-మత్స్యకారుల సమస్యలు పరిష్కారిస్తాం
-గత ప్రభుత్వంలో దుర్మార్గమైన నిర్ణయాలు
-అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో రాష్ట్ర వ్యవసాయ , మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
విజయవాడ: అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో భాగంగా శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న అనేక మందిలో మత్స్యకారులు ప్రధానమని, అటువంటి మత్స్యకారులను గత వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు నిర్ణయాలతో ఇబ్బందులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడం మంచి అవకాశమని అన్నారు. రాష్ట్రంలో 3325 చిన్న తరహా సాగునీటి చెరువులు, 23,920 గ్రామ పంచాయతీ చెరువులు, 118 రిజర్వాయర్లు ఉన్నాయని, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ చెరువులను మత్స్యకారుల సొసైటీలకు ఇచ్చి వారి జీవన విధానం మెరుగుపరిచారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
గత ప్రభుత్వం జీవో 217 తెచ్చి మత్స్యకారుల సొసైటీల పరిధిలో ఉన్న చెరువులను ఆన్లైన్ టెండర్ల ద్వారా వైసీపీ కార్యకర్తలకు అప్పగించి మత్స్యకారుల పొట్ట కొట్టిందన్నారు. కులవృత్తులపై జీవనం సాగించే వారి పొట్ట కొట్టే దుర్మార్గపు చర్యలు గత ప్రభుత్వంలో ఎన్నో ఉన్నాయన్నారు.
మత్స్యకారుల మెడకు ఉరి తాడు వేసిన జగన్ రెడ్డి తెచ్చిన జీవో 217ని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, మత్స్య కారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.