Suryaa.co.in

Family

అగ్ని సాక్షిగా వివాహం.. అనేది ఎందుకు?

అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం ఋగ్వేదంలో వివరించారు.

“సోమః ప్రధమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరః
తృతీయాగ్నిష్టే పతిః తురీయప్తే మనుష్యచౌః”
అని వివాహ సమయములో వరుడు స్త్రీతో అంటాడు. అంటే “నిన్ను ప్రారంభ కాలంలో సోముడూ, తరువాత గంధర్వుడూ, ఆ తరువాత అగ్నీ ఏలారు. ఇహ నాల్గవ వానిగా నేను నిన్ను ఏలుతాను” అని అర్థం.

అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసినది సోముడు (చంద్రుడు). ఎన్ని సార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసి పాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన.

కొంత వయసు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళిపోతాడు. ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించాడు. “లావణ్యవాన్ గంధర్వః” అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశ పెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమయిన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని, చందనాన్ని ఇచ్చేసి నా పనయిపోయింది ఇక నీదే పూచీ అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళిపోతాడు.

ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు. “అగ్నిర్వై కామ కారకః” అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని (కామాగ్ని) ప్రవేశ పెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది.

ఇహ ఆమె వివాహానికి యోగ్యురాలని భావించిన అగ్ని, ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక కళ్యాణ సమయములో ఆమెను వరునికి (నరునికి) ఇస్తాడు. అలా ఆమెను “అగ్ని సాక్షిగా” వరుడు స్వీకరిస్తాడు.

– రవీంద్రనాధ్‌ మంతా

LEAVE A RESPONSE