Suryaa.co.in

Family Features

కోడళ్ళ కోసం పరితపిస్తున్న పేరెంట్స్

– అర్హత లేకున్నా అందలం ఎక్కుతున్న అమ్మాయిలు
(ఓంకార్ హరిశంకర్ పటేల్)!

కొడుకు కు ముప్ఫై ఏళ్ల లోపు పెళ్లి కాకుంటే ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాడనే బెంగ తల్లి దండ్రులను పట్టి పీడిస్తుంది. ఎక్కడ చూసినా మహిళా జనాభా ఎక్కువైనా కూడా, ముప్ఫై ఏళ్ల వరకు అమ్మాయిలు కూడా పెళ్లి ధ్యాస లేకుండా ఉద్యోగం వెలగ బెడుతుండంతో, పురుషాధిక్యత సమాజంలో ఆడవాళ్ళ పెత్తనం పెరిగిపోయి, పెళ్లి కాని ప్రసాదు లు తాళి బొట్టు పట్టుకొని, అమ్మాయి కోసం వెంపర్లాడం తో ఈ తరం అమ్మాయిలు చెట్టెక్కి మరీ పిల్లవాడి రెజ్యూమ్ చూసి పెదవి విరవడంతో.. ఒక అమ్మాయికి పదిమంది నిష్పత్తి చొప్పున పెళ్లి చూపుల పరంపర కొనసాగుతూనే ఉంది!

అబ్బాయిలు బెండకాయ ముదిరినట్టు ముదిరి పోతున్నా పెళ్లి జాడ లేక విలవిల లాడి పోతున్నారు. అమ్మాయిల డిమాండ్ కన్నా.. ఆమెను కన్న పేరెంట్స్ కోరికలు చాంతాడు అంత ఉండడం తో, పెళ్ళి కొడుకులు క్యూ కడుతున్నారు. వాడికి పర్మినెంట్ జాబు ఉండాలి. ఒక ఐదెకరాల పొలం ఉండాలి. హైదరాబాద్ లో కోటి రూపాయల అపార్ట్మెంట్ ఉండాలి. అమ్మాయి మెళ్ళో ఇరవై ఐదు తులాల బంగారం వేయాలి. పెద్ద వివాహ వేదిక లో వెయ్యి మందికి భోజనం పెట్టాలి ఆన్న డిమాండ్.

అమ్మాయి పెళ్లి అయ్యాకా కూడా జాబ్ చేస్తే, ఆ అమ్మాయి సంపాదన తల్లి దండ్రులకు చెందాలి ఆన్న ప్రధాన డిమాండ్ల కు తలవొగ్గి, పెళ్లి పీటల మీద కు అమ్మాయి వచ్చే వరకు వణుకుతూ పెళ్లి పనులు చేసే మగ పెళ్లి వారి బాధలు, ఏ పగ వాడికి కూడా వద్దు! ఒక్క తెలుగు రాష్ట్రాల లోనే కాదు.

దేశం మొత్తం మీద అమ్మాయిల కోరికలు గుర్రాలు అయి పరిగెడుతుంటే.. భవిష్యత్ భారతంలో వివాహ వ్యవస్థ ఉంటుందా లేక సహ జీవన వ్యవస్థ గా మారిపోతుందా అనే భయం విద్యాధికులు, సంప్రదాయ వాదుల కు పట్టుకుంది. ఎందుకంటే కాలేజీ దాటగానే ఉద్యోగం ఆఫర్ రావడంతో, ఇరవై ఐదేళ్ళకే అమ్మాయిలకు ముప్ఫై వేల ఉద్యోగం దొరకడం…మూడేళ్లలో అది రెట్టింపు కావడంతో సొంత కారు…కావాల్సిన కాస్మెటిక్స్…మాడ్రన్ దుస్తులతో కార్పోరేట్టు కల్చర్ లోకి వెళ్లి పోతున్న అమ్మాయిలు…పెళ్లి ధ్యాస మరిచి రంగుల ప్రపంచం లో విహరిస్తూ ఆడింది ఆట పాడింది పాట జీవితం కొనసాగుతుంటే, పెళ్లి మీద ద్యాస ఎందుకుంటుంది?!

దానికి తోడు అమ్మాయిల కొలీగ్స్ లలో ఇద్దరో ముగ్గురో డైవర్స్ కేసులు ఉంటే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడి, “పెళ్లి చేసుకొని వాడి చెప్పిన మాట వినే కన్నా సోలో లైఫ్ బెటర్” అనే అమ్మాయిల సైకాలజీ వల్ల.. పెళ్ళిళ్ళు అటు మొగవారికి ఇటు ఆడవారికి సరియైన వయసులో జరగపోవడం, దానికి తోడు అబ్బాయి మంచి వాడా చెడ్డవాడా అని తెలుసుకోవడానికి ఆర్నెళ్ళు సహజీవన యాత్రలు చేసి రావడంతో, మోజు తీరి మరో ఎర్నర్ కోసం వెతుకుతున్న ఈ తరం యువతుల వల్ల వివాహ వ్యవస్థ పెద్ద కుదుపునకు లోనవుతుంది.

కులం చెడ్డ సుఖం దక్కాలనే పెద్దల మాట పెడచెవిన పెట్టి, రంగు రూపు చూసి వాడి బుట్టలో పడి రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొని.. వాడు సకల కళా వల్లభుడు అని తెలుసుకొని అమ్మ గారి ఇంటికి చేరుకుని లబోదిబోమంటే పోయిన మృదుత్వం వస్తుందా?! ఇలా ముప్ఫై ఏళ్లు గడిచాకా డబ్బున్న ఏజ్ బార్ వాడు దొరికితే వాడితో నైనా సరిగా సంసారం చేస్తుందా అంటే అదీ లేదు!

పిల్లలు పుడితే అందం ఎక్కడ మసి బారుతుందో అని ముప్ఫై ఐదేళ్ల వరకు పిల్లలు కనకుండా.. టాబ్లెట్లు మింగే అమ్మాయిల అతి ప్రవర్తన వల్ల మనవలు – మనవరాళ్లు కావాలనుకునే పేరెంట్స్ ఆశలు అడియాశలు అయి పోతున్నాయి. 2024 లో యువతుల పెళ్లి సందడి ముప్ఫై ఏళ్ళు దాటుతుంది. అంటే అమ్మాయిల్లో పెళ్లి ద్యాస కన్నా, సంపాదన ద్యాస ఎక్కువగా ఉందనే విషయం తేట తెల్లమవుతుంది.

ఏ వయసులో ఆ వయసు ముచ్చట తీరాలని పెద్దలు ఊరికే అనలేదు. అది లేకే నేటి పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి. ఎంత మంచి ముహూర్తం పెట్టినా కూడా.. పెళ్ళిళ్ళు మూడు నాళ్ళ ముచ్చటగా కావడానికి ఆడపిల్లల తండ్రులు మొదటి కా రణం కాగా, పిల్లవాడు సెటిల్ కాలేదని అబ్బాయి ఆదాయం పై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు రెండో కారణం!

ముప్ఫై ఏళ్ల వరకు మహా అయితే ఆదా చేసుకుంటే యాభై లక్షలు ఉంటాయి కాబోలు. కోటి ఆశలు తల్లి దండ్రులకు ఉంటే, ఆ కోటి వచ్చేసరికి నెత్తి మీద జుట్టు ఊడి పోతూ లేక…చిక్కి శల్యమైన పోరన్ని ఏ పిల్ల పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది? ఆడపిల్లలు అందరూ మహేష్ బాబు లాంటి అబ్బాయి…ఆయన లా ఆడి కారు ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు.

కానీ అలాంటి వరుడు వేటలో ఉన్న ఎంపిక అయ్యే సరికి.. ఈడు పోయి అనాకారి దొరికితే వాళ్ళ ఆశలు అడి యాశలు అయి, పెళ్లయిన ఏడాదికే కోర్టు మెట్లు ఎక్కుతూ డైవర్స్ ఆట మొదలు పెడుతున్నారు. ఇక పవిత్ర భారత దేశంలో ఇప్పుడు అత్తల ఆరళ్ళ కన్నా, కోడళ్ళ ఆరళ్ళు ఎక్కువవుతున్నాయి.
పెళ్లయిన ఆరునెలలకే కే వేరు కాపురం పెట్టి, అత్త మామలు రాకుండా సూటి పోటి మాటలు అంటూ, దూరం పెడుతున్న వనితల అతి ప్రవర్తన వల్ల, కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోయింది. వృద్ధాప్యంలో కొడుకు కన్నా, ఇంటి ముందు శునకం పెంచుకోవడం బెటర్ అనే మైండ్ సెట్ లో ఓల్డ్ ఏజ్ పేరంట్స్ ఉంటున్నారు.

పొరపాటున ఆడపిల్లల కన్నా తల్లి దండ్రులు కూడా అటు అల్లున్ని పంచన చేరలేక…చేరినా కూడా అక్కడ అడ్జెస్ట్ కాలేక మానసిక వేదన తో కుమిలిపోతున్నారు. ఇక ఇద్దరు కొడుకులు- ఇద్దరు కూతుళ్లు ఉన్న ఇంట్లో పేరెంట్స్ బాధ వర్ణనాతీతం. ఆస్తుల పంచాయతీలు ఒక వైపు.. ఆదరణ లేక వృద్ధ పక్షులు ఒకరికి ఒకరై ఓదార్చు కుంటు, దేవుడు ఎప్పుడు తీసుకు వెళ్తాడా? అని ఎదురు చూస్తున్నారు!

పదేళ్లు ఎత్తుకొని కాలికి ముల్లు అంటకుండా పెంచిన పిల్లలు…సంపాదన పరులు అయ్యాకా తల్లి దండ్రులకు, మంచి చెప్పులు కూడా కొనివ్వని దౌర్భాగ్య పరిస్థితి నేడు కనబడుతుంది. నాలుగు రోజులు పెద్ద కొడుకు…నాలుగు రోజులు బిడ్డ దగ్గర ఉంటే వాళ్లకేం తోడి పెడుతున్నారని కొడుకు – కోడళ్ళ వేధింపులతో, ఒంటరి జీవనంలో ఇమడలేక….అటు పిల్లలు ఆదరణ కోల్పోయి, కళ్ళ వెంట ధారగా కన్నీళ్లు కారుస్తూ ఎవరూ ముందు పోయినా మరొకరికి కష్టం అని భార్యభర్తలు ఒకరికొకరం ఉన్నామని ధైర్యం చెప్పుకుంటూ జీవనం వెళ్ళ బోస్తున్నారు. చాలా మంది అత్తమామలు కొడుకు కోడలు నుండి ఆదరణ – ఆప్యాయతతో కోరుకుంటారు. చాలా సందర్భాలు వాళ్లకు అది దూరం అవుతుంది.

మన ‘ఆధునిక సమాజంలో అత్త మామలు అడ్జెస్ట్ కాలేక పోతున్నారు. ఇదీ చాదస్తం అనే కన్నా ప్రేమ ఎక్కువవడం అంటే కరెక్ట్! భారతదేశంలోని కొంతమంది కోడలు ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక సమస్యలు. దీని వల్లే తలెత్తుతున్నాయి. అత్త పెత్తనం కోడలు సహించదు. తన కోడలు తన చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటున్న తల్లి.. తన కూతురు మాత్రం స్వేచ్ఛ లేదు అని ఆరాట పడుతుంది. మహిళల్లో ఈ ద్వంద వైఖరి వల్లే కోడళ్ళు శాడిస్ట్ లుగా తయారవుతున్నారు.

అత్తమామలతో జీవించడం వాళ్లకు పెద్ద సవాళ్లు గా అనిపిస్తుంది.
ఈ తప్పుడు భావాలు అనాదిగా ఉంటూనే ఉన్నాయి. కోడలు బిడ్డ కాదు. అల్లుడు కొడుకు కాదు అనే మైండ్ సెట్ ఇంకా వందేళ్లు అయినా మారేట్టు లేదు! అత్తగారు – కోడలు మధ్య సంబంధం నిజానికి అందంగా ఉండాలి..

కానీ తరచుగా వారి మధ్య ఘర్షణ వాతావరణం, ఆధిపత్య పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ తప్పుడు భావాలు ఇద్దరి మధ్య మంచితనాన్ని నాశనం చేస్తున్నాయి. బహుశా, అత్తమామల జోక్యం, కొడుకు పై పెత్తనం వల్ల తాను స్వాతంత్ర్యం కొల్పోతు న్నాననే అభద్రత భావం లో కోడలు ఉంటుంది. ఆ భయాలను ఆమె తల్లి దండ్రులు ఎక్కువ చేయడం వల్ల ఇంట్లో అశాంతి ఎక్కువవుతుంది.

తన కుమార్తె తన అత్తమామలతో సుఖంగా జీవించాలని కోరుకునే తల్లి దండ్రులు ఉంటే, ఇలాంటి అపశృతులు రావు. కూతురికి ఒక న్యాయం కోడలికి ఒక న్యాయం ఉండాలని కోరుకోవడం వల్లే ఈ అశాంతి! ఒక కోడలు మరియు ఆమె అత్తగారి మధ్య ఏర్పడే సమస్యలు ‘పోటీ’ పడుతుంటాయి. ఇది వివాహ వ్యవస్థలో చాలా సమస్యలను కలిగిస్తుంది.

తల్లి మరియు భార్య ఇద్దరి మధ్య కొడుకు నలిగి పోతాడు. తల్లి కన్నా పెళ్ళమే బెల్లం అనుకున్న మరుక్షణం, కొడుకు ఇంటి వైపు తల్లి చూడదు! అటు తల్లి ఇటు పెళ్ళాం మధ్య మానసిక వేదనకు గురయ్యే పుత్ర రత్నాలు కూడా కోకొల్లలు!

ఈ ఇంటికి నేను మొదటి కోడలు ను అనే ఇగో తల్లిలో బలంగా ఉంటుంది. 35 సంవత్సరాల క్రితం ఈ ఇంటి పరువును నిలబెట్టాను. అలా నువ్వు అణిగి మణిగి ఉండాలని అత్తా కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఆనాటి అత్తలు వేరు, ఈ నాటి కోడళ్ళు వేరు! ఆనాటి అత్తలకు కావాల్సిన అస్తి ఉండేది. దానికి చూసుకోవడానికి కోడలు కు ఇంటి బాధ్యత అప్పగించేది.

అయిన ఆనాటి అత్త కోడళ్ళు మధ్య కూడా అభిప్రాయ బేధాలు ఉండేవి. ఇంటి నిండా పనిమనుషులు ఉన్నారు కాబట్టి, ఇంటి గుట్టు బయట పడలేదు. ఇప్పుడు అలా కాదు. కోడళ్ళు సంపాదన పరులు అయ్యారు. అత్త కొంగు పట్టుకు తిరగాలి అంటే ఏ కోడలు ముందుకు రాదు. ఇప్పుడు కట్న కానుకల కన్నా స్వేచ్ఛ జీవితం కోరుకుంటున్న ఈ తరం జంటల వల్ల.. మానవ సంబంధాలు ఆప్యాయతలు గంగలో కలిసి పోయాయి. మనవలతో అడుకొనివ్వని కోడళ్ళు…అతి గారాబం చేయవద్దని చెప్పే కొడుకుల వల్ల, తాత మనవలు ఆత్మీయత మసి బారి పోయింది.

కొత్తగా పెళ్లయిన వధువులు తమకు ఇష్టమైన దుస్తులను ధరించడానికి, లేదా వారి తల్లిదండ్రులను ఎప్పుడు తన దగ్గరకు వచ్చి పోతుండాలి అని కోరుకుంటుంది తప్ప.. అత్తా మామలను ఆదరించాలని అనుకోక పోవడం వల్లే, అత్త కోడళ్ళ మధ్య బాగా గ్యాప్ పెరిగిపోతుంది. ఒక వేళ కొడుకు ఇంటికి వెళితే ఆలస్యంగా నిద్ర లేచిన కోడలు… చెప్పులు వేసుకొని ఇంట్లో తిరిగే కోడలు…పూజలు పునస్కారాలు లేకుండా, స్నానం ఆచరించకుండానే వంటింట్లో దోసెలు వేసే కోడళ్ళ పనితీరు వంట బట్టలేక, ఏదైనా మాట అత్త గారు అంటే తాను స్వేచ్చలేని పంజరంలో చిలుకను అయ్యాయని ఏడుస్తూ.. బెడ్ రూం లో అలక పాన్పు ఎక్కుతున్న సుందరాంగి మాటలు విని , తల్లి పై కోపగిస్తున్న కొడుకుల ప్రవర్తన వల్ల కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోతుంది. అత్తమామలు కొడుకు ఇంటికి వస్తే.. హై-సెక్యూరిటీ జైలు లో బంధించి నట్టు కోడలు ఫీలు అవుతుంది. అత్త ‘నియమాలు’ కొడలు కు నచ్చవు. కోడలు తీరు అత్తకు నచ్చదు.

పిల్లల ఏకైక బాధ్యత ఎలా కోడలు తీసుకుంటుందో. అత్తమామలతో కలిసి జీవించడం కూడా బాధ్యత అనుకునే కోడళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ!వృద్ధ అత్తమామలతో కలిసి జీవించడం, ప్రతి కోడలికి ఎంతో విజ్ఞాన దాయకం. ఎందుకంటే వారి ప్రతి చిన్న విషయం పట్ల శ్రద్ధ వహించడం వాళ్ళు చేస్తారు. తెలివైన కోడలు అయితే అత్తా మామలతో ప్రేమ గా ఉంటే సగం పనిభారం తగ్గినట్టే!
అత్త గారే వంట చేస్తుంది. మామ గారే పిల్లలను బడికి పంపే బాధ్యత తీసుకుంటారు. కానీ వంటింట్లో ఏదో దోచుకుపోతుంది అని భయపడి, కిచెన్లోకి రానివ్వని కోడళ్ళు…కోడలు ఇంట్లో సమకూర్చిన ప్రతి వస్తువు తన కూతురు ఇంట్లో ఉండాలని అనుకునే అత్తల వల్ల, ఈ గ్యాప్ ఎక్కువవుతూనే ఉంది! భారతదేశంలో పవిత్రమైన కర్తవ్యంగా అత్త కోడళ్ళు ఉండాలి. కానీ ఈ తరం కోడళ్ళ లో మార్పు వస్తేనే, కుటుంబ వ్యవస్థ మళ్ళీ చిగురిస్తుంది!!

(రచయిత మ్యారేజ్‌బ్యూరో నిర్వహకులు)

LEAVE A RESPONSE