* విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇవ్వండి
* మిగిలిన విద్యార్థులకు వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి
* ‘అన్నపర్రు’ ఘటనలు పునరావృతం కానివ్వొద్దు
* టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి సవిత స్పష్టం
అమరావతి : జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అన్నపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యేకే డిశ్చార్జి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. అన్నపర్రు బీసీ హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, జీజీహెచ్ సూపరెంటెండెంట్ ఎస్.వి.వి.రమణతో మంత్రి సవిత శనివారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థు ఆరోగ్య పరిస్థితి గురించి జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్.వి.వి.రమణను అడిగి తెలుసుకున్నారు. 60 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రికి చేరగా, ప్రస్తుతం 24 మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఒక విద్యార్థి ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్.వి.వి.రమణ తెలిపారు. ఆ విద్యార్థి ఇంతకుముందు నుంచే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధడుతుండడంతో ఐసీయూలో వైద్యమందిస్తున్నామన్నారు. మరో ఇద్దరు విద్యార్థులు పెదనందిపాడు కల్యాణమండపంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారన్నారు. మిగిలిన విద్యార్థులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశామన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత స్పందిస్తూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆ విద్యార్థుల ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తరవాతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై గంటకు గంటకూ అప్ డేట్ ఇవ్వాలని స్పష్టంచేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తక్షణమే ఎయిమ్స్ కు తరలించాలని మంత్రి సవిత ఆదేశించారు.
వారికి వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి
డిశ్చార్జి అయిన విద్యార్థులతో పాటు హాస్టల్ లో ఉన్న మిగిలిన విద్యార్థులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణను, డైరెక్టర్ మల్లికార్జునను మంత్రి సవిత ఆదేశించారు. హాస్టల్ లో పరిశుభ్రతతపై తీసుకున్న చర్యలు గురించి డీబీసీడబ్ల్యూవో మయూరిని అడిగి తెలుసుకున్నారు. వేడి చల్లార్చిన నీటితో పాటు తాజా ఆహారమే వారికి అందివ్వాలన్నారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ చల్లాని స్పష్టం చేశారు. హాస్టల్ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లకు వెళ్లదలుచుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులను పిలిచి వారితో పంపించాలన్నారు.
‘అన్నపర్రు’ లాంటి ఘటనలు పునరావృతం కానివ్వొద్దు
అన్నపర్రు బీసీ హాస్టల్ లాంటి ఘటన రాష్ట్రంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండేలా వార్డెన్లను ఆదేశించాలన్నారు. డీబీసీడబ్ల్యూవోలు తమ పరిధిలో హాస్టళ్లను నిరంతం పర్యవేక్షించాలన్నారు. హాస్టళ్లలో వార్డెన్లు ఉండేలా చూడాలని, బయట ఆహారం హాస్టళ్లోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి సవిత స్పష్టం చేశారు