అనర్థాలను అరికట్టడంలో కనిపించని భారతీయత 

నిన్న దేశ ప్రధాని మోడీ బెంగళూరులో మాట్లాడుతూ రక్షణ విమాన రంగంలో దేశం స్వాలంబన దిశగా ఉందని అన్నారు. దిగుమతుల స్థాయి నుండి ఎగుమతుల స్థాయి కి చేరుకున్నామని సెలవిచ్చారు.  ఫిబ్రవరి 14  వ్యాలంటైన్ డే అని ఇది ప్రాశ్చాత్య దేశాలు ఆచరిస్తున్న సంస్కృతి దీనికి భిన్నంగా  కౌ హగ్ డే నిర్వహించాలని  సర్కులర్  జారీ చేసి తర్వాత ఉపసంహరించుకోవడం జరిగింది. వాస్తవానికి  దేశం అగ్రగామిగా ఉన్నది నిరుద్యోగం, పేదరికం, నీచత్వం,దారిద్ర్యం, జీవన ప్రమాణాలు దిగజారడం, అనారోగ్యం, అవిద్య,  దివాళాకోరుతనం, అజ్ఞానం, కాలుష్యం, అభద్రతాభావం, ఆహార కల్తీ, విదేశీ వస్తువులను దిగుమతి చేసుకోవడంలో, మేధో వలసలు ఎక్కువగా  ఉన్న సంగతి ప్రపంచానికి మనం చెప్పక్కర్లేదు.  అధిక ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి నిరుద్యోగం,  ప్రజాస్వామ్యం అణచివేత విద్వేష రాజకీయాలు రూపాయి విలువ భారీగా పతనం కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ సమాజంలో విభజన దేశ భద్రతలో వైఫల్యం   ప్రజాస్వామ్యం, సెక్యూలరిజం, సహనం లేకుండా పోవడం ఈ నవ వసంతాలలో ఎక్కువగా  ఉన్న  సంగతి ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రతి అడ్డమైన  పనికి దేశభక్తి, దేశ సంస్కృతి  ముడిపెట్టి  ప్రచార ఆర్భాటాలకు పరిమితమైన ప్రభుత్వాన్ని చూస్తున్నాం. సంవత్సరానికి తృణధాన్య సంవత్సరంగా నామకరణం చేశారు.

తృణధాన్యాలు పండించే రైతుకు ప్రోత్సాహకం లేకుండా చేసి వినియోగ పంటల నుండి వాణిజ్య పంటలకు మారే దుస్థితి వచ్చింది. దేశ రాజధానిలో  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 దాటింది. ప్రపంచంలో  నివాసయోగ్యం కాని నగరాలు ఏదైనా ఉన్నదా అంటే దీనికి సమాధానం ఢిల్లీ అని చెప్పవచ్చు. గత ఎనిమిది  సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఢిల్లీ, యూపీ, హర్యానా పంజాబ్ రాష్ట్రాలలో పంటలను తగులపెట్టడం వలన అలాగే పరిశ్రమల నుండి వెలువడుతున్న విష వాయువుల వల్ల విపరీతమైన దుస్థితి ఏర్పడింది. ఈ పాపం నాది కాదు అంటే నాది కాదని రాష్ట్రాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దేశ సాగు భూముల్లో సేంద్రియ కర్బనం తగ్గిపోతున్నది. మితిమీరిన క్రిమిసంహారక మందులు వాడటం వలన భూములు నిస్సారం అవుతున్నాయి. భూసారం గురించి మంచి వ్యవసాయ పద్ధతులు పాటించే వారు కరువయ్యారు. కలుపు నివారణకు బ్యాన్ చేసిన గ్లైసిల్, పెండ మీథేన్, స్టాంప్  లాంటి భయంకర రసాయనాలు వాడటం జరుగుతున్నది. ప్రజల ఆరోగ్య అలవాట్లలో మార్పు తీసుకురావాల్సిన ప్రభుత్వాలు  అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి పునాది’- వాటిలో ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలన్నీ ఉండాలి. మనిషి మానసికంగా శారీరకంగా ఎదిగేందుకు ఎంతో ఉపకరిస్తాయి.

ఈ రకమైన సమతుల ఆహారాన్ని తీసుకోలేని స్థితే పోషకాహార లోపానికి దారితీస్తుంది. పోషకాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు వ్యక్తి, కుటుంబం, సమాజంపైనా ఇది విస్తృత దుష్ప్రభావాన్ని చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ లోపాలు అధికోత్పత్తిని దెబ్బతీసి పేదరికాన్ని పెంచుతుంది. ప్రతిరోజు సమతుల ఆహారం అందితేనే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నట్లు. పోషకాహర లోపం లోపిస్తే ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తాయి.  పౌష్టికాహార లోపాన్ని జయించడానికి దేశంలో ప్రజలు భజనలు చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో  సరైన తిండిలేక చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. పిల్లలకు మూడు పూటల తిండి లేక దీనస్థితిలో కడు పేదరికంలో బతుకీడుస్తున్న కుటుంబాలు కోకోల్లాలు. కేంద్ర  ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నది. కానీ చిన్నారులు పొత్తి కడుపుల్లోనే చిదిమిపోతున్నారనే నిజం చాలా మందికి తెలియదు.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో పోషకాహార లోపం సమస్య ఉంది కానీ ఈ సమస్య తీవ్రత మన దేశంలో అధికంగా ఉంది. ఉండవలసిన బరువుకంటే తక్కువ బరువు వున్న పిల్లలు 40 శాతం ఇండియాలోనే ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రతి ఏటా మన దేశంలో సగంవరకూ శిశు మరణాలు పౌష్టికాహార లోపంవల్లే సంభవిస్తున్నాయి. మహిళల్లో కూడా పౌష్టికాహార లోపం సమస్య తీవ్రంగా ఉండి, 56 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు సర్వేలు తలియజేశాయి. దీనికి కారణం పేదరికం, నిరక్షరాస్యత, ఎక్కువ వున్న కుటుంబాల పిల్లల్లో పౌష్టికాహారం లోపాలు ఎక్కువగా ఉన్నాయి.  కూల్డ్రింక్స్ లో ఎక్కువశాతం పురుగుల మందుల అవశేషాలు పుష్కలంగా ఉన్నట్లు సెంటర్ ఫార్ సైన్స్ అండ్ ఎన్విరోనమెంటల్ ఇండియా దశాబ్ద క్రితమే తేల్చి చెప్పింది. మానవ శరీరాలను ప్రమాద కారకంగా మారే పదార్థాలు కూల్డ్రింక్స్ లో ఉండే పదార్థాలు  కార్బోనేటేడ్ వాటర్, కార్న్ సిరప్, పంచదార, ఎస్పిరటం, కారమెల్,పాస్ఫరిక్ ఆమ్లం, కెఫిన్, సిట్రిక్ ఆమ్లం, పొటాషియం బెంజైట్,పొటాషియం సిట్రేట్ ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. కూల్డ్రింక్స్ లో ఉండే ఆర్గానో క్లోరిన్, అర్గోనో ఫాస్ఫరస్ పురుగుల మందులైన లిండేన్,డిడిటి, మలాథియాన్ ఉన్నట్లు పరిశోధనలు చెపుతున్న ప్రభుత్వాలు వీటిని బ్యాన్ చేయడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి విదేశీ  కూల్డ్రింక్ కంపెనీలు ఏటా వేల కోట్లు దోచుకుంటున్నాయి.

అలాగే ప్రతి సంవత్సరం విదేశీ మద్యాన్ని దిగుమతి చేసుకోవడం,  కొరియా   చైనా తైవాన్ మలేసియా సింగపూర్ దేశాల నుంచి ఎలెక్ట్రానిక్ వస్తువుల దిగుమతి ప్రతి సంవత్సరం పదిహేను శాతం అధికంగా ఉంటున్నది. మన  దేశంలో తయారయ్యే ఒక్క మొబైల్ యూనిట్ లేదు. ప్రపంచ ఆకలి సూచికలో 129 స్థానం, ఆర్థిక సూచికలో 108 స్థానం, మానవ అభివృద్ధి సూచికలో, సంతోష సూచిక, ఆరోగ్య సూచిక  ఎప్పుడూ వంద స్థానానికి తక్కువ లేకుండా చేసుకుంటున్నాం. రూపాయి విలువ దిగజారలేదని డాలర్ విలువ పటిష్టమైందని ఆర్థిక మంత్రి సెలవిస్తారు.    ఆర్థిక సంక్షోభం అంటే  కొన్ని ద్రవ్యపరమైన ఆస్తులు ఉన్నట్టుండి తమ నామమాత్ర మూల్యాన్ని  కోల్పోయే విస్తృతమైన పరిస్థితి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవడం, ఆర్థిక బుడగలు పేలిపోవడం, ద్రవ్య (కరెన్సీ) సంక్షోభం, ప్రభుత్వం తాము చేసిన అప్పులు చెల్లించకపోవడం మొదలైనవి ఆర్థిక సంక్షోభం కిందికి వస్తాయి. చాలామంది ఆర్థికవేత్తలు ఆర్థిక సంక్షోభాలు ఎందుకు ఏర్పడతాయి, వాటిని ఎలా నివారించాలనేందుకు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించారు. కానీ వాటి శాస్త్రీయత మీద ఆర్థికవేత్తలకు ఏకాభిప్రాయం లేదు.  అప్పుడప్పుడు ఆర్థిక సంక్షోభాలు ఏర్పడుతూనే ఉన్నాయి.  ఆర్థిక నిర్వహణలో శ్రీలంక ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఆ దేశాన్ని ఇవాళ అత్యంత దీన స్థితిలో నెట్టాయి.  రాజకీయ లబ్దే ప్రధానంగా జాతీయ ప్రయోజనాలను మరుగుపడినచోట ఇలాంటి ఉత్పాతాలే మిగులుతాయి.  పాఠం నేర్పకపోతే ఏ దేశమైనా మునగక తప్పదు.   మన  దేశంలో  ఆర్థిక వృద్ధి అంచనాలు గత రెండు సంవత్సరాలుగా  పేలవంగా ఉన్నాయి ఉద్యోగాలు సృష్టించటమనేది ప్రభుత్వానికి ఎదురయ్యే అతి పెద్ద అవరోధంగా ఉంటుంది.

జనాభా రీత్యా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా భారతదేశం  తన యువ కార్మిక శక్తిని ఇముడ్చు కోవాలంటే ఏటా 1.20 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది. అయితే 2016 నవంబర్‌లో చేసిన నోట్ల రద్దు దెబ్బకు కుదేలైన చిన్న వ్యాపారాలపై జీఎస్‌టీ అమలుతో మరోసారి గట్టి దెబ్బతిన్నాయి. వాటిలో చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. ఫలితంగా లక్షలాది మంది, ప్రత్యేకించి అసంఘటిత రంగంలో వారు ఉద్యోగాలు కోల్పోయారు. దేశంలో వ్యవసాయం, నిర్మాణ రంగం, చిన్న పరిశ్రమలు అతిపెద్ద ఉద్యోగ రంగాలు. ఎందుకంటే కార్మిక శక్తి ఎక్కువ అవసరమైన రంగాలవి. కానీ ఈ మూడు రంగాలూ ఇటీవలి సంవత్సరాల్లో ఉద్యోగాలు సృష్టించలేకపోతున్నాయి. మన దేశానికి స్వతంత్రం వచ్చాక వృత్తిదారుల బతుకులు ఉన్నత స్థితికి చేరాల్సిందిపోయి, నీచ స్థితికి  చేరడం మొదలయింది.  దేశంలో రోజు రోజుకు ఆహార కల్తీ ఎక్కువ అయిపోయింది. ఏది కొనాలి అన్న, తినాలి అన్న భయపడే రోజులు వచ్చాయి. వారి వ్యాపారం పెంచుకోవాలి అని ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు, దీంతో వారి వ్యాపారమే కాదు ఆస్పత్రులు కూడా నిండిపోతున్నాయి. డాక్టర్లకు కూడా ఈ ఆహార కల్తీ బాగా కలిసి వస్తుంది అని చెప్పాలి.

టీ, కాఫీ, పాలు,తేనె,  పిండి, నూనెలు, మాంసం, కంది పప్పు, మిరియాలు, జీలకర్ర, బియ్యం ఇలా నిత్యం వినియోగించుకునే అన్ని పదార్థాలు  కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుంది పరిస్థితి. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు సరుకులు కల్తీ చేస్తుండడం, వినియోగదారుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతీస్తోంది. నకిలీ వస్తువులను నియంత్రించాల్సిన విభాగాలు బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమవుతూ ఆహార పదార్థాలపై పన్నుల రూపంలో వసూలు చేస్తున్న మొత్తంలో నామ మాత్రపు సొమ్ము నైనా కల్తీ  నియంత్రణ, నిరోధానికి ఖర్చు పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. నకిలీ సరకులపై న్యాయ స్థానాలు స్వయంగా కేసుల్ని స్వీకరించి, మొట్టికాయలు వేసినా,  అధికార యంత్రాంగం మందగమనం వీడలేదు. కల్తీ వస్తువులను విక్రయించే వారిపై దాడులు తూతూ మంత్రమే ఆపుతున్నాయి. యూరియా  డిఏపి   ఫంగిసైడ్  పెస్టిసైడ్ లను బ్యాన్ చేసి నకిలీ ఎరువుల తయారీదారులను నియంత్రించాలి. సేంద్రియ ఎరువులు, కంపోస్ట్ వాడకం పెంచాలి.  పాడి పశువులను నమ్ముకున్న రైతులకు  ప్రభుత్వం అండగా నిలిస్తే పాడి పరిశ్రమ బ్రతుకుతుంది.  పాడి రైతులకు బ్యాంకుల సహకారంతో రుణాలు ఇప్పించి, ప్రైవేట్‌ డైయిరీల పోటీ తట్టుకునేందుకు జిల్లా, మండల కేంద్రాలలో పాల ఉత్పత్తుల   ఔట్‌లెట్‌ అమ్మకం కేంద్రాలను ప్రారంభించాలి.   కల్తీ మీద ప్రచారం విస్తృతంగా పెరగాలి. వాటి వల్ల కీడు ప్రజలకు  తెలియజేయాలి. ఫెర్టిలైజర్స్ వాడకం, కాన్సర్ కారణం అనే విషయాన్ని కూడా తెలియజేయాలి. ఆరోగ్య తనిఖీ అధికారులు సంఖ్య పెరగాలి, వారి అధికారాలు పెరగాలి, కఠిన శిక్ష పడాలి. అలాగే ప్రభుత్వం సేంద్రియ ఆహారాన్ని  చౌకగా ఉండేట్లు చూడాలి మంచి ఆహార అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు  వాటి వల్ల లాభాలు చెప్పి ప్రోత్సహించాలి, అప్పుడు ప్రజలు సేంద్రియ  వ్యవసాయంపై ఆసక్తి  పెరుగుతుంది. ఇలాంటి విషయాలపై భారతీయత ఎందుకు కనిపించదో అర్థం కాదు.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

Leave a Reply