడం మీద వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహంతో ఉన్నాడు. అందుకే కురిల్ దీవుల దగ్గర సైనిక విన్యాసాలు చేయడం మొదలు పెట్టాడు. ఈ చర్య పరోక్షంగా జపాన్ మీద దాడి చేస్తాను అని హెచ్చరించడం లాంటిదే! ఇప్పటికే జపాన్ తన హక్కైడో దీవుల విషయంలో చైనా నుండి బెదరింపులు ఎదుర్కొంటున్నది.
తరుచూ హక్కైడో దీవుల దగ్గరికి చైనా తన ఫిగ్రేట్ లని పంపి బెదిరింపులు చేస్తున్నది. జపాన్ కి చెందిన హక్కైడో దీవుల గురుంచి జపాన్-చైనా ల మధ్య చాలా కాలంగా వివాదం ఉంది. హక్కైడో దీవులు తమవే అని చైనా వాదిస్తున్నది కానీ జపాన్ అవి మా ఉత్తర సరిహద్దు ప్రాంతం అని వాదిస్తున్నది. నిజానికి హక్కైడో దీవులు జపాన్ కి చెందినవే కాకపోతే జపాన్ దీవుల అన్నిటిలోనూ దూరంగా విసిరేసినట్లుగా ఉంటుంది పసిఫిక్ మహా సముద్రంలో. సంవత్సరం పొడుగునా మంచుతో కప్పబడి ఉండే హక్కైడో దీవుల లో ప్రజలు చాల తక్కువ సంఖ్యలో ఉంటారు.
QUAD అనే కూటమి ఏర్పడింది పసిఫిక్ మహా సముద్రంలో చైనా ని ఎదుర్కోవడానికే! భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లు QUAD లో ఉన్న నాలుగు దేశాలు. ఇప్పుడు తాజాగా జపాన్ ని రష్యా బెదిరిస్తున్నది. దాంతో దిక్కు తోచని పరిస్థితుల్లో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడో మార్చి నెల 22 న న్యూ ధిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యి పుతిన్ కి నచ్చచెప్పమని అభ్యర్ధించాడు.
ఇది చాలా కీలకమయిన, సంక్లిష్టమయిన పరిస్థితి మోడీ ప్రభుత్వానికి. జపాన్ తో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి అదే సమయంలో రష్యాతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. QUAD ఒప్పందాన్ని దానిలోని అంశాలని ప్రస్తావిస్తూ జపాన్ ప్రధాని కిషిడో భారత్ తమతోనే ఉంటుందని ఆశిస్తున్నాను అంటూ మెలిక పెట్టేసి వెళ్ళిపోయాడు. నిజమే! పసిఫిక్ మహా సముద్రంలో ఏ దేశం అయినా QUAD సభ్య దేశమయిన జపాన్ మీద దాడి చేస్తే మిగతా మూడు దేశాలు జపాన్ కి బాసటగా ఉండాలి అనే క్లాజ్ ఉంది.
కానీ రష్యా కురిల్ దీవుల మీద జపాన్ కి వ్యతిరేకంగా విన్యాసాలు చేస్తుందని మూడేళ్ళ క్రితం ఎవరూ అనుకోలేదు కానీ జరిగిపోయింది. కానీ జపాన్ ప్రధాని ఫుమియో కిషిడో అమెరికా వెళ్ళకుండా నేరుగా భారత్ రావడం దేనికి? ఉక్రెయిన్ విషయంలో అమెరికా, EU దేశాల వైఖరిని చూసిన జపాన్ అమెరికాని నమ్ముకోవడం కంటే భారత్ ని విశ్వసించడమే మేలు అన్న భావనకి వచ్చి ఉండవచ్చు.బహుశా ప్రస్తుత
పరిస్థితుల్లో పుతిన్ మోదీజీ మాట తప్పితే వేరే ఎవ్వరి మాటా కూడా వినే స్థితిలో లేడు అన్న నిజం కూడా కావొచ్చు. ఏది ఏమయినా అందరూ అనుకుంటున్నట్లు రష్యా తన దేశహితం కోరి చేసే ఏ పని విషయంలో నైనా మోదీజీ కల్పించుకోరు. అడిగితే సలహా ఇస్తారు అంతే!
జపాన్ ప్రధాని వచ్చి వెళ్ళిన వెంటనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఎలాంటి ఆహ్వానం లేకుండా భారత్ వచ్చాడు. భారత్ రావడానికి ముందు పాకిస్థాన్ లో జరిగిన OIC[Organization of Islamic Countries] సమావేశానికి హాజరయి అక్కడ కాశ్మీర్ ప్రస్తావన వచ్చినప్పుడు భారత్ పాకిస్థాన్ లు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి అంటూ ఒక సలహా ఇచ్చి పాకిస్థాన్ కి వంత పాడాడు. పాకిస్థాన్ నుండి కాబూల్ వెళ్ళి అక్కడ తాలిబాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి అక్కడనుండి నేరుగా న్యూ ఢిల్లీ వచ్చాడు.
ప్రధాని తో పాటు శ్రీ జై శంకర్, అజిత్ దోవల్ గారితో చర్చలు జరిపాడు. బహుశా జపాన్ ప్రధాని వచ్చిన విషయం మీద ఆరా తీయడానికే వచ్చి ఉంటాడు కానీ ఆ ప్రస్తావన ఏమీ లేకుండా నేరుగా లాడాక్ దగ్గర సైన్యం మోహరింపు మీద మొహమాటం లేకుండా అడిగేశారు. వాంగ్ యీ మాత్రం మన ఇరు దేశాల సైనిక శక్తిని సరిహద్దుల దగ్గర ఖర్చు పెట్టకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి అంటూ వాక్రుచ్చాడు. పనిలో పనిగా జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారిని బీజింగ్ రావాల్సిందిగా ఆహ్వానించాడు వాంగ్ యీ! ముందు సరిహద్దు సమస్య పరిష్కారం అయ్యాక చూద్దాం అంటూ బదులు ఇచ్చారు అజిత్ దోవల్!
కోవిడ్ వల్ల తరుచూ తమ ముఖ్య నగరాలు లాక్ డౌన్ లో ఉండడం వలన చైనా తీవ్రంగా నష్టపోతున్నది. ఇలాంటి తరుణంలో భారత్ తో మళ్ళీ సత్సంబంధాలు పునరుద్ధరించుకోవాలి అనే ఆశ చైనా ది. ఎంత పెద్ద ఆర్ధిక వ్యవస్థ అయినా ఖర్చు కూడా అంటే పెద్దగా ఉంటుంది. ఒకసారి పెద్ద అంతరం వస్తే దానిని పూడ్చుకోవడానికి ఏళ్లకేళ్ళు పడుతుంది.
ఎలిజబెత్ ట్రస్స్[Elijibeth Truss] బ్రిటన్ విదేశాంగ మంత్రి. రష్యా నుండి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు ఒప్పదం చేసుకోబోతున్నది అని తెలుసుకొని సలహా ఇవ్వడానికి లండన్ నుండి న్యూ ధిల్లీ వచ్చింది. మన విదేశాంగ మంత్రి శ్రీ జై శంకర్ గారితో దాదాపుగా 45 నిముషాలు పాటు జరిగిన చర్చలలోని ముఖ్యాంశం ఏమిటంటే రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు అని సలహా ఇవ్వడానికే! కానీ శ్రీ జైశంకర్ గారు నేరుగా ఒక్కో point ని ఎత్తి చూపుతూ మారు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా చేశారు.
శ్రీ జై శంకర్ గారి మాటల్లో: యూరోపు ఇప్పటికీ రష్యా నుండి గాస్ మరియు క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటూనే ఉన్నది. ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసి ఇప్పటికి నెల రోజులు అవుతున్నది కానీ మీరు మాత్రం మీ అవసరాల కోసం రష్యా మీద ఆధారపడ్డారు అలాంటిది మేము మా అవసరాల మీద ఎందుకు గట్టిగా నిలబడకూడదు? యూరోపు కి కావాల్సిన మొత్తం ఆయిల్ మరియు గాస్ లో 58% రష్యా నుండే వస్తున్నది కానీ మేము రష్యాతో చేసుకోబోయే ఒప్పందం మా మొత్తం అవసరాలలో కేవలం 2% మాత్రమే రష్యా నుండి కొనబోతున్నాము.
భారత్ తన అవసరాల కోసం గాలిస్తుంది. ఎక్కడ చవకగా దొరికితే అక్కడ కొంటుంది. ఆ హక్కు మాకు ఉంటుంది. మీ సలహాకి ధన్యవాదములు! శ్రీ జైశంకర్ గారి సమాధానం చాలా డిప్లొమాటిక్ గా ఉంది. ఎలిజిబెత్ ట్రస్స్ లండన్ వెళ్ళగానే బ్రిటన్ ప్రధాని ఒక ప్రకటన చేశారు: భారత్ తన అవసరాల కోసం తగిన చర్యలు తీసుకునే హక్కుని కలిగి ఉంది అని. ఏదో విధంగా భారత్ కి నచ్చచెప్పడానికి బ్రిటన్ ఆపసోపాలు పడ్డది కానీ ఫలించలేదు.
మార్చి 31 న అమెరికా నేషనల్ సెక్యూరిటీ డిప్యూటి అడ్వైజర్ దలీప్ సింగ్ న్యూ ధిల్లీ వచ్చాడు. నేరుగా జై శంకర్ గారితో శ్రీ అజిత్ దోవల్ గారితో సమావేశం అయ్యాడు. ప్రధానంగా రష్యాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవద్దు అని చెప్పడానికే వచ్చాడు. దలీప్ సింగ్ మాటల్లో: భారత్ కనుక రష్యాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తే భవిష్యత్తులో చైనా మీ మీద దాడి చేస్తే మాత్రం రష్యా మీకు సహకరించదు! వెల్! ఆ విషయం భారత ప్రభుత్వానికి బాగా తెలుసు.
మరి అమెరికా సైనిక పరంగా సహకరిస్తుందా? రెండేళ్ళ నుండి లాడాక్ సరిహద్దుల్లో చైనా తిష్ట వేసుకొని కూర్చున్నా అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు ఎందుకు? రష్యా సహకరించదు అంటే సైనిక పరంగా అని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చైనాకి వ్యతిరేకంగా రష్యా ఎలాంటి చర్య తీసుకోదు భారత్ కోసం. యుద్ధం అంటూ వస్తే అటు చైనాతో పాటు ఇటు పాకిస్థాన్ తో two front వార్ చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది.
లోపాయికారిగా చైనాకి అమెరికా సహకరించకపోతే చాలు. అమెరికా భారత్ కి ఎప్పుడు సహకరించింది? చివరకి కార్గిల్ యుద్ధ సమయంలో మన మిరేజ్ యుద్ధ విమానాలకి GPS లింక్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది కానీ అమెరికా హెచ్చరికల్ని లెక్క చేయకుండా ఫ్రాన్స్ మన మిరేజ్ యుద్ధ విమానాలకి లేజర్ గైడెడ్ బాంబ్ లని సప్లై చేసింది అప్పట్లో. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రష్యాని వదిలేసి తమ కూటమితో చేతులు కలపమని అడుగుతున్నది అమెరికా?
సరిగ్గా అమెరికా NSA డిప్యూటి న్యూ ధిల్లీ వదిలి వెళ్ళగానే రష్యా విదేశాంగ మంత్రి న్యూ డిల్లీ చేరుకున్నారు. నేరుగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ ని కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి ఉన్నా రష్యా విషయంలో తటస్థంగా ఉన్నందుకు పుతిన్ అభినందలు తెలుపమన్నారు అంటూ ప్రధాని నరేంద్రమోదీజీ తో మొదటి మాటగా అన్నాడు సేర్గే లవ్రోవ్ ! ఆయుధాల దగ్గర నుండి ఏవయినా సప్లై చేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అంటూ పుతిన్ అభిప్రాయాన్ని వెల్లడించాడు.
భారత్ కి పుతిన్ మంచి ఆఫర్ ఇచ్చాడు అది బారెల్ బ్రెంట్ క్రూడ్ 38 డాలర్లకే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంటూ రాయబారం పంపాడు. ప్రస్తుతమ్ అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ధర బారెల్ కి $113 గా ఉంది అంటే దాదాపుగా 65 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాడు పుతిన్ మనకి. ఉక్రెయిన్ నుండి సరఫరా అయ్యే సన్ ఫ్లవర్ విత్తనాలు యుద్ధం వలన ఆగిపోవడంతో భారత్ లోవంట నూనెల ధరలు రెట్టింపు అయ్యాయి. ఆ లోటుని పూడ్చడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నాడు అంటే ఒప్పందం జరిగిన నెల రోజుల లోపే మళ్ళీ యధావిధిగా సన్ ఫ్లవర్ విత్తనాల సరఫరా జరుగుతుంది.
రూబుల్–రూపీ మారకం విలువ లెక్కకట్టి రెండు దేశాల మధ్య ఇంటర్ బాంక్ కనెక్టివిటీ కోసం విధి విధానాలని రూపొందించి దానిని అమలు చేసే దిశగా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. గత నెల రోజులుగా మన దేశ ఎగుమతిదారులకి రావాల్సిన డబ్బు ఆగిపోయింది రష్యా నుండి. దీని కోసం ఒక విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు.
ఇక చివరిగా రష్యా కి మన దేశానికి మధ్య జరగబోయే ఒప్పందాలని నిశితంగా పరిశీలిస్తున్నది సౌదీ అరేబియా. ఒక వేళ సౌదీ కనుక చైనాతో యువాన్-దినార్ ఒప్పందం జరిగితే అది అమెరికాకి పెద్ద దెబ్బ. సౌదీ తో పాటు UAE కూడా అదే దారిలో నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఎందుకంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యాకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి వోటింగ్ సమయంలో భారత్ తో పాటు UAE కూడా దూరంగా ఉంది. ఇది గల్ఫ్ దేశాల వైఖరిలో వస్తున్న మార్పుకి సంకేతం! క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లలో డాలర్ ఆధిపత్యానికి చెల్లు చీటీ వ్రాయాలంటే ముందు గల్ఫ్ దేశాల సంతకం కావాలి! అది త్వరలోనే జరుగుతుంది అని ఆశిద్దాం!
అమెరికా ఏక పక్ష ధోరణికి కాలం చెల్లబోతున్నది! కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని రద్దు చేసే ముందు భారత్ మమ్మల్ని అడగలేదు అని అన్న అమెరికా ఇప్పుడు రష్యా తో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవద్దు అంటూ రాయబారం పంపిన అమెరికా ఒకటి కాదు! కాశ్మీర్ లో 3G మొబైల్ నెట్వర్క్ ని తాత్కాలికగా ఆపేసినప్పుడు అది మానవ హక్కుల ఉల్లంఘన అని అన్న యూరోపియన్ యూనియన్ అదే సమయంలో చైనా లోని వుయ్ఘర్ ముస్లింస్ మీద చైనా చేస్తున్న అక్రుత్యాలని మాత్రం గట్టిగా అడగలేక పోయింది. వాళ్లకి చైనాతో అవసరం ఉంది!
బాటం లైన్!
‘’ధనం లేని వాడిని వేశ్య కూడా విసర్జిస్తుంది‘’! ఆయుధమ్ లేని రాజుని దొంగలు కూడా లెక్క చేయరు!
జైహింద్!
– పార్ధసారధి పోట్లూరి