Suryaa.co.in

Telangana

అంబేద్కర్ మహాశయా….. మన్నించు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

మీ వంటి చారిత్రక పురుషుని విగ్రహాన్ని దళిత ద్రోహి ప్రారంభించడం బాధగా ఉంది. మీరు రాసిన రాజ్యాంగాన్ని తిరగరాస్తామంటూ మిమ్ముల్ని అడుగడుగునా అవమానించినోళ్లే ఓట్ల కోసం మీ జపం చేస్తున్నారు. గత 8 ఏళ్లలో ఏనాడూ మీ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు హాజరుకానోళ్లు మీ గురించి మాట్లాడుతున్నారు. నిరసనలు, ధర్నాలను నిషేధిస్తూ ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా ఖూనీ చేస్తున్నోళ్లే మీ సిద్దాంతం గొప్పదని బాకాలు కొడుతున్నారు. దళితులను దారుణంగా మోసం చేసినోళ్లు, దళిత సీఎం, దళితులకు మూడెకరాల హామీని తుంగలో తొక్కినోళ్లే ఓట్ల కోసం దళిత జపం చేస్తున్నారు. నిరుపేద దళిత కుటుంబాలను గాలికొదిలేసి సొంత పార్టీ కార్యకర్తలకు ‘‘దళిత బంధు’’ నిధులను పంచిపెడుతున్నోడు అణగారిన వర్గాల అభ్యున్నతి గురించి మాట్లాడుతున్నారు.

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తమ జీవితాలనే సర్వస్వం ధారపోసిన మహనీయుడు మీరు. అందరికీ ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి మీరు. అలాంటి మీ విగ్రహం వద్దే ఓట్ల రాజకీయ క్రీడను మొదలు పెట్టడం బాధగా ఉంది. దళితుల కన్నీటి వర్షాన్ని మీరు తుడిస్తే దళితులను అంధకారంలోకి నెట్టినోడు కేసీఆర్. మహిళల సమున్నత అభివృద్ధిని కోరుకున్న మహా వ్యక్తి మీరు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక తొలి మంత్రివర్గంలో చోటు ఇవ్వని అహంకారి కేసీఆర్. బోధించు.. సమీకరించు.. పోరాడు నినాదంతో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని సర్వస్వం ధారపోసిన మహనీయుడు మీరు.

ప్రజలను విశ్వసించను.. ప్రజలను కలవను.. ప్రజల పోరాటాలను సహించననే నినాదంతో పాలన చేస్తూ తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న దుర్మార్గుడు కేసీఆర్. మీ ఆశయాలను కొనసాగిస్తానంటే నమ్మేదెవరు? 2024లో కేంద్రంలో బీఆర్ఎస్ అధికారం వస్తుందని కేసీఆర్ మీ విగ్రహం సాక్షిగా చెప్పడం ఈ శతాబ్దపు పెద్ద జోక్. 9 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను గాలికొదిలేసి ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ఇంకా పగటి కలలు కంటున్నారు. అంబేద్కర్ మహాశయా…. మాట ఇస్తున్నా. 2024 దాకా ఎందుకు? 2023లోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాం. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అధికారంలోకి వచ్చాక మీ ఆశయాలకు అనుగుణంగా పాలన చేస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడతామని బీజేపీ పక్షాన హామీ ఇస్తున్నా.

LEAVE A RESPONSE